ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి,  అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. ."ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల"నీ, "ఒక పూర్తి మానవుడిగా పరిణమించాల"నీ, నేను కంటున్న కల,  కడుతున్న కోట. . .ఒహ్ ఇంతెందుకు కనుచూపు మేరలో. . . నా జీవితం ఒక వేద సంకలనం!!  నేనొక ఈశ్వరుడిని!!! ( ఇది ఈ బ్లాగులోని ప్రసంగి కథలో ఒక పాత్ర మనోభావాలు __ రచయిత )

Tuesday, November 27, 2007

నా దృక్పథం నుండి స్త్రీమూర్తి!...2

(ఇది ఆడవాళ్ళ సానుభూతిని సంపాదించడం కోసమో, పురుషుల్ని బాధ పెట్టడం కోసమో ఉద్దేశించిన వ్యాసం కాదు. మానవజాతి చరిత్రలో నేను చూసిన, నాకు అన్పించిన ఒక సత్యాన్ని ఇక్కడ ఆవిష్కరిస్తున్నాను. అభిప్రాయ భేదాలుంటే నిర్మాణాత్మకమైన విమర్శ చేయమని పఠితల్ని కోరుతున్నాను)

నా దృక్పథం నుండి స్త్రీమూర్తి

ఇక ‘చలం’ గురించి. ఆచార వ్యవహారాల పేరుతో బానిసగా మారిన స్త్రీమూర్తిని చూసి చలం చలించిపోయాడు. పురుషుడు ముద్దు పెట్టుకుంటేనే గర్భం వస్తుందనుకునే మానసిక పరిణతి లేని స్త్రీలు ఆనాటికే 25 శాతం మంది వున్నారన్న కొన్ని నగ్నసత్యాల్ని గ్రహించి విల విలలాడాడు. స్త్రీ శరీరానికీ, మనసుకీ వ్యాయామం కావాలని ఎలుగెత్తి చాటాడు. స్త్రీని విశ్వకేంద్రంలో నిలిపి, కలాన్ని సమ్మెటగా చేసి ఆమె దాస్య శృంఖలాల్ని పగులగొట్ట బృహత్ ప్రయత్నించినాడు. ఎంత విశృంఖలత వుందనుకున్నా చలం రచనలు సాధించిన ఘనత తక్కవేమీ కాదు. అవి ఆంధ్ర వాజ్ఞయంలో తగిన స్థానం సంపాదించుకోగలిగాయి. యావత్ తెలుగుజాతి ఆలోచనా విధానాన్ని ప్రభావితంజేసి, తెలుగువారి దృక్పథంలో నూతనత్వానికి శ్రీకారం చుట్టాయి. ఒకనాడు తెలుగు సాహితీ ప్రపంచమే సంచలనాత్మక రచయిత వైపు దృష్టిసారించి అబ్బురపడిందన్న విషయం మనం మరువలేనిది. ఆపైన ఆథ్యాత్మిక చైతన్యం పొందిన చలం మాటలకు విలువ వుంటుందని నేననుకోను. ఒక్క చలమే కాదు ఆథ్యాత్మిక చైతన్యం పొందిన ఏ వ్యక్తి మాటలకైనా ఆథ్యాత్మిక విలువ తప్ప సామాజిక విలువలు వుండవు. ఎందుకంటే ఆథ్యాత్మిక మానవుడికి అన్ని విలువలూ సమానమే. భావాల హెచ్చుతగ్గుల వివక్ష వుండదు. అప్పుడే ఆథ్యాత్మికం సాధ్యం కూడా. ఏది ఏమైనా స్త్రీకి స్వేచ్ఛని ప్రసాదించాలనే తీవ్ర తాపత్రయంలో భారతీయ కుటుంబ వ్యవస్థనూ, పసిపిల్లల భవిష్యత్తునూ చలం విస్మరించారనే విషయమూ విమర్శలకు నోచుకుంది.

కానీ, గడచిన రెండు దశాబ్దాలకాలంలో ఆధునిక స్త్రీ తన దాస్య శృంఖలాల్ని తనే ఛేదించుకోవాలనే స్వీయ జ్ఞానాన్ని పొందింది. నడుం బిగించి ఆ దిశగా తనకి తానుగానే ఉద్యమించింది. ఆ క్రమంలో ఆమె సాధించిన విజయాలు తక్కువేమీ కాదు. పురుషుడితో సమానంగా ఆమె ఆర్థిక స్వావలంబన సాధించుకుంది. తన ప్రాణ, మాన సంరక్షణ కోసం తగువిధంగా చట్టాలు రూపొందించుకోగిలిగింది. అయినా, కనుచూపు మేరలో ఆమె సామాజిక స్వేచ్ఛ ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే చందంగా వుండిపోయింది.

అదే చట్టాలు సంఘంలో బరితెగించిన స్త్రీ వ్యక్తులకు మారణాయుధాలై చేతికందాయి. మంచి ప్రవర్తన గల మగవాళ్ళు సైతం ఈ చెడు మార్గాన్ననుసరించిన స్త్రీల చేత భంగపడిన సంఘటలలు ఇటీవల కోకొల్లలు. వరకట్నం ఊసెత్తని పురుషుడ్ని సైతం తనకి అభిప్రాయభేదం కలిగినప్పుడు స్త్రీలు వరకట్నపీడితుడిగా కోర్టుల కీడ్చి శిక్షింపజేయడం వంటి సంఘటనలు ఎంతైనా అమానుషం. ఇటువంటి స్త్రీలు తమని సామాజిక, ప్రాణ సంరక్షణకోసం ఏర్పడిన చట్టాల వెనుక స్త్రీ వేదననూ, బాధలనూ గుర్తించిన పురుషులు అనేకులున్నారన్న విషయం విస్మరించరాదు. కేవలం స్త్రీల వల్లనే ఆయా చట్టాలు రూపొందించబడలేదు. సరిగ్గా యిక్కడే పురుషుడు కూడా స్త్రీని ద్వేషించడం, తనకి బాధాకరంగా పరిణమించిన చట్టాల్ని దుయ్యబట్టడం జరిగింది.

ఏదియేమైనా, పురుషుడు తన జాత్యహంకారం మూలంగా స్త్రీ అనాది నుండీ అణచివేతకి గురైనదన్న విషయం అంగీకరించక తప్పదు. అదే విధంగా స్త్రీలు తమకి అణ్వాయుధాలై చేతికందిన ‘ఉమెన్ ప్రొటెక్షన్’ వంటి కేసుల్ని తప్పుడు పోకడలకు కాక నిజమైన తప్పిదం జరిగిన చోట మాత్రమే వాడుకోవడం సమంజసం. ఎందుకంటే, మానవజాతిలో స్త్రీ, పురుషులిద్దరూ భాగస్వాములు. స్త్రీ లేనిదే పురుషుడు లేడు. అలాగే స్త్రీ విషయంలో కూడా. అలా స్త్రీ పురుషులిద్దరూ సమదృష్టితో మెలగినంత కాలమే మానవత్వానికి మనుగడ. మానవజాతి మనుగడ. కడకి మనిషికే మనుగడ. ఆ అవగాహన నశించిన రోజున మనకి మిగిలేది శూన్యం.

చివరగా ఒకమాట. ఆచారాల పేరిట, కట్టుబాట్ల పేరిట, మతాల పేరిట స్త్రీ అణచివేతకి గురైందన్న విషయం నూరుకి నూరు పాళ్ళూ సత్యమనడానికి ఎన్నో తార్కాణాలు అవసరం లేదు. స్వంతంత్రించి, ఒక్కటే ఒక్కటి ఉదహరిస్తాను.

స్త్రీ శరీరం యావత్తూ పురుషుడి స్వంతమేనన్నది విశ్వసత్యం. అటువంటి పురుషుడి సొత్తైన స్త్రీ శరీరపు వంపు సొంపుల్నీ, ముఖ సోయగాల్నీ, లావణ్యాన్నీ, సుకుమారతనీ పురుషుడు వీక్షించి, తరించి, తథాత్మ్యం చెందాల్సిన స్త్రీమూర్తి గీర్వాణ సౌందర్యాన్ని ఒక మతం వారు నల్లముసుగులు వేసి మరుగు పరిస్తే, ఆ స్త్రీలు ఏ పాపమూ ఎరుగకుండానే ముసుగుదొంగలకి మల్లే మన మధ్యనే సంచరిస్తుంటే, సహజీవిస్తుంటే మనసున్న ఏ మనిషికైనా ప్రస్ఫుటంగా తెలీడం లేదా చరిత్రలో స్త్రీమూర్తి నిస్సందేహంగా అణచివేతకు గురైనదని, ప్రస్తుతం గురౌతూనే వున్నదన్న విషయం.

ఇంతకుమించిన తార్కాణాలు కావాలంటారా?

(సమాప్తం)

3 అభిప్రాయాలు:

spandana said...

చాలా చక్కగా చెప్పారండి. స్త్రీకి ప్రకృతి పరంగా సామాజిక పరంగా జరిగిన జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూనే ఎక్కడో ఒకచోటో రెండుచోట్లో జరిగిన ఘటనలని పట్టుకొని మొత్తం స్త్రీవాదమే చెత్తనడం, పాత సంప్రదాయాలనే నెత్తిన పెట్టుకోవడం, స్త్రీ పక్షంగా మాట్లాడిన పురుషులను స్త్రీల గొప్ప పొందడం కోసం చేసే ప్రయత్నంగా చిత్రించడం, గొంతు పెద్దది చేసి అరిస్తే తమమాటే నెగ్గుతుందనుకోవడం కొందరు చేస్తున్నారు. ఆ గొంతులకు భయపడి మద్యేవాదులు, సానుభూతిపరులు నోరు విప్పడం మానేశారు.

అయినా విమర్షల జడివానకు వెరవకుండా మీ అభిప్రాయాలని వెల్లడీ చేసినందులకు అభినందనలు.

--ప్రసాద్
http://blog.charasala.com

వింజమూరి విజయకుమార్ said...

కృతజ్ఞతలు చెరసాల గారూ. "ఆ గొంతులకు భయపడి మద్యేవాదులు, సానుభూతిపరులు నోరు విప్పడం మానేశారు" మీరన్న ఈమాట అక్షరసత్యం. ఏమైనా మనం విశ్వంసించింది రాయడం మన ధర్మం. అయినా మీరు మాత్రం తక్కువ తిన్నారా ధైర్యంగా వ్యాఖ్య రాసేరుగా. స్త్రీల మీద పడి ఏడ్చే పురుషుల్ని నేనేమనుకుంటానంటే బహుశా వాళ్ళకి చెడు నడవడిక గిలిగిన స్త్రీ వ్యక్తులకీ, విశ్వజనీన స్త్రీకి వ్వత్యాసం తెలీదనుకుంటా. లేదంటే వాళ్లు ఈ ప్రత్యేక స్త్రీ వ్యక్తుల మూలంగా భంగపడైనా వుండాలి. ఒకవేళ మనం భంగపడినా స్త్రీ గురించి మొత్తంగా ఆలోచించాలి గానీ కేవలం మన వ్యక్తిగత కోణం నుండి చూడడం తగదు గదా.

Anonymous said...

విజయకుమారుగారు మిధ్రుక్ పధంలో నల్ల ముసుగులు నలుగుతున్నారా లేక వ్రతాలూ పూజలు నోములు మవున వ్రతాలు పారాయణలు చెప్పాలంటే ఆడువారిమీద
ఆదికాలమునుండి మనిషి ఎన్నో ఆక్చలుపెట్టి
శ్యాసిస్సుత్తున్నాడు ఇక్కడ కులమాతాలకు తావులేదు