ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి,  అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. ."ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల"నీ, "ఒక పూర్తి మానవుడిగా పరిణమించాల"నీ, నేను కంటున్న కల,  కడుతున్న కోట. . .ఒహ్ ఇంతెందుకు కనుచూపు మేరలో. . . నా జీవితం ఒక వేద సంకలనం!!  నేనొక ఈశ్వరుడిని!!! ( ఇది ఈ బ్లాగులోని ప్రసంగి కథలో ఒక పాత్ర మనోభావాలు __ రచయిత )

Showing posts with label మహాపరాధి కథ. Show all posts
Showing posts with label మహాపరాధి కథ. Show all posts

Saturday, September 22, 2007

మహాపరాధి!..5

(‘విపుల’ సచిత్ర మాస పత్రిక కథల పోటీలో రూ. 1500 లు బహుమతి పొందిన నా మొట్ట మొదటి కథ! ‘విపుల’ 1996 మార్చి నెల సంచికలో ప్రచురించబడింది. ‘వేదగిరి రాంబాబు గారు’ వెలువరించిన 1996 తెలుగు కథల సమీక్షా గ్రంథంలో ఒక అజ్ఞాత వ్యాసకర్త ‘మంచి కథలు రాయగలిగిన శక్తి గల్గిన పదశిల్పి ఈ రచయిత’ అంటూ నన్ను ప్రస్తుతించినారు. ఆనాడు ఈ కథ మీద వెల్లువెత్తిన సమీక్షలెన్నో, పలుకరించి, పరామర్శించిన వ్యక్తులెటువంటివారో ఈ కథ ముగింపులో వివరిస్తాను. ఈ తరం పాఠకులకి కథ మొదట్లో కొంత యిబ్బందికరంగా అన్పించినా చివర్లో ఒక అద్భుతమైన సన్నివేశంతో పాఠకుల మనసుల్ని కలచివేసి ఒక ఆత్మిక విలువని అందజేస్తుందని విన్నవించుకుంటున్నాను. కనుక ఈ బ్లాగు సందర్శించే ప్రతి ఒక్కరినీ పేరు పేరునా దయవుంచి ఈ కథను చదివితీరమని ప్రార్థిస్తున్నాను!)

మహాపరాధి!

మోయలేని భయానక సత్యం అతడి శ్వాస, జ్ఞాన, నాడీ మండలాల్ని ఒక్క వేటుతో విధ్వంసం చేసింది!

జీర్ణంచుకోలేని కఠోర వాస్తవం అతడిలోని సమస్త విద్వత్తునూ అతలాకుతలం చేసింది.

“నేను, నేను, నేను, నేనం”టూ ఒళ్ళు మరిచి, కదంతొక్కి సర్వంలోకి, సమస్త విశ్వంలోకి విస్తరించుకుపోయిన అహం “నేలేన”ని ఎరిగి విశ్వకేంద్రంలో పడి నలిగి నలిగి, రగిలి, రగిలి పొగిలి పొగిలి ఏడ్చింది.

“ఎవరు? ఏమిటి? ఎక్కడ?” అంటూ వెర్రెత్తి విర్రవీగిన ప్రశ్న, ‘నేనెవరో’నన్న న్యూట్రాలిటీని జీర్ణించుకోలేక ఉరివేసుకు చచ్చింది. అది నిజం కాదు. కనీసం స్వప్నం కూడా కాకూడదు. స్వప్నంలో స్వప్నమూ అవరాదు.

ధ్వైతమెక్కడ? అధ్వైతమెక్కడ??

బైరాగులెక్కడ? బికారులెక్కడ? అసలు వాటిని విడదీసిన దరిద్రమానవుడెక్కడ?

నారాయణాచార్యుల శరీరం చెమటతో తడిసిపోయింది. నిరుద్యోగులు, సన్యాసులు, వ్యభిచారులు, యాచకులు వీళ్ళంతా బికారులు.

తను హిమాలయాలు వెళ్ళి సాధించిన బికారీతనం, వదినగారు ఇక్కడ నుండే సాధించినారు. ఎవరు గొప్పవారు?

నారాయణాచార్యులు దిగ్గున లేచాడు. వేగంగా అక్కడనుండి కదిలాడు. తలుపు తీసుకుని బయటికి వస్తున్నప్పుడు లోపల్నుండి నవ్వులు వినిపించాయి. పట్టించుకోలేదు. తనెవరో వాళ్లకి తెలీకూడదు. తెలిస్తే ఆ అమాయకులు ఆ నిజం ధాటిని తట్టుకోలేక పోవచ్చు. తమ దురదృష్టాన్ని తలుచుకుని ఆత్మహత్యతో మరణించినా మరణించవచ్చు. తనలా వారికి యోగం తెలీదు. ఆలోచించకుండా ఉండడం ఎలాగో తెలీదు.

వేగంగా నడిచిపోతున్నాడు. ఎక్కడికో తెలీదు. గమ్యంలేని ప్రయాణం!

ఎక్కడిదిది? వేదార్థం వారి వంశవృక్షం?

నాట్యకళావల్లభులు, సాహితీ విశారదులు, సంగీత విద్వాంసులు, శిల్పకళా చతురులు, చిత్రలేఖనా దురంధరులు, సారస్వత విదుషీమణులు, పరమ పరమేశ్వరునకే ఋక్కులు వల్లించిన వంశీకులు. . . చివరకి ప్రాస్టిట్యూటులు, డాఫర్లు, బికారులు!

వంశ చక్ర సంపూర్ణతా? అధోగతా? రెండూ నిజమే! ఏ ఒక్కదాన్నీ విడదీయడానికి వీల్లేదు.

ఏమిది ఈశ్వరా? నాకా ఈ విషపాత్ర?. ఈ అనుభవం? ధారావాహిక ధ్వానభక్తుడికి ఎంతటి బృహత్తర బహుమానం!

‘గుండెల మీద ఆడిన పసిపాపలు గుండెలు చూపి ప్రేరేపించడం.’ సమస్త విశ్వాన్ని మాతృమూర్తిగా తలపోసిన అస్కలిత బ్రహ్మచారికిది నీవిచ్చిన అధ్వైత అనుభవమా? అహంకార భంగమా?

ఎక్కడి భీభత్స దర్శనమోయీ యిది?

ఇక చాలు ప్రభూ! ఇక చాలు! ఈ వడలిన శరీరానికిది చాలు. సందేహం వీడింది. అంతిమ జ్ఞాన తృప్తి లభించింది. దర్శన భాగ్యమయింది. ఆత్మసాక్షాత్కరించింది. విశ్వరూప సందర్శనమయింది!

నిలబడిపోయాడు.

ఎదురుగా రావిచెట్టు! వెళ్ళి చెట్టుకింద కూర్చున్నాడు. శరీరంలో వణుకు ప్రారంభమై చాలా సేపయింది. దాహంతో నాలిక పీక్కుపోతోంది. మృత్యువు ఆసన్నమయింది. దాని గురించిన భయం లేదు. చావును జయించడంకోసం ప్రయత్నించిన వాడు దాని కోసం చావడానికైనా సిద్ధపడాలి. తప్పదు!

అలాగే వెనక్కివాలి కటిక నేల మీద పడుకున్నాడు. కాళ్లు బార్లా చాపాడు. కళ్లు మూసుకున్నాడు. శరీరం పట్టుదప్పింది. రక్తప్రసరణ తగ్గిపోతోంది కాబోలు. కాళ్ళూ, చేతులూ వశం తప్పాయి. తనని మృత్యువు కబళిస్తోంది. పిచ్చి మృత్యువు! ఎలా కబళించగలదు తనని? తను ‘కమిట్’ కావాలి. అప్పుడుగానీ అది కబళించలేదు. ఈ వెర్రిమనుషులకి తెలీక మృత్యువు తమని పట్టిందని తామే మృత్యువుకి రాజీ పడతారు!

మనసుని యోగనిద్రలోకి తీసుకెళ్ళాడు. “ఓం తత్వమసి!”

ఇప్పుడు బాల్యం లేదు. ఆశ్రమం లేదు. చతుర్వేది లేడు. జ్ఞానకౌముదీ లేడు. అన్నగారు లేరు, వారి పిల్లలూ లేరు, బైరాగి లేడు, బికారి లేడు. అసలేమీ లేదు.

ఇంకొద్ది క్షణాల్లో తన చైతన్యం విశ్వచైతన్యంలోనూ, తన దేహం విశ్వదేహంలోనూ కలిసిపోతాయి. ఆఖరుసారిగా శ్వాస పీల్చాడు.

“ఓం తత్వమసి!”

ఆయన తల వాలిపోయింది.

ఆ వైపున ఒక కోయిల రమ్యంగా కూసింది. ఒక వాయు పవనం చల్లగా వీచింది. అక్కడెక్కడో ఒక వర్షపు చినుకు మురిసిపోతూ ముత్యం చిప్పలోకి జారింది.

ప్రాచ్య, పాశ్చాత్య గ్రంధాల చేత ప్రభావితుడై, తను దైవాంశ సంభూతుడనని విర్రవీగి దైవానికి దాస్యం ఒప్పకున్న ఆ వృద్ధుడు తాను విశ్వసించిన దైవ దర్శనమనే యిన్సిడెంటుని తన జీవితంలో ఎదురైన ఒకానొక అనుభవానికి అన్వయించుకుని తృప్తిని సాధించడమనే ‘లిమిటేషన్’ తో పరమపదించినాడు.

( సమాప్తం )

Friday, September 21, 2007

మహాపరాధి!..4

(‘విపుల’ సచిత్ర మాస పత్రిక కథల పోటీలో రూ. 1500 లు బహుమతి పొందిన నా మొట్ట మొదటి కథ! ‘విపుల’ 1996 మార్చి నెల సంచికలో ప్రచురించబడింది. ‘వేదగిరి రాంబాబు గారు’ వెలువరించిన 1996 తెలుగు కథల సమీక్షా గ్రంథంలో ఒక అజ్ఞాత వ్యాసకర్త ‘మంచి కథలు రాయగలిగిన శక్తి గల్గిన పదశిల్పి ఈ రచయిత’ అంటూ నన్ను ప్రస్తుతించినారు. ఆనాడు ఈ కథ మీద వెల్లువెత్తిన సమీక్షలెన్నో, పలుకరించి, పరామర్శించిన వ్యక్తులెటువంటివారో ఈ కథ ముగింపులో వివరిస్తాను. ఈ తరం పాఠకులకి కథ మొదట్లో కొంత యిబ్బందికరంగా అన్పించినా చివర్లో ఒక అద్భుతమైన సన్నివేశంతో పాఠకుల మనసుల్ని కలచివేసి ఒక ఆత్మిక విలువని అందజేస్తుందని విన్నవించుకుంటున్నాను. కనుక ఈ బ్లాగు సందర్శించే ప్రతి ఒక్కరినీ పేరు పేరునా దయవుంచి ఈ కథను చదివితీరమని ప్రార్థిస్తున్నాను!)

మహాపరాధి!

నారాయణాచార్యులు ఊరి లోపలికి ప్రవేశించాడు. తన యిల్లెక్కడో గుర్తుపట్టడం కష్టంగా వుంది. శ్రమను మరిచిపోయిన అరికాళ్లు మంటపుడుతున్నాయి. మెల్లగా వీధిని పోల్చుకున్నాడు. ఇల్లే తెలీడం లేదు. అటు వేపుగా వెళ్తున్న ఒక ముసలివాడిని పిలిచి, “వేదార్థం శ్రీ రంగవల్లికాదేవిగారి యిల్లు చూపించగలరా?” అని అడిగాడు.

ఆ ముసలివాడు ఆయన అవతారాన్ని పైనుండి కిందిదాకా తేరిపారజూసి, “రాండి!” అంటూ ముందుకు దారితీశాడు. ‘రాండి’ ఎంతకాలం తర్వాత తన మాండలిక భాష వింటున్నాడు. ‘చెవుల్లో పాయసం పోసినట్టు’ అనుభూతి కలిగింది.

ముసలివాడు ఒక యింటిముందు ఆగి, “యిదే యిల్లు.” నిర్యక్ష్యంగా చెప్పి వెళ్ళిపోయాడు. చీకటిపడుతోంది.

ఇంటివేపు చూశాడు. ఆస్ బెస్టాస్ సిమెంటు రేకులు పరిచిన డాబా యిల్లు! అది తన యిల్లు కాదు. బహుశా వదినగారు స్వంత యిల్లు అమ్ముకుని దీన్ని బేరం చేసి వుంటారు. ఆమెగారు ఆర్థికంగా ఆభివృద్ధి సాధించినట్టులేరు. తలుపు దగ్గరకి వెళ్ళి తట్టబోయాడు. అది తెరిచే వుంది. లోపలికి ప్రవేశించాడు. వరండాలో ఎవరూ లేరు. లైట్ వెలుగుతోంది. చుట్టూ చూశాడు. ఒక కుర్చీ వుంది. పాతది. మౌనంగా వెళ్ళి అందులో కూర్చున్నాడు. ఆలా కూర్చుంటున్నప్పుడు కుర్చీ కదిలి, కొద్దిగా అలికిడైంది.

“ఎవరు? ఎవరది?” అలికిడి కావడంతో ఓ స్త్రీ కంఠం లోపల్నుంచి అరిచింది. ఆ కంఠం వదినగారిదేనా? పోల్చుకోలేక పోతున్నాడు. ఎవరని చెప్పాలి తను? మౌనంగా వుండిపోయాడు.

కొద్దిసేపు తర్వాత ఆవిడ రానే వచ్చింది. వచ్చి గుమ్మం దగ్గర నిలబడింది.

ఒక్కసారి ఆమెను సంపూర్ణంగా పరికించి చూశాడు నారాయణాచార్యులు. అరవై అయిదేళ్ళ వృద్దురాలు. నడుము వంగింది. శరీరం కృంగింది. చర్మం ముడుతలు పడింది. వయసు పండింది. ఆ వృద్దురాలు వదినగారే! సందేహం లేదు. కానీ, ఆమెగారి కళ్ళలో మునుపటి వైభవ చిహ్నాలేమీ లేవు. శరీరంలో ‘దర్పం’ కూడా లేదు.

ఆ వృద్దురాలు నారాయణాచార్యుల్ని కళ్ళజోడులోంచి పరిశీలనగా చూస్తూ, స్వామిగార్లా? అంది. క్షణం పాటు ఆమె ముఖంలో చిరునవ్వు కదిలి మాయమయింది.

నారాయణాచార్యులు ఆమె తనను గుర్తిస్తుందేమో ననుకున్నాడు. లేదు. గుర్తించినట్టు లేదు. “స్వామిగార్లు కాదు. నేను. . .నేను . . .నారాయణాచార్యుల్ని. . .మీ మరిది గారిని” చెప్పబోయాడు. ఉద్వేగం ఎక్కువైపోయింది. కంఠం పెగలడం లేదు. ఇరవై ఎనిమిది భాషలు అనర్గళంగా మాటలాడిన కంఠం. ఉద్దండ పండితుల్ని తర్కంతో మట్టికరిపించిన కంఠం మూగవోయింది. మూగబోయి ఒక్కమాటా పలుకలేకపోయింది.

“ఒసే! ప్రమీలా, నాగవల్లీ, రండే! మీకోసం స్వామిగార్లొచ్చారు.” రంగవల్లికాదేవి కేకేసింది.

నారాయణాచార్యులు చెప్పడానికి ప్రయత్నిస్తూనే వున్నాడు. లాభం లేదు. ఉద్వేగం ఆగడం లేదు.

ఎవరో లోపల్నుండి వస్తున్నట్టు కాలి అందెల చప్పుడు.

ముగ్గురు అమ్మాయిలు!

వాకిలి దాటుకుని బయటకి వచ్చి గోడ దగ్గర వరుసగా నిల్చున్నారు. అంతా వయసు నలభైయేళ్ళకు కొద్ది అటు యిటుగా వున్నవారే.

నారాయణాచార్యుల మనసుకి ఏదో కృత్రిమత్వం తోచింది. వాళ్ళ కట్టు, బొట్టు, వ్యవహారం అంతా వింతగా వుంది. వాళ్ళు తన అన్నగారి బిడ్డలా? అయితే వాళ్ళెందుకలా వున్నారు?

అన్నీ ప్రశ్మలే! సమాధానం లేదు! అడగాలని వుంది కంఠం సహకరించడం లేదు. కొంత సమయం తర్వాతగానీ ఈ ఉద్వేగం తగ్గి తను మామూలు మనిషి కాలేడు. ఎందుకో మనసు కీడును శంకిస్తోంది

ఇంతలో, “వీళ్ళలో మీకెవరు కావాలి స్వామీ?” పెదాల్ని పగలగొట్టుకుని బయటికి వస్తున్న నవ్వును బలవంతంగా ఆపుకుంటూ అడిగింది శ్రీరంగవల్లికాదేవి.

ఆ ఆచార్యుడికేమీ అర్థం కావడంలేదు. ఎవరు కావాలేమిటి? అయోమయంగా ఆ అమ్మాయిల వైపు చూశాడు. ఎదురుగా నిల్చునున్న ఆ ముగ్గురిలో ఒక అమ్మాయి వీపు గోడకి ఆన్చి వయ్యారంగా నిల్చుని కాలు వూపుతూ నవ్వుతోంది. మరొక అమ్మాయి నవ్వుతూనే ఎంతో నైపుణ్యంగా పైట కిందికి జార్చి వక్షస్థలం చూపుతోంది. ఇంకో అమ్మాయి ఆయన అవతారం పరిశీలిస్తూనే కన్నుగీటింది.

అతడు మూర్ఖుడు కాడు! అర్థమైపోయింది. వ్యభిచారం. . ! వదిన గారు శ్రీ వేదార్ధం శ్రీరంగవల్లికాదేవిగారు చేస్తున్నది వ్యభిచారం. . .పడుపువృత్తి. . . సానితనం. . .ప్రాస్టిట్యూషన్!!!

(సశేషం)

Thursday, September 20, 2007

మహాపరాధి!..3

(‘విపుల’ సచిత్ర మాస పత్రిక కథల పోటీలో రూ. 1500 లు బహుమతి పొందిన నా మొట్ట మొదటి కథ! ‘విపుల’ 1996 మార్చి నెల సంచికలో ప్రచురించబడింది. ‘వేదగిరి రాంబాబు గారు’ వెలువరించిన 1996 తెలుగు కథల సమీక్షా గ్రంథంలో ఒక అజ్ఞాత వ్యాసకర్త ‘మంచి కథలు రాయగలిగిన శక్తి గల్గిన పదశిల్పి ఈ రచయిత’ అంటూ నన్ను ప్రస్తుతించినారు. ఆనాడు ఈ కథ మీద వెల్లువెత్తిన సమీక్షలెన్నో, పలుకరించి, పరామర్శించిన వ్యక్తులెటువంటివారో ఈ కథ ముగింపులో వివరిస్తాను. ఈ తరం పాఠకులకి కథ మొదట్లో కొంత యిబ్బందికరంగా అన్పించినా చివర్లో ఒక అద్భుతమైన సన్నివేశంతో పాఠకుల మనసుల్ని కలచివేసి ఒక ఆత్మిక విలువని అందజేస్తుందని విన్నవించుకుంటున్నాను. కనుక ఈ బ్లాగు సందర్శించే ప్రతి ఒక్కరినీ పేరు పేరునా దయవుంచి ఈ కథను చదివితీరమని ప్రార్థిస్తున్నాను!)

మహాపరాధి!

“నా పేరు వేదార్థం నారాయణాచార్యులు! ప్రస్తుతం సైన్సులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని డాక్టరేట్ చేస్తున్నాను. మాది విశాలపురం. మా తండ్రిగారు స్వర్గీయ వేదార్ధం హనుమాచార్యులుగారు. మా అన్నగారు స్వర్గీయ అనంతాచార్యులు గారు. వదినగారు శ్రీరంగవల్లికా దేవిగారు. ఆమెకు ముగ్గురు ఆడపిల్లలు. ఈ మధ్యనే అన్నగారు ఓ అగ్నిప్రమాదంలో మరణించినారు. మాది ఆర్థికంగా బాగా చితికిపోయిన కుటుంబం. వదినగారు వారి పిల్లల బాధ్యత నాపైన పడింది. నాకు చిన్ననాటి నుండి తాత్విక చింతన ఎక్కువ. ఎల్లప్పుడూ వేదాంతపుటాలోచలతో సతమతమయ్యే వాడిని. ఆ జిజ్ఞాసతోనే వేదాలు, ఉపనిషత్తులు, అరణ్యకాలు, దర్శనాలు, ఇతిహాసాలు, భగవద్గీత మొదలైనవన్నీ పఠించాను. అన్నింటిలోనూ నాకు యిష్టమయింది భగవద్గీత. నాకు ఈ లౌకిక ప్రపంచం మీద వైరాగ్యభావనలు కలుగుతున్నాయి. అది వైరాగ్యభావనో, వదినగారు, వారి పిల్లల బాధ్యత గురించిన భయమో నేను యిదమిద్ధంగా తేల్చి చెప్పలేను. ఏది ఏమైనప్పటికీ సర్వాన్నీ త్యజించి, బంధాలన్నింటినీ దూరం చేసుకుని, ఆశ్రమవాసం చేయడానికి నేను అంగీకరిస్తున్నాను.”

చదవడం చాలించి, చతుర్వేది బోడిగుండు తడుముకుని, “అది అప్పటి లేఖ. ప్రస్తుత నిష్క్రమణ పత్రం చూడండి!” అన్నాడు.

“హైందవ ప్రచారక పరిషత్తు ఉపాధ్యక్షుడినైన వేదార్ధం నారాయణాచార్యులు అనబడే నేను ప్రస్తుతం ఈ ఆశ్రమం నుండి నిష్క్రమించదలచుకున్నాను. కేవలం గృహస్థాశ్రమం మీద మనసు లగ్నం కావడం దీనికి హేతువు. ఆశ్రమవాసులెవరూ యిందుకు బాధ్యులు కారు.”

“అది సారాంశం!” అన్నాడు చతుర్యేది. ఆ సారాంశం అన్న పదంలో పెర్వర్షన్ శాతం ఎంతుందో నారాయణాచార్యులుకి అర్థం కాలేదు.

“తమకి ఈ వృద్దాప్యంలో గృహస్థాశ్రమం మీద మనసు లగ్నమయిందా ఆచార్యా?” నారాయణాచాల్యుల్ని అడిగాడు. చతుర్యేది.

వెటకారం మొదలైంది.

“ఔను!” ముభావంగా చెప్పాడు నారాయణాచార్యులు. ‘ఈవిల్’ ని భరించడానికి తను ఎప్పుడో సిద్ధమయ్యేడు.

“తమరు గృహస్థాశ్రమం స్వీకరించిన తర్వాత వివాహం చేసుకో నిశ్చయించుకున్నారా? చతుర్వేది ప్రశ్న. ‘డిసానర్’ ఆయన మాటల్లో ఎప్పుడూ కన్పించే లక్షణం!

“లేదు” అన్నాడు నారాయణాచార్యులు

“మరి ఏమి చేయబోతున్నారు?” ఏమి అన్న పదాన్ని వత్తి పలుకుతూ అన్నాడు చదుర్వేది.

“తెలీదు.”

“వదినగారి బాధ్యత తీసుకుంటారా?” ఈసారి బాధ్యత మీద పడింది భారం. చతుర్వేది సొల్యూషన్స్ చాలా భయంకరంగా వుంటాయి. ‘నోబిలిటీ’ అన్నదాన్ని ఆదర్శంలో సైతం చంపుకున్న వ్యక్తి. మాట్లాడుతున్నది ఉపాధ్యక్షులతోనన్న సెన్సు కూడా వుండదు.

ఇక నారాయణాచార్యులు జాప్యం చేయదలచుకోలేదు. ఇంకా ఆలస్యం చేస్తే చతుర్వేది తీసుకోబోయే ఛార్జ్ కి ‘క్వాలిటీ ఆఫ్ మెర్సీ’ మరీ సన్నగిలిపోయి విషయం నవ్వుల పాలవుతుంది. అందుకే అన్నాడు.

“ఆశ్రమం నుండి వెళ్ళిపోయిన తర్వాత నా జీవితం గురించిన జిజ్ఞాస కనబరచడం అధిష్టాన వర్గానికి భావ్యంకాదు. ఆశ్రమ నియమాలకు యిది విరుద్ధం!”

చతుర్వేదుల వారి పని అయిపోయింది. నియమాల పేరుతో కట్టె విరక్కుండానే పాము చచ్చింది. అందుకే ఉపసంహారంగా నిర్ణయపత్రం చేతిలోకి తీసుకున్నాడు. భృకుటి ముడివేసి, గంభీరంగా దాన్ని చదువసాగాడు.

“ఉపాధ్యక్షులు శ్రీశ్రీశ్రీ వేదార్ధం నారాయణాచార్యులవారి అభ్యర్థన అంగీకరించబడినది. ఈయన యిన్నేళ్ల ఆశ్రమ జీవితం గడిపిన తర్వాత కూడా ఐహిక సుఖాల్ని వదిలిపెట్టలేకపోయిన ఆచార్యుడిగా అధిష్టానవర్గం పరిగణించింది. ఆయనను అర్థం చేసుకుని గృహస్థాశ్రమానికి పరిషత్తు వీలు కల్పిస్తుంది. ఇప్పటినుండి ఆయన ఏ క్షణంలోనయినా ఆశ్రమవాసం వదులుకుని నిష్క్రమించవచ్చు. మళ్ళీ ఆయన ఏ క్షణంలోనయినా ఆశ్రమ ప్రవేశం చేయ నిర్ణయించుకుంటే అందుకు కూడా పరిషత్తు వీలు కల్పిస్తుంది.”

చతుర్వేది లేచాడు.

నారాయణాచార్యులు ఆశ్రమానికి చేసిన సేవలకి గుర్తింపుగా ‘ఆయన సంరక్షణార్థం’ ఆశ్రమ ఖాతాలోంచి ఇరవై లక్షల రూపాయల నగదు బ్యాంక్ చెక్ రూపంలో యివ్వబడింది. ఆశ్రమం వదిలిపెట్టిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయన ఆశ్రమం పేరు వినియోగించుకుని డబ్బు సంపాదించకూడదన్న షరతు విధిగా విధించబడింది. ఆయన నిష్క్రమణం గురించి బి.బి.సీ. టీవీకీ యితర మతసంస్థలకూ తెలియపరచబడింది. ఆయన ఆధ్యాత్మిక జీవితం గురించి ఆయన పేరుతో ఒక పుస్తకం ‘మోనోగ్రాఫ్’ విడుదల చేయబడింది. ఆ సంవత్సరం పరిషత్తు ‘యియర్ బుక్’ మీద ఆయన ముఖచిత్రం ప్రచురించాల్సిందిగా నిర్ణయించడం జరిగింది. నారాయణాచార్యులు ధర్మశాల నుండి ఢిల్లీ వరకూ కారులో వెళ్ళేట్టుగానూ, అక్కడినుండి హైదరాబాద్ వరకూ ఫ్లయిట్ లో కమర్షియల్ కేటగిరీలోనూ, హైదరాబాదు నుండి విశాలపురం వరకూ తిరిగి కారులో ప్రయాణం చేసేట్టుగానూ ఏర్పాట్లకు ఆదేశాలు జారీ చేయబడ్డాయి. అంతా సిద్ధమయింది!

తన కృషికి ఆశ్రమం యిచ్చిన పారితోషికం ఇరవై లక్షలు. నారాయణాచార్యులు నవ్వుకున్నాడు. రెవెన్యూ ఆఫీసులో ఒక హెడ్ గుమాస్తా రిటైర్ మెంట్ నాటికి సంపాదించినంత. అసలు డబ్బు అవసరం వుందో లేదో కూడా ఆయనకి తెలీదు. వద్దని వారించాలనుకున్నాడు. కానీ అది తన ఆత్మన్యూనతాభావాన్ని, ఆశ్రమం పట్ల తన అగౌరవాన్ని కనబరిచే చర్యగా భావించి మానుకున్నాడు.
* * * *
కారు విశాలపురం సమీపిస్తున్నకొద్దీ నారాయణాచార్యుల మనసు సంఘర్షించసాగింది. ‘ఆశ్రమం వదిలి వస్తున్నప్పుడు శ్రీ జ్ఞానకౌముదీ స్వామి తనకి వీడ్కోలు చెప్పడానికి రాలేదు. బహుశా చింతాక్రాంతులై వున్నారు కాబోలు! ఆనాడు తను వదినగారికి తెలీకుండా యిల్లు వదలి ఆశ్రమంలో చేరినప్పడు ఆమెగారు కూడా ఈ స్వామీజీలాగే బాధపడినారు కాబోలు!’

కారు డ్రైవర్ ఏకాగ్రతతో డ్రైవింగ్ చేసుకుంటూ వెళుతున్నాడు.

‘వదినగారు శ్రీరంగవల్లికాదేవిగారు ఎలా వున్నారో? ముగ్గురు పిల్లల్నీ ఎట్లా పోషించారో? ఆమెగారికి కూచిపూడి నృత్యంలోనూ, హరికథల్లోనూ మంచి ప్రవేశం వుంది. భరతనాట్యం కూడా కొంత తెలుసు. బహుశా ఏ శిక్షణ సంస్థో నడిపి దాని ద్వారా వచ్చిన పైకంతో జీవించివుంటారు. తను యింతకాలం ఆశ్రమంలో ఉన్నత పదవిలో వున్న విషయం కూడా వదినగారికి తెలీనట్టుంది. తెలిసుంటే తనను కలుసుకునే ప్రయత్నం చేసి వుండేవారు.

ముఫ్పై ఆరేళ్ళ సుదీర్ధకాలం తర్వాత తన రాకను ఆమెగారు ఎట్లా ‘రిసీవ్’ చేసుకుంటారో? సంతోషించగలరా? ఆవేదన చెందుతారా? పిల్లలు పినతండ్రి వచ్చారని పండుగలు చేసుకుంటారు కాబోలు! వారందరికీ వివాహాలు అయిపోయి వుంటాయి. వారు వాళ్ళ పిల్లలకు తనని చూపించి తాతగారు అని పరిచయం చేస్తారు కాబోలు. ఆశ్రమంలో తన పదవిని గురించి విని విభ్రమం చెందుతారు!

నారాయణాచార్యులు తన ఆలోచనలకి తనే నవ్వుకున్నాడు. “మనిషి తన పరంపరాగత స్వభావాన్ని మార్చుకోలేడ”న్న జీన్ పాల్ సార్త్రే మాటలు గుర్చొచ్చాయి! నిజమేననిపించింది. కాకపోతే యోగం చేసిన తనేమిటి? సామాన్యునిలా సంఘర్షంచడమేమిటి?

కారు విశాలపురం చేరేటప్పటికి సాయంత్రం ఆరున్నరయింది! ఊరి పొలిమేర దగ్గరే కారును ఆపి, తను దిగి, డ్రైవర్న్ ని వెనక్కి వెళ్ళిపొమ్మని ఆదేశించాడు. కారు వెళ్ళిపోయింది. ఆయన అక్కడినుండి వూరిలోకి నడక ప్రారంభించాడు. చేతిలోనున్న బ్రీఫ్ కేస్ల్ లో బ్యాంక్ చెక్ వుంది. అప్పటికే వూర్లో దీపాలు వెలిగించారు.

ఊరు పూర్తిగా మారిపోయింది. నాగరికత చెందింది. చెరువుగట్టూ, పంటపొలాలూ, పిల్లకాలవా, గోధూళి, ఎడ్లబండ్లూ లేగదూడలూ, పోలిగాడూ, సుబ్బీ యివేమీలేవు. వాటి స్థానంలో భవంతులూ, విశాలమైన రోడ్లూ, పార్కులూ, బస్ స్టాపులూ కొత్తగా వచ్చి చేరాయి!

( సశేషం )

Wednesday, September 19, 2007

మహాపరాధి!..2

(‘విపుల’ సచిత్ర మాస పత్రిక కథల పోటీలో రూ. 1500 లు బహుమతి పొందిన నా మొట్ట మొదటి కథ! ‘విపుల’ 1996 మార్చి నెల సంచికలో ప్రచురించబడింది. ‘వేదగిరి రాంబాబు గారు’ వెలువరించిన 1996 తెలుగు కథల సమీక్షా గ్రంథంలో ఒక అజ్ఞాత వ్యాసకర్త ‘మంచి కథలు రాయగలిగిన శక్తి గల్గిన పదశిల్పి ఈ రచయిత’ అంటూ నన్ను ప్రస్తుతించినారు. ఆనాడు ఈ కథ మీద వెల్లువెత్తిన సమీక్షలెన్నో, పలుకరించి, పరామర్శించిన వ్యక్తులెటువంటివారో ఈ కథ ముగింపులో వివరిస్తాను. ఈ తరం పాఠకులకి కథ మొదట్లో కొంత యిబ్బందికరంగా అన్పించినా చివర్లో ఒక అద్భుతమైన సన్నివేశంతో పాఠకుల మనసుల్ని కలచివేసి ఒక ఆత్మిక విలువని అందజేస్తుందని విన్నవించుకుంటున్నాను. కనుక ఈ బ్లాగు సందర్శించే ప్రతి ఒక్కరినీ పేరు పేరునా దయవుంచి ఈ కథను చదివితీరమని ప్రార్థిస్తున్నాను!)

మహాపరాధి!

జ్ఞాన కౌముది శ్రద్దగా వింటున్నాడు.

“ఇవిగాక రాజకీయ నాయకుల్లాగా ఒకర్ని ఒకరు కూలద్రోయడానికి ప్రయత్నాలు. ఒకరు అభివృద్ధిని పొందితే మరొకరికి ఈర్ష్య, అసూయ, ద్వేషం! ముప్ఫై ఆరేళ్ళ ఆశ్రమ అనుభవం నాది. నా ఇరవై ఐదవయేట ఈ ఆశ్రమంలో ప్రవేశించాను. మతాన్ని విస్తరించడం కోసం నేను తిరగని దేశం లేదు. బర్మా, థాయ్ లాండ్, కంబోడియా, ఇండోనేషియా, నేపాల్ ఎన్నని చెప్పమంటావు? ఇరవై మూడేళ్ళ సుదీర్ఘకాలంలో కేవలం ఒకటే పని! భగవద్గీతను ప్రచారం చేయడం! అంతటితో దానికి స్వస్తి చెప్పి పదమూడేళ్ళుగా భగవదాన్వేషణ చేస్తున్నాను.”చివరి మాటలు అంటున్నప్పుడు నారాయణాచార్యుల కళ్ళలో బాధ కనిపించింది. ఆయన నిగ్రహించుకున్నాడు.

జ్ఞాన కౌముది మంత్రదండం పక్కనపెట్టి ముందుకి వంగాడు. ఆయన ముఖంలో జిజ్ఞాస కనబడుతోంది.

ఎక్కడి ఈశ్వరుడు కౌముదీస్వామీ! ఆ పరమాత్ముని కోసం ఆయన పరమ దర్శనం కోసం నేను చేయని ప్రయత్నం ఏమున్నదని? “రామ, రామ రామం”టూ కళ్లుమూసి రాముని సాకారాన్ని హృదయంలో ప్రతిష్టించుకుని, ఆసనం వేసి, రాత్రి ధ్యానించడం మొదలుపెడితే, తెల్లగా తెల్లవారిపోయి భావతీవ్రత మిగిలేదేగానీ శ్రీరాముడేడి? పోనీ ‘అది పొరపాటేమోన’ని నిరాకార సాధన చేయదలిస్తే నిద్ర ముంచుకొచ్చేదేగానీ నిరాకారుడికి తావెక్కడ? నేనెవరు? నేననుకుంటున్న నాలోని ఈ నేనుకాని నేను ఎవరు? నేను నేనేనా? ఎన్ని ప్రశ్నలు? ఎన్ని నిద్రలేని రాత్రులు? ఎన్ని ఉపవాసపు దినాలు? స్త్రీని, జిహ్వను జయించడానికి ఎన్ని అర్థంలేని ప్రయత్నాలు? జ్ఞానం కోసం ఎన్ని గ్రంధాలు? ఎంతటి కాలయాపన? అన్నీ నిరర్ధకాలయాయి! చివరకి ఏంగ్జయిటీ, డిప్రెషన్ లాంటి మనోరుగ్మతలు మిగిలాయి. దైవం నాకు లభించలేదు. ఆశ్రమ నియమాలు ఉల్లఘించి పాశ్చాత్య దర్శనాలు కూడా పఠించాను. ప్రయోజనం లేదు. ఒక్కొక్కసారి అసలు ఈశ్వరుడికి అస్థిత్వముందా అన్న సందేహం కూడా కలిగేది. అయితే ఆ విషయం బయటికి ప్రస్తావించడానికి వీల్లేదు. చెప్పడమంటూ జరిగితే శ్రీ పరీక్షిత చతుర్వేదివారు సాధన కొరవడింది. దైవాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావంటారు. నువ్వు విశ్వాసాన్ని పొదివి పట్టడం లేదు. తప్పు మార్గంలో పయనిస్తున్నావంటారు. బాగా అణచడానికి ప్రయత్నిస్తారు! నిన్నగాక మొన్న ఆశ్రమవాసం చేసిన పిల్లస్వాముల దగ్గర్నుండి చతుర్వేది గారి వరకూ తమ తమ దైవానుభవాల్ని గురించి చెపుతూంటే నాకు నవ్వొచ్చేది. అల్ప మనోవికారాల్ని సైతం వదులుకోలేని ఈ అమాయకులకి ఈశ్వర కటాక్షం లభించడమా? విశ్వసించలేను. ప్రతివాడూ అసత్య ప్రచారం చేసుకుంటున్నాడు. స్వంత అవసరాల కనుగుణంగా దైవాన్ని వినియోగించు కుంటున్నాడు. ఒకడ్ని ఒకడు మోసగించుకుంటున్నాడు. నాకివన్నీ అసహ్యాన్ని కలిగిస్తున్నాయి స్వామీజీ! అసహ్యాన్ని కలిగిస్తున్నాయి!” నారాయణాచార్యులు ఆగి, శ్వాస తీసుకున్నారు.

“పైగా చేసిందే చేయరా అన్నట్టు ఈ ధూప దీప నైవేద్యాలూ, ఈ ఆగరొత్తుల వాసన, ఈ ఆడంబరాల ఖరీదుతనం, ఈ భగవద్గీత, ఈ బ్రహ్మం, అద్వైతం, భవం, అలౌకికం లాంటి పదాలు నాకు రొటీన్ అయిపోయి జీవితం యాంత్రికంగా మారి దుర్భరమై పోయింది. అందుకే నేను ఆంధ్రదేశం వెళ్ళిపోవాలనుకున్నాను. ఆశ్రమ అధ్యక్షులవారికి నాకు అనుమతి యిప్పించమంటూ వినతిపత్రం సమర్పించాను. అయితే ఒక్క విషయం. . .” నారాయణచార్యులు ఆగి మళ్ళీ చెప్పాడు.

“శ్రీ వైకుంఠ జగన్నాథ త్రివేదీ వారి అన్వేషణ గురించీ, దైవానుభవం గురించీ నాకు అవగాహన లేదు కాబట్టి నేను వారి ఒక్కరి గురించి మాత్రం ప్రస్తావించడం లేదు.” ఆగి నారాయణాచార్యులు లేచాడు.

ఇప్పుడు చెప్పండి కౌముదీ స్వామీజీ? యిప్పుడు చెప్పండి! ఎవరు హిందువుడు? భార్యాబిడ్డల్ని పోషించలేక ఆశ్రమంలో చేరి, తిని బలిసినవాడా? తోటి మతస్థులను నిందించి వాళ్ళ విశ్వాసాల్ని కూలద్రోసేవాడా? బానపొట్టతో పిలకజుట్టు ముందుకేసుకుని విమానాల్లో మత ప్రచారం చేసేవాడా? తను రాసింది తనే చదువుకుని పరులు చెప్పింది చెవికెక్కించుకోనివాడా? ఎవరు హిందువుడు మహర్షీ? ఎవరు హిందువుడు? పవిత్ర మతాన్ని స్వప్రయోజనాల కోసం వాడుకునే వీళ్ళు. . .వీళ్ళా హిందువులు?” నారాయణాచార్యులు ఉద్వేగంతో ఊగిపోతూ చివరగా ఒకమాట అన్నాడు.

పనీపాటా చేయకుండా తిని తిరిగే వాళ్ళని బికారీజనంగా వర్గీకరించారు ఆధునికులు. ఇక మన విషయానికొస్తే, మనం చేసే అన్వేషణలో మనకే భగవంతుడు లభ్యం కాడు. ఇక మనం చెప్పగా విన్న పామర సామాన్యజనానికి అసలే లభించడు. ఈ మాట అన్ని మతాల వారికీ వర్తిస్తుంది. పోతే సాంఘిక ప్రయోజనం అంటారా? అదీ లేదు. ప్రపంచమంతా పాశ్చాత్య సంస్కృతికి హారతులు పడుతున్న నేపథ్యంలో మన మతమేగాదు ఏ మతమూ ప్రత్యేకంగా ఒనగూర్చే ప్రయోజనం ఏదీలేదు. . . మత సంఘర్షణలూ, మృత కళేబరాల రాసులూ తప్ప.”

నారాయణాచార్యులు జ్ఞాన కౌముది భుజాలు పట్టి ఊపుతూ అడిగాడు.

“ఇది చెప్పండి మహర్షీ? యిది చెప్పండి? మనం. . .మనం ఆశ్రమంలోని వారందరం ఆధునికులన్నట్టు బికారులం. పచ్చిబికారీ సన్యాసులమని నేనంటే మీరు కాదనగలరా జ్ఞానకౌముదీ? మీరు కాదనగలరా?”

తన భుజాలు పట్టి కుదిపివేస్తున్న ఆ ఆచార్యుడిని ఏమనగలడు జ్ఞానకౌముది? ఏదైనా అనడానికి ఆయన వయసు తనకి లేదు. అనుభవం లేదు. జ్ఞానం లేదు. నైతిక హక్కే లేదు. వీటన్నింటికంటే ప్రధానంగా అహం అసలే లేదు.

అందుకే మౌనం దాల్చాడు.
* * * *

ఆరోజు ఆశ్రమంలోని కాన్ఫరెన్స్ హాలు స్వామీజీలతో క్రిక్కిరిసింది.

అది ఆశ్రమ ఉపాధ్యాక్షులు శ్రీ వేదార్థం నారాయణాచార్యుల వారికి గృహస్థాశ్రమ అనుమతి యివ్వాలా? వద్దా? అన్న నిర్ణయం జరిగే రోజు! అదొక గడ్డు సమస్య! ఆశ్రమ అధ్యక్షులు శ్రీ వైకుంఠ జగన్నాథ త్రివేదీ వారు అర్జంటుగా లేని ప్రయాణం కల్పించుకుని ఫిలిప్పీన్స్ వెళ్ళిపోయి, ఆ సమస్య నుండి తప్పించుకున్నారు. ఆ పని వ్యవస్థాపకులకి అప్పగించబడింది. ఫిలిప్పీన్స్ వెళ్ళేప్పుడు అధ్యక్షులు ఒక్క మాట మాత్రం అన్నారట. “నేను ఆ మహాత్ముని నిష్క్రమణ పత్రం చూసి దిగ్భ్రాంతి చెందాను. ఆయన పోకడ నాకు తీరని విచారం కలుగజేస్తోంది. కానీ దైవ సంకల్పం ఆయన నిష్క్రమణాన్ని కోరుతోంది.” అని.

వేదిక మీద శ్రీ పరీక్షిత చతుర్వేది, శ్రీ విష్ణుదుబే, ఆచార్య ఇంద్రకరణ్ భట్, శ్రీ మహీపాల కుల్ కర్ణి, శ్రీ జితేంద్ర అవస్థి, ఆచార్య పండరీనాథ్, శ్రీ లక్ష్మణ్ అనంతాళ్, శ్రీ ముకుందా మిశ్రా, శ్రీ అవినాష్ తివారీ అందరూ ఆసీనులయారు. నారాయణాచార్యులు ఓ వైపుగా కూర్చున్నాడు. ఆయన హృదయం అన్నింటికీ సిద్ధమయ్యేవుంది.

చతుర్వేది ఒక్కసారి గొంతు సవరించుకున్నాడు. ఆయన ఉపన్యాసం మైక్ ల ద్వారా ఆశ్రమంలోని ప్రతి గదిలోపల విన్పించే ఏర్పాటు చేయబడింది. ఆయన ఇంగ్లీషులో ఉపన్యాసం ప్రారంభించాడు.

“శ్రీ హైందవ ప్రచారక పరిషత్తు ఆశ్రమ ఉపాధ్యక్షులు శ్రీశ్రీశ్రీ వేదార్ధం నారాయణాచార్యులవారు అనబడే ఈ హైందవ ఆచార్యులు ముప్ఫై ఆరేళ్ళ క్రితం పంతొమ్మిది వందలా యాభై ఎనిమిదిలో ఈ ఆశ్రమ ప్రవేశం చేశారు. అప్పటి అధ్యక్షులు శ్రీశ్రీశ్రీ పరశురామ చతుర్వేది వారు ఆయన వేద గీతా పాండిత్యాలకు మెచ్చి ఆశ్రమ ప్రవేశం కల్పించారు. ఈయన ఆంధ్రులు! ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరుజిల్లా విశాలపురం వాస్తవ్యులు. ఈయన ఆశ్రమానికి చేసిన సేవలు అపారమైనవి. పద్దెనిమిది భారతీయ భాషలలోనూ, పది విదేశీ భాషలలోనూ ఈయన ఉద్దండులు! ఈయన వివిధ భాషల్లో మత శాస్త్రం పైన ఏడు గ్రంధాలూ, తత్వ శాస్త్రం మీద నాలుగు గ్రంధాలూ రచించారు. భారతదేశంలోనేగాక విదేశాల్లో కూడా హిందూమతాన్ని వ్యాపింపజేయడానికి విశేషమైన కృషి సల్పారు. ఈయన ఆశ్రమ ప్రవేశం చేసేటప్పుడు అధ్యక్షులవారికి రాసిన లేఖలో రెండు ముక్కలు దైవాంశ సంభూతులుకు వినిపించడం మన సాంప్రదాయం!” ఆగి, చతుర్వేది పొట్ట తడుముకుంటూ బర్రున ముక్కు చీదాడు. ఆ తర్వాత లేఖ నందుకుని చదువసాగాడు.

( సశేషం )

Tuesday, September 18, 2007

మహాపరాధి!..1

(‘విపుల’ సచిత్ర మాస పత్రిక కథల పోటీలో రూ. 1500 లు బహుమతి పొందిన కథ! ‘విపుల’ 1996 మార్చి నెల సంచికలో ప్రచురించబడింది. ‘వేదగిరి రాంబాబు గారు’ వెలువరించిన 1996 తెలుగు కథల సమీక్షా గ్రంథంలో ఒక అజ్ఞాత వ్యాసకర్త ‘మంచి కథలు రాయగలిగిన శక్తి గలిగిన పదశిల్పి ఈ రచయిత’ అంటూ నన్ను ప్రస్తుతించినారు. ఆనాడు ఈ కథ మీద వెల్లువెత్తిన సమీక్షలెన్నో, పలుకరించి, పరామర్శించిన వ్యక్తులెటువంటివారో ఈ కథ ముగింపులో వివరిస్తాను. ఈ తరం పాఠకులకి కథ మొదట్లో కొంత యిబ్బందికరంగా అన్పించినా చివర్లో ఒక అద్భుతమైన సంఘటనతో పాఠకుల మనసుల్ని ద్రవింపజేసి ఒక ఆత్మిక విలువని అందజేస్తుందని విన్నవించుకుంటున్నాను. కనుక ఈ బ్లాగు సందర్శించే ప్రతి ఒక్కరినీ పేరు పేరునా దయచేసి ఈ కథను చదివితీరమని ప్రార్థిస్తున్నాను!)

మహాపరాధి!

ఓ తెల్లవారుఝాము!

అది హిమాచల్ ప్రదేశ్ లోనున్న ధర్మశాల! ప్రసిద్ధ పర్వత కేంద్రం!

అక్కడ చలచల్లని వాయు పవనాలమధ్యా, ‘పోలో’ పక్షుల కిలకిలారావాల మధ్యా, మంచు సెలయేరుల ముర్ముర సంగీతాల మధ్యా మహోజ్వల భారతీయ హైందవ సంస్కృతికి ఆలంబనగా నెలకొల్పబడిందొక ఆశ్రమం.

శ్రీ హైందవ ప్రచారక పరిషత్తు!

ముఫ్ఫై రెండు ఎకరాల విస్తీర్ణంలో అంతర్ణాతీయ ఖ్యాతి గడించిన ఆర్కిటెక్ట్ ల చేత వెదురు కర్రలతో, నీటి తుంగతో హిందూ దేవాలయాల్ని గుర్తుకుతెచ్చే విధంగా నిర్మించబడిన ఆ ఆశ్రమ వాతావరణం ఈశ్వరుడికే తపోసంకల్పం కల్గించేంత పవిత్రమై వుంటుంది. మానవాళి సంక్షేమంకోసం, విశ్వశ్రేయస్సు కోసం ధూపదీప నైవేద్యాల మధ్యా, వేద మంత్రాల మధ్యా అక్కడ నిరంతరం యజ్ఞయాగాది క్రతువులు జరుగుతుంటాయి.

ఇక లోపలికి ప్రవేశిస్తే. . .

ఎడమవేపుగా ఓ అందమైన గది!

పక్కమీద కూర్చుని ‘ఫీడో’ గ్రంధం పఠిస్తున్న వేదార్థం నారాయణాచార్యులు తలుపు దగ్గర అలికిడి కావడంతో చటుక్కున ఆ గ్రంధాన్ని దిండుకింద దాచి, కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్న వాడిలా నటించసాగాడు.

“లోనికి ప్రవేశించవచ్చునా మహాశయా?” వాకిలి దగ్గర అస్సామీ భాషలో విన్పించిన ఆ కంఠం శ్రీ జ్ఞాన కౌముదుల వారిదని గుర్తించి, కళ్ళు తెరిచి, ‘రమ్మ’ని సంజ్ఞ చేశాడు నారాయణాచార్యులు.

ఆయన వస్తూనే ఎదురుగానున్న ఆసనంపై కూర్చుంటూ, “కాలకృత్యాలు ముగిశాయా అచార్యా?” పరామర్శగా అడిగాడు.

“ముగిశాయి!” క్లుప్తంగా అన్నాడు నారాయణాచార్యులు హిందీలో.

జ్ఞాన కౌముదీ స్వామి తనూ హిందీలోకి దిగుతూ, “తమరేదో గ్రంధం దాచినట్లున్నారు?” నవ్వుతూ ప్రశ్నించాడు.

నారాయణాచార్యులు నవ్వి, “మీరనుకోలేదు” అన్నాడు.

“పాశ్చాత్య దర్శనమా?”

“అవును ఫీడో. ప్లేటో వారిది.”

“ఆశ్రమ నియమాలకి విరుద్దమని తెలిసీ, తమరీ అలవాటును మానలేకున్నారు. నేను తమరికి చెప్పదగను.”

“నిజమే! నాతత్వం జ్ఞాన సంబంధమైనదని మీకు తెలియనిది గాదు. దానికి నేనేం చేయగలను?”

“అదీ నిజమే. కానీ శ్రీముకుందా మిశ్రా, శ్రీ పరీక్షిత చతుర్వేది లాంటి వారికి ఈ విషయం తెలిస్తే ప్రమాదం కదా?” కాస్త భయంగా అన్నాడు జ్ఞాన కౌముది.

నారాయణాచార్యులు పెద్దగా నిట్టూర్చాడు. ఆ తర్వాత, “తెలుసుకుని నన్నేంచేయగలరు కౌముదీ స్వామీజీ? అయినా పదేళ్ళుగా తెలుసుకోలేనిది యిప్పుడు తెలుస్తుందని భావించమంటారా? మీరయితే నాకు ప్రేమపాత్రులు గనుక నా ద్వారా తెలుసుకోగలిగారు. మీరు చెప్పినవాళ్ళు పరిచారకుల ద్వారా నాకు వర్తమానం పంపకుండా, నా అనుమతి లేకుండా లోనికి ప్రవేశించగలరా? అయినా యింకెంత కాలం నేనిక్కడ వుండబోతున్నాను గనుక!” అన్నాడు.

జుట్టు ముడివిప్పి విదిలించి, తిరిగి ముడిపెట్టుకోబోతున్న శ్రీ జ్ఞాన కౌముదీ స్వామి ఆ చివరి మాటలు విని భరించలేకపోతున్నట్టు “ఓం తత్ సత్!” అన్నాడు. సింధూరంతో మూడు నిలువు నామాలు దిద్దిన ఆయన ప్రసన్న వదనం కొంత విషాదంతో నిండింది.

కానీ, ఆయన అటువంటి అల్పభావాలకు అతీతుడుగా నిర్దేశించబడిన బాధ్యాతాయుతమైన వ్యక్తి. దైవాన్ని సాధన చేస్తున్నవాడు. అందుచేతనే తనకి అలవడిన ఆత్మ సంయమనంతో మళ్ళీ మామూలుగా అయిపోతూ, “తమరీ అరవయ్యొకటవ ఏట గృహస్థాశ్రమం స్వీకరించడంలో అంతర్యమేమిటో నాకు తెలీక నేను ఆవేదన చెందుతున్నాను. ఎందుకో ఈమధ్య నా మనసు బాగా చంచలంగా వుంటున్నది. ఆత్మీయులైన పెద్దలు, పైగా ఆశ్రమ ఉపాధ్యక్షులు తమరు వెళ్ళిపోవడం నేను భరించగలనా అన్పిస్తున్నది.” అన్నాడు.

నారాయణాచార్యులు కాళ్ళను ముందుకు లాక్కుని పద్మాసనం వేసుకున్నాడు. ఏదో చెప్పదలచుకున్న వాడిలా వెన్నెముక నిటారుగా చేసి మణకట్లు మోకాళ్ళుకు ఆనించి, భారంగా శ్వాస వదిలాడు. ‘రిమోట్’ మాగ్నటిక్ బజర్ తో పరిచారకుడిని పిలిచి, “మాకు పాలు తీసుకురావాలి!” అని కన్నడంలో చెప్పాడు. పరిచారకుడు వెళ్ళిపోయాడు.

ఇంతలో బ్లాక్ కమెండోల బూట్ల చప్పుడు ద్వారం వైపు నుండి వినిపించింది. ఎవరో చాలా మంది వేగంగా వెళుతున్నట్టు అడుగుల చప్పుడు. “ఆచార్య జితేంద్ర అవస్థి ఈ రోజు ఇండోనేషియా ప్రయాణమయినట్టున్నారు. చూడండి! భగవత్ స్వరూపులకు కేంద్ర ప్రభుత్వ రక్షణదళం కావాలి.” నవ్వి, నారాయణాచార్యులు తిరిగి చెప్పడం ప్రారంభించాడు.

“జ్ఞాన కౌముదీ స్వామీజీ! మీరు నాకన్నా ఇరవైయేళ్ళు చిన్నవారు. మీరు ఆశ్రమంలో ప్రవేశించి కేవలం తొమ్మిదేళ్ళయింది. పైగా మీరు మతప్రచారక కార్యకలాపాల్లో మునిగివున్నందువల్ల మీకీ ఆశ్రమం తీరుతెన్నుల గురించి, రాజకీయాల గురించి సరిగ్గా తెలీదు. నేను వివరిస్తాను.”

పరిచారకుడు పాలు తీసుకుని వచ్చాడు. అవి అందుకుని తాగాక ఆయన చెప్పాడు.

ప్రస్తుతం ఈ ఆశ్రమం విలువంతో మీకు తెలుసా స్వామీజీ? మూడు వందల కోట్ల రూపాయలు! దీని అధ్యక్షులు శ్రీశ్రీశ్రీ శ్రీవైకుంఠ జగన్నాథ త్రివేదీ వారి సంవత్సర ఖర్చు డెభై అయిదు లక్షలు టూర్లతో కలిపి. వ్యవస్థాపకులు శ్రీ పరీక్షిత చతుర్వేది వారి ఖర్చు యాభై లక్షలు. ఉపాధ్యక్షుడిగా నా ఖర్చు పడ్రెండు లక్షలు. . .మతవ్యాప్తి కార్యక్రమాలు చాలించుకున్నాను కాబట్టి. మిగతా డైభై ఆరుమంది స్వామీజీల ఖర్చు మీతో కలిపి అందరిదీ నాకన్నా ఎక్కువే వుంటుంది. మన ఆశ్రమ ఖాతాలో వున్న ఆస్తి విలువ మొత్తం మూడు వేల కోట్ల రూపాయలు. అంటే అది పూరీ, శృంగేరీ లాంటి నాలుగు శక్తి పీఠాల్లో ఏ ఒక్క పీఠానికీ లేనంత అన్నమాట. ఇంత ఖరీదయిన జీవితాలు మనకి అవసరమేనంటావా? కౌముదీ స్వామీజీ?”

నారాయణాచార్యులు మంచం పైనుండి లేచాడు. ఆ గది గోడ దగ్గరకి వెళ్ళి, గోడమీద చూపుడువేలు ఆన్చి చూపిస్తూ, “వెదురు కర్రల గోడలమీద అమర్చిన ఈ ‘రీబిల్డ్ పెంకు’ జపాన్ దేశపుదన్న విషయం మీకు తెలుసా?” అంటూ కాస్త పక్కకి జరిగి, అక్కడున్న తైలవర్ణ చిత్రాన్ని చూపిస్తూ, “ఈ ఇకనోగ్రఫీ పెయింటింగ్ లు, ఈ యంబాసింగ్ మంత్రపురేకులు చూస్తున్నారు కదూ?” ఆయన తిరిగి వచ్చి మంచం మీద కూర్చున్నాడు.

“ఈ ఎర్రటేకు మంచం మీద నగిషీలు చూడండి స్వామీ! ఆర్నమెంటల్ వర్క్ అట. ఈ కాషాయ వస్త్రాలు చూడండి. మీటరు వస్త్రం ఐదున్నర వేల రూపాయలట. యు.ఎస్.ఏ. వి! ఆ కేన్ కుర్చీ ధర అయిదువేల రూపాయలు. తాంబూలం దాచుకునే బంగారు ఇన్ లేయింగ్ స్టోన్డ్ భరిణెలు ఒక్కొక్కటీ ఇరవైవేల రూపాయలు. వింటున్నారా స్వామీజీ? ఇంకా పట్టు పరుపులు, కుషన్డ్ బోల్ స్టర్లు, దంతంతో తయారు చేయబడిన ల్యాంపులు, కార్తేజియన్ గులాబీ అత్తర్లు, లేవండర్ తలనూనెలు, జీడిపప్పు, నెయ్యి లాంటి వాటితో వండిన ఎస్ క్యులెంట్ వంటకాలు, వెన్నతీసిన స్కిమ్డ్ మిల్క్, మహారాష్ట్ర గుహల్లో నుండి దొంగతనంగా తెప్పించబడిన శిల్పాలు, హై కాన్ఫిగరేషన్ కంప్యూటర్లు, అధునాతన వీడియో టీ.వీ.లూ, ఒడిస్సీ, సిరైకెళ్ళా, అంకియానట్, భరతనాట్యం సీడీలు, క్యాసెట్టులు, డిజిటల్ ఆడియో సిస్టమ్స్, టేప్ రికార్డర్లు, అందులో వీణ, ఫిడేలు, సారంగి లాంటి వాటిమీద వాయించిన యిన్స్ స్ట్రుమెంటల్ క్లాసిక్స్, ఇవిగాక, సెల్ ఫోన్లు, డైనమిక్ ఐ.యస్.డీ. లూ, లిఫ్టులూ, ఎయిర్ కండిషన్డ్ కార్లు, ఫ్లయిట్ లు, విదేశాలు!” నారాయణాచార్యులు నవ్వాడు. ఈసారి ఆయన వదనం గంభీరమయింది.

“కామ, క్రోధ, లోభ, మోహ, పాశ, మదమాత్సర్యాల్ని జయించి, సర్వసంగపరిత్యాగులమైన మనకి, దైవలబ్ది కోసం ప్రయత్నించే మనకి మతవ్యాప్తి కోసం యింతటి లగ్జరీలు నిజంగా అవసరమా కౌముదీ స్వామీజీ?”

( సశేషం )