ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి,  అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. ."ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల"నీ, "ఒక పూర్తి మానవుడిగా పరిణమించాల"నీ, నేను కంటున్న కల,  కడుతున్న కోట. . .ఒహ్ ఇంతెందుకు కనుచూపు మేరలో. . . నా జీవితం ఒక వేద సంకలనం!!  నేనొక ఈశ్వరుడిని!!! ( ఇది ఈ బ్లాగులోని ప్రసంగి కథలో ఒక పాత్ర మనోభావాలు __ రచయిత )

Saturday, March 29, 2008

మానవ జీవితానికి మహాతాత్పర్యం!

మానవ జీవితానికి మహాతాత్పర్యం!

ప్రాచ్య, పాశ్చాత్య వాజ్ఞయంలో మహోన్నత మానవమూర్తులు ప్రవచించిన ఎన్నో వాదాలూ, ఎన్నో ‘యిజా’లూ, మరెన్నో నిజాలూ మనం చదువుకున్నా, యింకెన్ని నేర్చుకున్నా, మరెన్ని వున్నాయనుకున్నా, తత్వశాస్త్రం యావత్తూ క్షుణ్ణంగా పరిశీలించిన మీదట మనకి కడకి అర్థమయ్యేదీ, మిగిలేది మూడే మూడు వాదనలు. అందులో. . . భగవంతుడున్నాడనే అస్థిత్వవాదం ఒకటి. లేడనే నాస్తికవాదం మరొకటి, ఇంకేదో వుందనే వాదం. . .ఉదాహరణకి హేతువాదం తరహాలో. ఇటువంటివి చాలా మంది చాలా రకాలుగా నిర్వచించారు.

కాగా, ఆధునిక తత్వవేత్తలలో ఒకరైన భారతీయులూ మరియూ తెలుగువారైన కీ.శే. జిడ్డు కృష్ణమూర్తి గారి తత్వం యిటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందడమే గాక, యావత్ ప్రపంచాన్నీ ఆ తత్వం ఆలోచింపజేసింది. ప్రభావితం చేసింది. ఆయన తత్వానికనుగుణంగా దేశంలోనూ, యితరత్రా ఎన్నో రచనలూ, మరెన్నో గ్రంథాలూ ఉద్భవించి, వెల్లువెత్తాయనే చెప్పవచ్చు. ఆయన తత్వానికి ప్రభావితులయే కీ.శే. బుచ్చిబాబు గారు తెలుగులో “చివరకి మిగిలేది” గ్రంథాన్ని రచించారనే విషయం ప్రచారంలో వుంది. ఈ రచనలో ఒక పాత్ర ఒక ఖాళీ కవరును కథా నాయకుడి చేత విప్పించడం ద్వారా బుచ్చిబాబు గారు జీవితానికి అర్థం ఏమీ లేదనే విషయాన్ని ప్రస్థావిస్తారు. కానీ బుచ్చిబాబు గారు తన నవల పీఠికలో తన “నవలలోని పాత్రల అభిప్రాయాలన్నీ తను జీవితంలో నేర్చుకున్న పాఠాలుగా భావించవద్ద”ని వేడుకున్నారు. కనుక, ఆయన నవలలోని ఆ పాత్ర ద్వారా చెప్పించిన జీవితానికి అర్థం ఏమీ లేదన్న విషయం బుచ్చిబాబు గారి స్వీయభావనగా మనం పరిగణించరాదు.

ఇదిలా వుండగా, జీవితానికి అర్థం ఏమీ లేదనే వాదన ఈ మధ్య కాలంలో ప్రబలంగా వినపడుతున్నది. ఇలా చెప్పడం, చెప్పుకోవడం గొప్పగానూ, passion గానూ కన్పిస్తున్నది. అసలింతకీ జిడ్డు కృష్ణమూర్తి గారు గానీ, బుచ్చిబాబు గారు గానీ జీవితానికి అర్థం ఏమీ లేదనే వాదనని గానీ, తత్వాన్ని గానీ ఎక్కడ చెప్పారో, ఎప్పుడు చెప్పారో ఎవరికీ తెలీదు. వాళ్ళలా నిర్వచించారని ఎవరైనా అంటే అది సత్య దూరమైన మాట.

నిన్నటికి నిన్న ‘పొద్దు’ పత్రికలో ప్రచురితమైన శ్రీ ఫణీంద్ర గారి ‘కలం కలలు’ బ్లాగు మీద ప్రముఖ బ్లాగరు పప్పు నాగరాజుగారి ‘కలం కలల ఘలం ఘలలు’ అన్న సమీక్షా వ్యాసంలో ఫణీంద్ర గారన్న మాట యిది.

“మానవ అస్థిత్వానికి అర్థం లేదు. అర్థమేదో ఉందన్న అన్వేషణలో మనం పడే నిష్ఫలమైన సంఘర్షణే ఈ అస్థిత్వానికి కడకు మిగిలే అర్థం. అస్థిత్వానికి అర్థమే లేదంటే ఇక మిగిలేది జీవితమంత పొడవైన ఖాళీ; భీతి గొలిపే శూన్యత.”

ఈ మాట శ్రీ ఫణీంద్రగారు ఎందుకన్నారో, ఎటువంటి సందర్భంలో అన్నారో నాకు తెలీదుగనుక, నేను ఆయనను గానీ, మరొకర్నిగానీ తప్పు పట్టేదేమీలేదు గానీ, సరిగ్గా యిటువంటి భావనే యిటీవలి కాలంలో సర్వత్రా వ్యాపించుకుని వుందని చెప్పడానికి ఎంతో విచారిస్తున్నాను. ఇదెంతో బాధాకరమైన భావన. ఈ విషయం సవివరంగా ప్రస్థావించడానికే ఈ వ్యాసంలో ఫణీంద్రగారి మాటలు నేను వాడుకుంటున్నాను.

అసలు కీ.శే. జిడ్డు కృష్ణమూర్తి గారు ఏమన్నారు? “భగవంతుడనే విషయాన్ని ఒకరు మనకి చెప్పడం ద్వారా కాకుండా మనల్ని మనమే ఆత్మశోధన చేసుకోవడం ద్వారా, ప్రపంచ శోధన చేయడం ద్వారా మనమే నిగ్గుదేల్చుకోవలసివుంద”న్నారు. “మనిషి జీవితంలోని మంచిచెడులూ, ఆవేశకావేశాల వంటి మానసికోద్రేకాలనూ మనం తరచి, తరచి చూసి వాటి స్వరూప స్వభావాలను తెలుసుకోవాల”న్నారు. “వాటి స్వరూపం గురించి తెలిసినప్పుడే ఆయా ఉద్రేకాలు మనిషి చెప్పుచేతల్లో వుంటాయనీ, అలాగే, వ్యసనాలూ, వాటి మూలాలూ గ్రహిస్తే, మనం వ్యసనాలకు భయపడాల్సిన అవసరం లేదనీ, వాటంతటవే అంతరిస్తాయ”నీ అన్నారు. అలాగే “దైవం, భగవంతుడు వంటి కల్పిత భావనలు మనిషిలో ఆశను రేకెత్తించి, అతడ్ని పరాధీనుడిగా (dependable) చేసి, భ్రమల్లో వుంచి అతడి భవిష్య జీవితానికి గొడ్డలి వ్రేటుగా పరిణమించి, పాడుచేస్తాయనీ, ఆశ, దాని సంపూర్ణ స్వరూపాన్ని మనం తెలుసుకున్నప్పుడు దానంతటదే నశించి మనిషి భ్రమల్లో బ్రతకకుండా సత్యంతో ప్రత్యక్ష సంబంధం కలిగివుండే చురుకైన వర్తమానంలో జీవించడమే నిజమైన జీవితమ”నీ ఉద్ఘాటించారు.

“ఆలోచన పక్వత చెందినప్పుడు దానంతటదే తన పరిమితులెరిగి సద్దుమణుగుతుందనీ, అప్పుడే ప్రశాంతత సాధ్యమనీ, అటువంటి జీవితంలో అనుభవించేవాడూ, అనుభవించబడేదొటీ అంటూ విభజన వుండదనీ, అనుభవించడం అనే మైమరపు స్థితియే అసలైన జీవితమ”నీ వెలుగెత్తి చాటారు.

“మన కంటికెదురుగా వున్న సత్యాన్ని విస్మరించి, దైవం, భగవంతుడని ఎవరో చెప్పిన అభూత కల్పనలనీ, నమ్మకాలనూ, భావనలను విడనాడి, వర్తమానంలో ప్రతిక్షణం మానవుడు సత్యాన్ని సాక్షాత్కరింపజేసుకోవాలని ఆక్రోశించినారు. మానసికంగా ఏకాకియైన మనిషి (ఇది మనుషులందరికీ వర్తిస్తుంది) సత్యంతో సంబంధం కలిగివుండడం ద్వారా ఏకాకి తనాన్ని గిరవాటు వేయాల”ని ఉద్బోధించినారు.

ఈ ప్రకారం, ఫణీంద్రగారి యిది వరకటి ఈ మాటలను. . .

“మానవ అస్థిత్వానికి అర్థం లేదు. అర్థమేదో ఉందన్న అన్వేషణలో మనం పడే నిష్ఫలమైన సంఘర్షణే ఈ అస్థిత్వానికి కడకు మిగిలే అర్థం. అస్థిత్వానికి అర్థమే లేదంటే ఇక మిగిలేది జీవితమంత పొడవైన ఖాళీ; భీతి గొలిపే శూన్యత.”

ఇప్పుడు, ఈ మాటలకి జిడ్డు కృష్ణమూర్తి గారి తత్వాన్ని మేళవించి సరికొత్త అర్థంతో ఉటంకిస్తాను.

“మానవ అస్థిత్వానికి అర్థం వున్నది. అర్థమేదో ఉందన్న అన్వేషణలో మనం పడే సంఘర్షణే (నిష్ఫలమైనది కాదు. ఇదే చివరకి ఫలిస్తుంది) ఈ అస్థిత్వాన్ని కడకు మనకి తెలుపబోయే సాధనం. అస్థిత్వానికి అర్థం వుందనుకున్నప్పుడు, అసలు అస్థిత్వానికి అర్థం తెలుసుకున్నప్పుడు మిగిలేది జీవితమంతటా పొడవైన నిండుదనమే; భీతికి తావులేని నిండుదనం.”

ఇది అసలు నిజం. మీరేమంటారు?

(ఇది ఎవరినైనా కించపరచాలనో, వివాదాలు సృష్టించడానికో రాసిన వ్యాసం కాదు. మందుకి అలవాటు పడ్డ తాగుబోతుకి "యింక మందు లేదూ, లభించదూ" అంటే జీవితం ఎంత నిరాశాజనకంగా మారుతుందో, అలాగే భగవంతుడి మీద ఆధార పడిన మనిషి "భగవంతుడు లేడ"నే నిజం తెలిసుకున్నప్పుడు నిరాశాపూరితుడిగా, క్రియాశూన్యుడిగా మారకుండా, అసలా నిజం తెలుసుకున్నప్పుడే నిజమైన, నిండైన జీవితం గడపగలడనీ, గడప సమర్థుడనీ, భగవంతుడనే స్థితి లేకపోయినా సత్యంమనబడే అద్భుతమైన స్థితి, వర్తమానం మనకి ఎల్లప్పుడూ వున్నవనీ చెప్పడానికి ఉద్దేశించిన టపా యిది. ఇది నా స్వీయ ఛాదస్తం ఎంత మాత్రమూ కాదు. కాకుంటే శ్రీ పప్పు నాగరాజు గారి సమీక్ష, శ్రీ ఫణీంద్రగారి ఏ కథలోనివో, కవితలోనివో మాటలూ ఈ వ్యాసానికి ప్రేరకాలు)

(సమాప్తం)

Saturday, March 15, 2008

నేనెవరో తెలుసుకోండి!

‘నేనె’వరో తెలుసుకోండి!

నేను నేననుకుంటా. నిజానికి నేను నేనేనా? ఇది అసలు ప్రశ్న.

నా శరీరానికి నేను ఫలానా అని ఓ పేరెట్టుకుంటా. లేదంటే మా పెద్దలు పెట్టిన పేరుని అంగీకరించి, స్వీకరిస్తా. జననావయవాల కనుగుణంగా నేను స్త్రీననో, పురుషుడిననో అభివర్ణించుకుంటా. నా కుటుంబం ఫలానా అనీ, నా ఊరూ యిది అనీ, నా దేశం అది అనీ, నేనున్న గ్రహం . . . ఇలా విభజించుకుంటూ పోతా. నా బంధువులు ఫలానా వారనీ, నా స్నేహితులు ఫలానా వారనీ గుర్తించుకుంటా. నిజానికి నా ఊహలో తప్ప నాకూ నా బంధువులకి మధ్య బంధుత్వమనే గొలుసో, దారమో ఏదీలేదు. అయినా నన్ను నేను మోసగించుకుంటూనే వుంటా. ఎందుకంటే బంధువులు, స్నేహితులు లేకుండా నేను జీవించలేను. నాకు భయం. నేను నేజూసిన దృశ్యాల నుండీ, చదివిన పుస్తకాల నుండీ, విన్న మాటలూ, శబ్దాలనుండీ, స్పృశించిన జ్ఞాపకాలనుండీ, రుచి చూసిన పదార్థాల నుండీ కొంత జ్ఞానం నాలో పోగేశా. నేను పోగేసిన జ్ఞానం ఎంత పోగేసినప్పటికీ అది పరిమితమే. అపరిమితం కానేరదు. ఆ పరిమితమైన పోగేసిన జ్ఞానం లోనుంచి నేను మాట్లాడుతా. నీతులు వల్లిస్తా. ఇది నిజం, యిది అబద్ధం అని సిద్ధాంతాలు చేస్తా. ఇది మంచిదనీ, ఇది చెడ్డదనీ ప్రపంచాన్ని విభజించుకుంటూ పోతా. చెడు అనుకున్నదానికి దూరంగానూ, మంచికి దగ్గరగానూ వుండాలనుకుంటా. ఉన్నా, వుండలేక పోయినా. అలా నాకు చేతనయిన పనుల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకుని దాన్ని వృత్తిగా స్వీకరిస్తా. ఆ వృత్తిలో గడుపుతూ సంసార జీవితమో, లేదంటే బికారినై సన్యాస జీవితమో గడుపుతా.

ఇంతవరకూ బాగానే వుంది. ఇక్కడ నుండే అసలు తంటా. నేను నాకే తెలీని కొన్ని పదాలు విన్నా. దేవుడనీ, పరమాత్ముడనీ, ఆత్మ సాక్షాత్కారమనీ, విశ్వరూప సందర్శనమనీ ఏవో మాటలు. అలాగే ఆ దైవాన్ని దర్శించడం కోసం కొన్ని మార్గాలు ఎంచుకున్నా. వాటికి మతాలని పేరు పెట్టుకున్నా. లేదంటే వాటికి సంఘం పేర్లెట్టి చెప్పగా విన్నా. అసలు దైవాన్ని ఎందుకు దర్శించాలీ అంటే దైవాన్ని దర్శిస్తే ఈ ఈతిబాధలుండవట. దుఃఖమనేది అసలుండదట. లేదంటే స్వర్గానికి చేరుతానట. అక్కడ రంభా, ఊర్వశీ, మేనకాదులతో సుఖంగా జీవించవచ్చునట. అందుకోసం నేను దైవాన్ని దర్శించాలట. దైవం అనబడేది అపరిమితమైనదట. దానిని నేను దర్శించడానికి పరిమితమైన ఆలోచన పనికిరాదట. కనుక, నేను ఆలోచనను స్తంభింపజేసినప్పుడే, ఆపుజేసినప్పుడే నేను realize అయినట్టట. అప్పుడే ఆ దైవం నాకు లభ్యమౌతుందట. ఇంతకీ నేనెలా ఆలోచనని ఆపగలను. అసలు ఆపాలనుకోవడమే ఒక ఆలోచనే. ఇది సమస్య.

దీని కోసం కొన్ని మార్గాలు సూచించబడ్డాయి. ధ్యానమనీ, భావాతీత ధ్యానమనీ (ఆలోచనలు లేనిది), Meditation అనీ రకరకాలు. అసలు ఆలోచనని ఆపాలనుకోవడమే ఒక ఆలోచనే. ఇదంతా నాకు చెప్తున్న దెవరు. ఆలోచనే కదా? అటువంటప్పుడు ఆలోచన తన నశింపును తను కోరుతుందా? పరిమితమైన ఆలోచన తను అంతమై అపరిమితమైన బ్రహ్మపదార్థం గురించి నాకు తెలుపగలదా? ఇది అసలు సమస్య! కనుక, నేను realize అవడం అనేది వట్టిమాట. నేనెన్నటికీ realize కాలేను. కాబట్టి, నేనెన్నటికీ బ్రహ్మపదార్థాన్ని గురించి తెలుసుకోలేను.

అయితే ఈ దైవం, ఈ బ్రహ్మపదార్థం, ఈ సత్యం అనేది నాకెప్పటికీ లభ్యం కానిదేనా?

ఈ ప్రశ్నకే సమాధానంగా కాదంటారు పెద్దలు. నువ్వు ఎన్నటికీ realize కాలేవు. ఒకవేళ అయినా నువ్వు ఆలోచనని నియంత్రించడానికి ప్రయత్నిస్తావు. ఎప్పుడైతే ఆలోచనని అణచడం, నియంత్రించడం వుంటుందో అప్పుడది మరింతగా విజృంభిస్తుంది. అప్పుడు నీకూ ఆలోచనకీ మధ్య విభజన వుంటుంది. సంఘర్షణ వుంటుంది. విభజించేదేదీ సత్యాన్ని తాకలేదంటారు పెద్దలు.

కానీ, నీలోని ఆలోచన realize కాగలదంటారు. ఆ ఆలోచన realize అయినప్పుడే సత్యం అనబడేది సాధ్యం అంటారు. అదెలాగంటే యిలా. . .

నిజానికి నేను నేను కాదు. నేనొక ఆలోచన. భావాల, భావజాలాల పరంపర. నేనొక శరీరానికి అనుసంధించబడి వుంటా. (తిరిగి మొదటికొద్దాం) నా శరీరానికి నేను ఫలానా అని ఓ పేరెట్టుకుంటా. జననావయవాల కనుగుణంగా నేను స్త్రీననో, పురుషుడిననో అభివర్ణించుకుంటా. నా కుటుంబం ఫలానా అనీ, నా ఊరూ యిది అనీ, నా దేశం అది అనీ, నేనున్న గ్రహం . . . ఇలా విభజించుకుంటూ పోతా. (యిలా మిగతాదంతా కూడా).

నేను ఆలోచన గనుక, నేను పుట్టేదే నేను పోగుజేసుకున్న జ్ఞానం లోంచి. అంటే గతం లోనుండి. జ్ఞానం ఎంత పోగేసినా ఎన్నటికీ పరిమితమైనదే గనుక ఆలోచన అనబడే నేను ఎన్నటికీ పరిమితమైన దానినే. నిజానికి నేను గతాన్ని. నాకు అనుసంధించబడివున్న శరీరానికి ఒక పేరు పెట్టి, దాన్ని ఈ విశ్వం నుండీ, అఖండ సత్యం నుండీ దాన్ని విభజించినాను. నాలోని అల్పత్వాన్ని దానికి వర్తింపజేసినాను. కనుక, నేను ఎన్నటికీ నేను కాని దైవాన్ని గురించి వివరించలేను. నేను దైవాన్ని గురించి చెప్పినా, వేదాల గురించి చెప్పినా, మరే గురువు గురించి చెప్పినా, యింకో జిడ్డు కృష్ణమూర్తి గురించి చెప్పినా, ఎవ్వరి గురించి చెప్పినా, ఏది చెప్పినా నా వివరణ యావత్తూ దైవం కానిదాని గురించే! నేనిప్పుడు realize అయినాను. నా పరిమితులు నేను తెలుసుకున్నాను గనుక నేను చెప్పేదంతా అసత్యమే. ఎందుకంటే సత్యం అపరిమితమైనది గదా. దాన్ని పరిమితమైన నేను స్పృశించలేను. నేను realize అయినప్పుడు, నేను చెప్పేదంతా అసత్యమని తెలుసుకున్నప్పుడు నేను భగవంతుడి గురించి యిక చెప్పడానికేం లేదు. భగవంతుడి గురించి ఆలోచించడానికేం లేదు. మనిషి వర్తమానంలో వున్నప్పుడు మాత్రమే నా absence వుంటుంది. ఆ సమయంలో మినహా ప్రతి క్షణం నేను మనిషిని సత్యం నుండి దూరం చేస్తూనే వుంటా.

కనుక, పరిణతి చెందిన ఆలోచన తనంతట తానే realize అయి భగవదాన్వేషణ కోసం వత్తిడి చేయదనీ, తనకు తానుగానే సద్దుమణుగుతుందనీ అంటారు పెద్దలు. వర్తమానంలో వున్నప్పుడు మాత్రమే మనిషికి సత్యంతో ప్రత్యక్ష సంబంధం వుంటుందంటారు. దైవాన్ని సాక్షాత్కరింపజేసుకోవాలనో, మరోటో ఆశ వున్నంత కాలం మనిషి దైవానికి దూరంగానే వుంటాడంటారు.

నిజమేనంటారా?

Tuesday, March 11, 2008

రక్తం గ్లాసు...4

‘స్వాతి’ సపరివార పత్రిక 1-2-2002 సంచికలో ‘భయానక’ కథల విభాగంలో ప్రచురించబడిన నా కథ.

రక్తంగ్లాసు (కథ)

“మాణిక్యాలరావుకి. ఎందుకంటే అతడికి కూడా ఓ యాభై ఎకరాల దాకా పొలం వుంది. అవి మా పొలాల చుట్టూరా ఆనుకునే వుంటాయి. మాణిక్యాలరావు గనుక మా పొలాలు కొనుక్కుంటే పొలం అంతా కలిపి అతడికి ఒకే ‘బిట్’ కిందికి వస్తుంది. వ్యవసాయం సులభం. అయితే మా పొలాలన్నీ కొనగలిగే శక్తి మాణిక్యాలరావుకి లేదనుకో.” అన్నాడు రామరాజు.

“అయితే మాణిక్యాలరావుతో ప్రభాకర్ కి గానీ నారయ్యకి గానీ బంధురికం ఏదైనా వుందా?” అడిగాను.

“నారయ్యకేదో దూరపు బంధుత్వం వుందనుకుంటా! ఐనా మాణిక్యాలరావెక్కడ? వీడెక్కడ?” అన్నాడు రామరాజు.

“మీ యింట్లో వున్నది దెయ్యాలు కాదు రామరాజూ. మనుషులు. మాణిక్యాలరావూ, నారయ్యా కలిసి పంపిస్తున్న మనుషులు. ఆ దగ్గర్లో వుండే హాస్పటల్ లోంచి చనిపోయిన పిల్లల శవాల్ని తెచ్చి, ఎవరో కిరాయి ఆడవాళ్ళ చేత నాటకాలు ఆడిస్తున్నారు. అప్పటికీ భయపడకపోతే శ్మశానంలో పాతిపెట్టిన శవాల్ని కూడా తెచ్చి మంచంలో పడుకోబెడ్తున్నారు.” అన్నాను.

“ఎలా చెప్పగలవు?”

“వచ్చేటప్పుడు ఆ ఊరి శ్మశానంకెళ్ళి కాటికాపరిని కలిశాను. ఆ ముందురోజో స్త్రీ శవం మాయమయిందన్నాడు.”

“అంత దారుణానికి దిగారా? అయినా గదికి తలుపులు వేసుంటే రక్తం గ్లాసూ, శవాలూ గదిలో కెట్లా వస్తున్నాయి?”

“బీరువా తాళాలూ, స్టోర్ రూమ్ తాళాలూ నారయ్య దగ్గిరే వున్నాయి. రక్తంగ్లాసు టీపాయ్ మీద కన్పించిన రోజు బీరువామీద కూడా నాకు కొన్ని రక్తం మరకలు కనిపించాయి. అనుమానం వచ్చి ఆఖరురోజు బీరువా తలుపులు పగులగొట్టాను. బీరువా వెనుక ఆ గదికి గోడ లేదు. మనిషి పట్టేంత మేరకి పగుల గొట్టారు.”

“బీరువా వెనుకభాగం రేకుని కూడా కత్తిరించారు. బీరువా తలుపులు తీసి అవతలికెళ్తే నేరుగా స్టోర్ రూమ్ లోకి వెళ్ళవచ్చు. అలాగే అవతలి నుండి యిటు రావడానికి బీరువా తలుపులకి ఏర్పాట్లు చేసుకున్నారు. రక్తం గ్లాసుల్ని, శవాల్ని స్టోర్ రూమ్ లోంచి అన్ని గదుల్లోకి పంపిస్తున్నారు.”

“బీరువా గురించి ఎలా పసిగట్టగలిగావు?” అన్నాడు రామరాజు.

“నారయ్య స్టోర్ రూంలోంచి రక్తంగ్లాసు తెచ్చి డ్రాయింగ్ రూమ్ లో పెట్టేప్పుడు ఆ గ్లాసు కాస్త ఒలికి రక్తం మరకలు బీరువా కిందిభాగంలో పడ్డాయి. దాంతో బీరువా గురించి అనుమానం వచ్చింది.”

“అంతా బాగానేవుంది గానీ - ఇంతా చేస్తే మాణిక్యాలరావుకి ఏమిటి ఆదాయం?”

“నీ పొలం కొనగలిగే శక్తి, స్తోమత అతడికి లేవు. పొలంలో దెయ్యాలున్నాయనే ప్రచారం చేస్తే నీ పొలం కొనడానికి ఎవడూ రాడు. ఏదో నీకు సహాయం చేసినట్టుగా మాణిక్యాలరావే ముందుకి వస్తాడు. చౌకగా నీ పొలం కొని, తన పొలంలో కలిపేసుకుంటాడు - అదే ఆదాయం.”

“ఇప్పుడు మనం ఏం చెయ్యాలంటావు?” అడిగాడు అచ్యుతరామరాజు.

“డబ్బు తీసుకోకుండా పొలం మాణిక్యాలరావుకి రాసియ్యాలి. లేదంటే పోలీస్ స్టేషన్ కెళ్ళి దెయ్యాల పేరుతో జనాల్ని బెదరగొడ్తున్నాడని ముందు మాణిక్యాలరావు మీద కేసు పెట్టాలి. సాక్ష్యంగా నన్ను పెట్టాలి.” ఒళ్ళు మండి అన్నాను.

“సరే. రేపే పోలీస్ కంప్లయింట్ ఇద్దాంలే!” అని, “ఏమీ తెలీక అడిగా మరీ అంతగా కోపగించుకోకోయ్ మైడియర్ ఫ్రెండ్ చక్రపాణీ!” అచ్యుతరామరాజు నన్ను ప్రేమగా కౌగిలించుకున్నాడు.

( సమాప్తం )

Monday, March 10, 2008

రక్తం గ్లాసు...3

‘స్వాతి’ సపరివార పత్రిక 1-2-2002 సంచికలో ‘భయానక’ కథల విభాగంలో ప్రచురించబడిన నా కథ.

రక్తంగ్లాసు (కథ)

“మైగాడ్! పెరట్లోకా?” ప్రభాకర్ సంకోచించాడు. తర్వాత, “పదండి. మీకోసం వస్తాను.” అన్నాడు.

ఇంట్లో వున్న పలుగు ఒకదాన్ని తీసుకుని నేనూ, ప్రభాకర్ పెరట్లోకి నడిచాం. రాత్రి ఆ స్త్రీలు, బిడ్డ శవాన్ని పాతి పెట్టిన చోటుకెళ్ళి అక్కడ తవ్వాను. చిత్రం ఎంత సేపు తవ్వినా శవం కనిపించలేదు.

ప్రభాకర్ నా వైపు అనుమానంగా చూస్తూ, “మీరేమైనా పొరబడ్డారేమో! కంగారులో కలని నిజం అనుకుని. . .” అన్నాడు.

“షటప్!” ఇంకా ఏదో చెప్పబోయిన ప్రభాకర్ నా కళ్ళలో కోపం చూసి నోరు మూసేశాడు.

నిముషం సేపు మేం మాట్లాడుకోలేదు. తర్వాత, నేనే అన్నాను. “ప్రభాకర్ రేపు ఈవెనింగ్ ట్రెయిన్ కి హైదరాబాద్ కి రిజర్వేషన్ చేయించు.”

“రేపు దాకా ఎందుకు సార్! ఈ రోజు సాయంత్రానికే చేయిస్తాను. మళ్ళీ ఈ రాత్రికి ఏ లేనిపోని గొడవ ఎదుర్కోవాల్సి వస్తుందో.” అన్నాడు ప్రభాకర్.

“నో. రేపు ఈవెనింగ్ కే చేయండి.” అన్నాను

“మీ యిష్టం!” ప్రభాకర్ వెళ్ళబోయాడు.

“ప్రభాకర్!” వెళ్తున్న అతడు వెనక్కి తిరిగాడు.

“ఇక్కడికి దగ్గర్లో హాస్పిటల్ ఏదైనా వుందా?” అడిగాను.

“ఉంది సార్! తొమ్మిది పడకల హాస్పిటల్.”

“అక్కడ కాన్పులు చేస్తారా?” అడిగాను.

“చేస్తారు. ఏం?” అన్నాడు అర్థంగానట్టుగా.

“కాన్పు కష్టమై చనిపోయిన బిడ్డల్ని ఆ హాస్పిటల్ లో అమ్ముతారా?” అన్నాను అతడి కళ్ళలోకి చూస్తూ.

“ఏమిటి లాయర్ గారూ ఆ ప్రశ్న. ఆ సంగతి నాకేం తెలుస్తుంది?” అని, అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు.

* * *

రాత్రి తొమ్మిదయింది. రాత్రి గడిచేకొద్దీ నాలో ‘ఏంగ్జయిటీ’ పెరగసాగింది. వరండాలో, లాన్ లో, చివరికి నా బెడ్ రూమ్ తో సహా అన్నిచోట్లా లైట్లు వెలిగించాను.

కిటికీలతో సహా గదిలో అన్ని తలుపులూ బిగించి మూసేశాను. రివాల్వర్ తల దగ్గిరే పెట్టుకుని పడుకున్నాను.

సగం రాత్రప్పుడు నిద్రలోనే ఏదో కర్తవ్యం గుర్తొచ్చినట్టుయి గబుక్కున మేల్కొన్నాను. ఎదురుగా వున్న ‘వాల్ క్లాక్’ లో టైమ్ చూశాను. పన్నెండున్నర!

నా అజాగ్రత్తకి నన్ను నేనే తిట్టుకుంటూ ఎడంచేత్తో తలదగ్గరి రివాల్వర్ చేతిలోకి తీసుకోబోయి కుడిచేతికి ఏదో మెత్తగా, చల్లగా తగలడంతో అటు చూశాను.

అంతే, ఉలిక్కిపడి లేచి, ప్రాణాలు ఎగిరిపోయేట్టు వెర్రికేక పెట్టాను. అక్కడ నా మంచంలో నా పక్కలోనే కుడివైపున ఒక స్త్రీ శవం పడుకోబెట్టబడి వుంది.

ఆ శవాన్ని ఓ అయిదు నిముషాల పాటు చూస్తుండి పోయాను. నా గుండె దడ, భయం అంత సులభంగా తగ్గలేదు. ఓ పది నిముషాల తర్వాత మనసు స్తిమితపడగానే రివాల్వర్ చేతబట్టుకుని కోపంగా గోద్రెజ్ బీరువా వైపు నడిచాను.

* * *

“బీరువా తాళాలు ఎవరి దగ్గరుంటాయి రామరాజూ?” అడిగాను రామరాజుని హైదరాబాదుకి వచ్చిన తర్వాత వాళ్ళ ఊరిలో జరిగిన కథంతా చెప్పి.

“అన్నీ నారయ్య దగ్గరే వుంటాయి.”

“సరే మీ పొలాలు కొనుక్కుంటే ఎవరికి ఎక్కువ ఉపయోగం వుంటుంది?” అన్నాను.
( సశేషం )

Wednesday, March 5, 2008

రక్తం గ్లాసు...2

‘స్వాతి’ సపరివార పత్రిక 1-2-2002 సంచికలో ‘భయానక’ కథల విభాగంలో ప్రచురించబడిన నా కథ.

రక్తంగ్లాసు (కథ)

“అయ్ బాబో మీరెరగరండి. ఒకరోజు నేన్నిద్రలో వుంటే మనిషి పుర్రెదెచ్చి నా నెత్తిమీదేసిందండి. ఇంకో రోజు కూడుదినే కంచంలో నిలివినా నెత్తురు బోసిందండి. అందుకే రాత్రుల్లు నేనిక్కడుండనండి.” అన్నాడు నారయ్య.

“తినే కంచంలో నెత్తురెట్లా పోసింది? అది నీ ఎదురుగా వచ్చి నిలబడి కంచంలో పోసిందా?”

“కాదండి. ఆది మనకి కనిపిచ్చదండి. గాల్లోంచి నెత్తురు కంచంలోకి పడుద్దండి. అంతే.”

“సర్లేగానీ. . .బెడ్ రూమ్ లో వున్న ఇనుప గోద్రెజ్ బీరువా మీద కూడా రక్తం మరకలున్నాయి. ఆ బీరువా తాళాలు ఎవరిదగ్గరుంటాయి?” అడిగాను.

“నాకు దెలవదండి. రామరాజుగారి దగ్గరుండొచ్చండి.” అన్నాడు నారయ్య.

“సర్లె ఇక నువ్వెళ్ళు. ఎనిమిదింటికల్లా రాత్రి భోజనం పట్టుకురా!” అన్నాను. అతడు చూసేట్టుగా రివాల్వర్ తీసి చేతిలో పట్టుకుంటూ.

“వెళ్ళనండి. ఈ పూటిక్కడే తోటపని చేసి, సాయత్రం ఎళ్ళి భోజనం పట్టుకొత్తానండి.” అన్నాడు.

“సరే! నీ ఇష్టం!” అన్నాను.

* * *

ఆ రాత్రి నిద్రబోవడానికి ఎంతగా ప్రయత్నించినా నాకు నిద్రరాలేదు. అర్ధరాత్రి వరకూ ఎటువంటి అలికిడీ లేదు. సగం రాత్రి కావస్తుందనగా ఏదో అలికిడి అయినట్టయి ఉలిక్కిపడి, చెవులు రిక్కించి ఆ శబ్దం ఆలకించ సాగాను. రివాల్వర్ తీసి చేతబట్టుకున్నాను.

అది ఒక స్త్రీ ఏడుపు. సన్నగా రోదిస్తున్నట్టుగా ఉంది. తలవైపు కిటికీలో నుండి వినిపించసాగింది. గబుక్కున లేచి ఆ కిటికీ దగ్గరికి నడిచాను. కిటికీలోంచి పెరట్లోకి చూశాను. అక్కడ వెన్నెల వెలుగులో కనిపించిన దృశ్యం చూసి భయంతో అవాక్కయిపోయాను.

ఇద్దురు స్త్రీలు. పాడె మీద ఏదో శవాన్ని మోస్తున్నారు. నల్లటి చీరలు కట్టుకుని, జుట్టు విరబోసుకుని పెద్దగా రోదిస్తున్నారు. మెల్లగా పాడెని నేలమీదికి దించి, ఆ పాడె మీద పడి కర్ణకఠోరంగా దుఃఖించసాగారు.

ఎదురుగా వున్న ఇద్దురు స్త్రీలలో ఒకామె పాడెమీదున్న ఓ చిన్న గునపాన్ని చేతిలోకి తీసుకుంది. గునపంతో ఓ చిన్న గుంటతీసి, పలుగు పక్కన పడేసి మొదటి స్త్రీ మళ్ళీ పెద్దగా రోదించసాగింది. ఎదురుగా వున్నామె చేతిలోని శిశువు శవాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. అలా వాళ్ళిద్దరూ ఆ బిడ్డ శవాన్ని ఒకరి చేతిలోంచి ఒకరు లాక్కుంటూ కొంతసేపు ఏడుస్తూనే వున్నారు.

అలా బిడ్డమీద పడి రోదిస్తున్న ఆ స్త్రీలిద్దరూ ఏదో అనుమానం వచ్చిన వారిలా వున్నట్టుండి నేనున్న కిటికీ వైపు తలలు తిప్పి చూశారు. అక్కడ నేను నిల్చుని ఉండటం గమనించి నావైపు చూశారు. తర్వాత వారు నన్ను భయపెడ్తున్నట్టుగా కళ్ళు ఉరిమారు.

నా గొంతులో తడారిపోయింది. నిముషం తర్వాత ఆ స్త్రీలు నా వైపు నుండి చూపు తిప్పి బిడ్డమీదికి మళ్ళించారు. మళ్ళీ ఏడుస్తూ, ఆ శవాన్ని గుంటలో వుంచి మట్టి కప్పారు. తర్వాత, లేచి నిలబడి నావైపు చూశారు. అలా గుడ్లురిమి నన్ను చూస్తూనే మెల్లగా అక్కడ్నుంచి కదిలి కాంపౌండ్ గేట్లోంచి బయటికి వెళ్ళిపోయారు.

“మైగాడ్!” నేను ఊపిరి పీల్చుకున్నాను. ప్రమాదం తప్పిపోయిందన్న రిలీఫ్ తో వెనక్కి తిరిగాను. మంచం దగ్గరికి వెళ్ళబోతూ ఎందుకో అనుమానం వచ్చి అటుపక్క కిటికీవైపు చూశాను. అంతే. కరెంట్ షాక్ తగిలినవాడిలా స్తంభించిపోయాను. ఓ నల్లటి ఆకారం అక్కడ నిల్చుని నన్ను చూస్తోంది. నేను దాన్ని చూడ్డం గమనించి తప్పుకుంది.

* * *

“గుడ్ మార్నిగ్ సార్!” అన్నాడు ప్రభాకర్.

“వెరీగుడ్ మార్నింగ్!” బదులిచ్చాను.

“రాత్రి మామూలుగా గడిచిందా లేక. . .” ఆగాడు.

“జరగకూడనిదే జరిగింది.” అని, రాత్రి జరిగిందంతా వివరంగా చెప్పాను.

అంతా విని, “అయ్యబాబో మీకెంత ధైర్యంసార్! అదంతా చూసి కూడా మామూలుగా మాట్లాడుతున్నారు. నేనైతే చచ్చేవాడిని.” అన్నాడు.

“నేనా మాటలు పట్టించుకోకుండా, ప్రభాకర్ పెరట్లోకెళ్ళి చూసొద్దాం. రా!” అన్నాను.

(సశేషం)

Tuesday, March 4, 2008

రక్తం గ్లాసు - 1

‘స్వాతి’ సపరివార పత్రిక 1-2-2002 సంచికలో ‘భయానక’ కథల విభాగంలో ప్రచురించబడిన నా కథ.

రక్తంగ్లాసు (కథ)


“రెండు వేల రెండులోకెళ్ళాం. ఇంకా దెయ్యాలూ భూతాలూ ఏమిటి రామరాజూ?” అన్నాను.

“తేలిగ్గా తీసేయకు. నా కళ్ళతో నేను చూశానని చెప్తున్నాగా!” సీరియస్ గా చెప్పేడు రామరాజు.

“ఏం చూశావు నీ కళ్ళతో?” అడిగాను.

“చెప్తే విలువుండదు. నేను ఫేస్ చేసిన ప్రతిదానికీ నువ్వు రీజనింగ్ ఇస్తావు. కొట్టిపడేస్తావు. అది ఎవరికి వాళ్లు చూడాల్సిందే.”

నేను కొద్దిసేపు మాట్లాడలేదు. తర్వాత, ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా అన్నాను.
“ఎందుకో ఆ పల్లెటూర్లోని మీ ఇల్లు నేనోసారి చూడాలనుకుంటున్నాను.”

“సరేగానీ అక్కడ ఏదైనా జరగరానిది జరుగుతుందేమోనని నా భయం.” అన్నాడు రామరాజు.

“ఆ భయం నాకు లేదన్నానుగా?”

“సరే నీ యిష్టం. ఈ మాట చాలాసార్లు ఆడిగావు గాబట్టి వెళ్ళాలనుకుంటే వెళ్ళు. అయితే ఆ యింట్లో ఓ రెండు రోజులు మాత్రమే గడిపి వచ్చెయ్. ఒక విషయం. . . జరుగుతున్నదేంటో చూడడమేగానీ నువ్వు మాత్రం రిస్క్ తీసుకోవద్దు. అసలటువంటి రిస్క్ ఏదైనా జరుగుతుందనే అనుమానం వచ్చినా సరే వెంటనే ఇల్లు వెకేట్ చేసి వచ్చెయ్. ఓ.కె.”

“ఓ.కే!” అన్నాను.

“అయితే ఎప్పుడెళ్తావో చెప్పు. ఆ ఊర్లో మా మేనేజర్ కి ఫోన్ చేసి చెపుతాను. కావలసినవన్నీ చూసుకుంటాడు. వాచ్ మెన్ నారయ్యకి చెప్పి పెట్టమంటాను.”

“రేపట్నుండీ కోర్టుకి సెలవులుగదా. ఎల్లుండి వెళ్తా!”
* * *
“రామరాజు వాళ్ళ తాతగారు ఈ గ్రామంలో ఈ భవంతిలోనే కాపురం వుండేవాళ్లు. వాళ్ళది పేరుమోసిన జమీందార్ల కుటుంబం. అప్పట్లో ఈ బిల్డింగ్ లో దెయ్యాలూ గియ్యాలూ లాంటివేం లేవు.”

“రామరాజు వాళ్ళ నాన్నగారి హయాంలో ఈ ఊరు వదిలి వాళ్ళు హైదరాబాదులో స్థిరపడ్డారు. అప్పట్నుంచీ ఈ ఇల్లు లాక్ చేసి ఖాళీగా వుంచారు. అప్పట్నుంచీ ఈ దెయ్యాల గోలంతా.” అన్నాడు మేనేజర్ ప్రభాకర్.

నేను మాట్లాడలేదు. అతడ్ని గమనిస్తూ వింటున్నాను.

“వాళ్ళకి వంద ఎకరాల పొలం ఉండేది. అంతా మాగాణి. ఆది ఇప్పటికీ ఉందనుకోండి. ఆ పొలం వ్యవహారాలే నేను చూసుకుంటూ వుంటాను.”

“నారయ్య ఈ భవంతికి కాపలాగా వుంటాడు. అదైనా రాత్రి పదిగంటల వరకే వుంటాడు. ఆపైన వాడికీ భయమే. మళ్ళీ ఉదయం వస్తాడు. నాదైనా వాడిదైనా ప్రాణం ప్రాణమే గదా.” అన్నాడు మళ్ళీ ప్రభాకర్.

“మరి రామరాజు ఈ ఇల్లూ, పొలం అమ్ముకోవచ్చుగా?” అన్నాను.

“ఎవరు కొంటారు? అతడి ఇంట్లో, పొలంలో దెయ్యాలు తిరుగుతూంటే.” అన్నాడు ప్రభాకర్.

“పొలంలో కూడా వున్నాయా దెయ్యాలు?”

“మొదట పొలం లోనే కన్పించాయి. ఈ మధ్యనే బిల్డింగ్ లో. దాంతో పొలం విలువ బొత్తిగా పడిపోయింది. మొదట్నుంచీ ఇక్కడ వున్నవాడ్ని గనక ఏదో తంటాలు పడి నేను కౌలుకి చేస్తున్నాను.”

“ఈ పొలం కొనుక్కుంటే ఈ ఊళ్ళో ఎక్కువ ఎవరికి ఉపయోగం వుంటుంది” అడిగాను.

“ఎవరికనేముంది. ఎవరికైనా ఉపయోగమే ఈ దెయ్యాల బెడద లేకుంటే.” అన్నాడు.

“నా ఉద్దేశ్యం అది కాదు. రామరాజు వాళ్ళ పొలాల్ని ఆనుకుని ఎవరి పొలాలు వున్నాయి?” అని.

“ఒకరివంటూ ఏం లేవు. చాలా మందివి వున్నాయి.” అని, ఇక తాను వెళ్తానన్నట్టుగా లేచి నిలబడి. . .
“మధ్యాహ్నానికి, రాత్రికీ నారయ్య భోజనం పట్టుకు వస్తాడు. మీకేది కావాలన్నా నారయ్యకి చెప్పండి. కానీ, రాత్రి పదిలోగా అతడ్ని ఇంటికి పంపించేయండి. పాపం పిల్లలు గలవాడు. ఎందుకైనా మంచిది మీరు కూడా జాగ్రత్తగా వుండండి.” ప్రభాకర్ కదిలాడు.

అతడు వెళ్ళింతర్వాత ఇంట్లోకి నడిచాను. క్యారేజ్ డైనింగ్ టేబిల్ మీదుంది. టిఫిన్ చేయడానికని డైనింగ్ హాల్ లోకి వెళ్ళబోతూ ఎందుకో అటు డ్రాయింగ్ రూమ్ లోని టీపాయ్ వైపు చూశాను. అక్కడ టీపాయ్ మీదున్న గ్లాసులో ఎర్రటి ద్రవం వుంది. దగ్గరకెళ్ళి పరీక్షగా చూశాను. అది కాదు. రక్తం. ఎర్రగా, చిక్కగా వున్న రక్తం. . . ఎవరిదో?!!
* * *
ఆ రోజు మధ్యాహ్నం నారయ్య నాకు భోజనం తీసుకువచ్చాడు. అతడిని డ్రాయింగ్ రూమ్ లోకి తీసుకెళ్ళి టీపాయ్ మీది రక్తం గ్లాసు చూపించాను.

నారయ్య ఆశ్చర్యపడలేదు. “ఆ ఎదవముండ ఇంతేనండి. నాలుగేళ్ళనుండీ నన్నిట్టా ఏడిపిత్తావుందండి.” అంటూ, ఆ రక్తం గ్లాసు తీసుకెళ్ళి దూరంగా పడేశాడు.

“నేను ఉదయం ప్రభాకర్ మాట్లాడుతున్నప్పుడు మెయిన్ డోర్ లాక్ చేసే లాన్ లో కూర్చున్నాను నారయ్యా. అన్ని తలుపులూ వేసివుండగా ఈ రక్తం డ్రాయింగ్ రూమ్ లోకెలా వచ్చిందో నాకు అర్థంకావడం లేదు.” అన్నాను అతడిని పరిశీలిస్తూ.

“అయ్యా అది మనిషి కాదండీ బాబూ. దెయ్యం. ఎట్లాగైనా లోపలికి వచ్చేత్తది. నేనిట్టాంటియి ఎన్ని చూశాననుకున్నారు?” అన్నాడు నారయ్య.

“ఇలాంటివి చాలా చూశావా?” అన్నాను.

(సశేషం)