ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి,  అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. ."ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల"నీ, "ఒక పూర్తి మానవుడిగా పరిణమించాల"నీ, నేను కంటున్న కల,  కడుతున్న కోట. . .ఒహ్ ఇంతెందుకు కనుచూపు మేరలో. . . నా జీవితం ఒక వేద సంకలనం!!  నేనొక ఈశ్వరుడిని!!! ( ఇది ఈ బ్లాగులోని ప్రసంగి కథలో ఒక పాత్ర మనోభావాలు __ రచయిత )

Wednesday, January 23, 2008

వేంకటేశ్వరుడు – గడప

వేంకటేశ్వరుడు – గడప
ఇది నా స్వీయ రచన కాదు. ఒక స్నేహితుడిచ్చిన పాత సినిమా స్కిప్టులో చదివి రాస్తున్నా. ఏదైనా సినిమాలో ఈ విషయం చెప్పారో లేదో కూడా నాకు తెలీదు.

శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలో నిరంతరం భక్తుల సేవలందుకునే వేంకటేశ్వర స్వామి వారి గర్భగుడి ద్వారతోరణం దగ్గరి గడపకి ఓ రోజు ఓ ధర్మసందేహం కలిగిందట. సందేహం కలిగిన వెనువెంటనే ఆలస్యం చేయకుండా సదరు గడప శ్రీ వెంకటేశ్వర స్వామిని సందేహ నివృత్తి కోసం యిలా ప్రశ్నించిందట.

“ఆయ్యా స్వామీ! తమరూ రాయితో తయారు చేసినవారు. నేనూ రాయితోనే చేయబడ్డాను. తమరికీ, నాకూ తండ్రి అయిన శిల్పి ఒకరే. అయినప్పుడు, తమకి ఈ నిత్య మంగళ హారతులేమి. నన్ను మాత్రం ఈ లక్షలాది మంది భక్తులు మట్టి కాళ్ళతో తొక్కకుంటూ తమరికి ‘గోవింద’ నామ భజన చేయడమేమిటి?” అని.

ఆ మాటకా తిరమలాధీశుడు గడపని చూసి ఓ చిర్నవ్వు నవ్వి, సమాధానం యివ్వకుండా మిన్నకుండి పోయాట్ట.

ఆ చర్యతో ఆ గడప మరింప మనస్తాపం చెంది, “స్వామీ! తమ భక్తులతో పాటు తమరు కూడా నన్ను చిర్నవ్వుతో హేళన చేయడం ఏమంత బాగోలేద”ని మదనపడి, ముఖం (అయినా గడపకి ముఖం ఎక్కడిది. గడపమొహం కాకపోతే) చిన్నబుచ్చుకున్నదట.

ఆ మాటలకి శ్రీ స్వామివారు స్పందిస్తూ, యిలా సమాధానం యిచ్చార్ట.

“ఒసే గడపా! నన్ను కళా తపస్వియైన ఒక శిల్పి దీక్షగా యేళ్ళ తరబడి శ్రమించి కోటానుకోట్ల వులి దెబ్బలకి నన్ను గురిచేసి, తను శ్రమించి, నన్ను బాధించి మలిచిన పిదప నేను ఈ మహిమాన్వితమైన ఈ సుందర రూపం దాల్చి భక్తుల మనసుల్ని దోచుకోగలిగాను. ఇక నీ మాటంటావా. నీదేముంది? ఒక రాయిని తీసుకుని అదే శిల్పి వులితో అటో దెబ్బ, యిటో దెబ్బ వేస్తే నువ్వు గడపవై కూర్చున్నావు. నీకు దెబ్బలూ తక్కువే. పూజలూ తక్కువే. ఇప్పుడర్థమయిందా?” అన్నాట్ట.

అంతట, ఆ సమాధానం విని సదరు గడప “అరే! నిజమే గదా స్వామివారి గొప్పదనం!” అని సంతృప్తి చెందిందట.

ఇందుమూలంగా, ఈ కథను చెప్పడం మూలంగా నేను యావన్మందికీ తెలియజేయునది యేమనగా, ఈ కథలోని వేంకటేశ్వరుడికి మల్లే ‘ఫెటేల్’ మని ఈడ్చిపెట్టి కొట్టే జీవితానుభవం నుండి తద్వనుభవ సారాన్ని పిండుకుని, సారస్వతం ద్వారా యితరత్రా పరిశీలనా ప్రక్రియల ద్వారా కొంత ప్రంపంచ జ్ఞానాన్ని, పదార్థ స్వరూపజ్ఞానాన్ని, స్వస్వరూపజ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని పొందిన వ్యక్తులు ఏదో ఒక విధంగా తమ విశిష్టతను తాము చాటుకుంటూనే, యితరులకు ప్రయోజనకారకులౌతారని.

ప్రయోజకులై పదిమందికీ సహాయకారులయే వారు అందరూ ఆమోదించదగ్గ వ్యక్తులే గదా. అదీ ఈ టపా వెనుక సారాంశం.

ఏదో సందర్బంలో విశ్వనాధ వారు ఈ మాటన్నారు.

“పది విషయములు దెలిసియున్న భిన్న వస్తు స్వరూపజ్ఞానము దెలియినుగానీ, తెలిసినదియే ఒకటియై దాని యందే సర్వోత్కృష్టతా భావమును కలిగియుండుట బహు మానవులకు జీవితములో సంభవించునొక దురదృష్టము” అని.

అయితే, యిదంతా కూలంకషంగా చదివిన పిదప మీకో సందేహం కలగొచ్చు. వేంకటేశ్వరుడు చాలా దెబ్బల కోర్చి ఘనుడైనట్టు ఎప్పుడూ కష్టాల కొలిమిలో కాలుతూండే కార్మికులూ, కూలీనాలీ జనాలూ బతుకులో మనందరికంటే ఎక్కవ దెబ్బలు తినే వుంటారు గనుక, వాళ్ళంతా ఎందుకు జ్ఞానవంతులు కారూ? అని.

ఈ సందేహం కలిగిన వారికి నాదొకటే సమాధానం.

కష్టాలు పడినంతమాత్రాన ప్రయోజనం లేదు. కష్టమైనా, సుఖమైనా, జీవితంలో ఆయా అనుభవాల సారం పిండుకున్నవాళ్ళు, ఆయా విలువల్ని ప్రశ్నించి నిగ్గుదేల్చుకున్న వాళ్లు మాత్రమే గొప్పవారు కాగలరు!

మీరేమంటారు?
(సమాప్తం)