ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి,  అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. ."ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల"నీ, "ఒక పూర్తి మానవుడిగా పరిణమించాల"నీ, నేను కంటున్న కల,  కడుతున్న కోట. . .ఒహ్ ఇంతెందుకు కనుచూపు మేరలో. . . నా జీవితం ఒక వేద సంకలనం!!  నేనొక ఈశ్వరుడిని!!! ( ఇది ఈ బ్లాగులోని ప్రసంగి కథలో ఒక పాత్ర మనోభావాలు __ రచయిత )

Wednesday, January 23, 2008

వేంకటేశ్వరుడు – గడప

వేంకటేశ్వరుడు – గడప
ఇది నా స్వీయ రచన కాదు. ఒక స్నేహితుడిచ్చిన పాత సినిమా స్కిప్టులో చదివి రాస్తున్నా. ఏదైనా సినిమాలో ఈ విషయం చెప్పారో లేదో కూడా నాకు తెలీదు.

శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలో నిరంతరం భక్తుల సేవలందుకునే వేంకటేశ్వర స్వామి వారి గర్భగుడి ద్వారతోరణం దగ్గరి గడపకి ఓ రోజు ఓ ధర్మసందేహం కలిగిందట. సందేహం కలిగిన వెనువెంటనే ఆలస్యం చేయకుండా సదరు గడప శ్రీ వెంకటేశ్వర స్వామిని సందేహ నివృత్తి కోసం యిలా ప్రశ్నించిందట.

“ఆయ్యా స్వామీ! తమరూ రాయితో తయారు చేసినవారు. నేనూ రాయితోనే చేయబడ్డాను. తమరికీ, నాకూ తండ్రి అయిన శిల్పి ఒకరే. అయినప్పుడు, తమకి ఈ నిత్య మంగళ హారతులేమి. నన్ను మాత్రం ఈ లక్షలాది మంది భక్తులు మట్టి కాళ్ళతో తొక్కకుంటూ తమరికి ‘గోవింద’ నామ భజన చేయడమేమిటి?” అని.

ఆ మాటకా తిరమలాధీశుడు గడపని చూసి ఓ చిర్నవ్వు నవ్వి, సమాధానం యివ్వకుండా మిన్నకుండి పోయాట్ట.

ఆ చర్యతో ఆ గడప మరింప మనస్తాపం చెంది, “స్వామీ! తమ భక్తులతో పాటు తమరు కూడా నన్ను చిర్నవ్వుతో హేళన చేయడం ఏమంత బాగోలేద”ని మదనపడి, ముఖం (అయినా గడపకి ముఖం ఎక్కడిది. గడపమొహం కాకపోతే) చిన్నబుచ్చుకున్నదట.

ఆ మాటలకి శ్రీ స్వామివారు స్పందిస్తూ, యిలా సమాధానం యిచ్చార్ట.

“ఒసే గడపా! నన్ను కళా తపస్వియైన ఒక శిల్పి దీక్షగా యేళ్ళ తరబడి శ్రమించి కోటానుకోట్ల వులి దెబ్బలకి నన్ను గురిచేసి, తను శ్రమించి, నన్ను బాధించి మలిచిన పిదప నేను ఈ మహిమాన్వితమైన ఈ సుందర రూపం దాల్చి భక్తుల మనసుల్ని దోచుకోగలిగాను. ఇక నీ మాటంటావా. నీదేముంది? ఒక రాయిని తీసుకుని అదే శిల్పి వులితో అటో దెబ్బ, యిటో దెబ్బ వేస్తే నువ్వు గడపవై కూర్చున్నావు. నీకు దెబ్బలూ తక్కువే. పూజలూ తక్కువే. ఇప్పుడర్థమయిందా?” అన్నాట్ట.

అంతట, ఆ సమాధానం విని సదరు గడప “అరే! నిజమే గదా స్వామివారి గొప్పదనం!” అని సంతృప్తి చెందిందట.

ఇందుమూలంగా, ఈ కథను చెప్పడం మూలంగా నేను యావన్మందికీ తెలియజేయునది యేమనగా, ఈ కథలోని వేంకటేశ్వరుడికి మల్లే ‘ఫెటేల్’ మని ఈడ్చిపెట్టి కొట్టే జీవితానుభవం నుండి తద్వనుభవ సారాన్ని పిండుకుని, సారస్వతం ద్వారా యితరత్రా పరిశీలనా ప్రక్రియల ద్వారా కొంత ప్రంపంచ జ్ఞానాన్ని, పదార్థ స్వరూపజ్ఞానాన్ని, స్వస్వరూపజ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని పొందిన వ్యక్తులు ఏదో ఒక విధంగా తమ విశిష్టతను తాము చాటుకుంటూనే, యితరులకు ప్రయోజనకారకులౌతారని.

ప్రయోజకులై పదిమందికీ సహాయకారులయే వారు అందరూ ఆమోదించదగ్గ వ్యక్తులే గదా. అదీ ఈ టపా వెనుక సారాంశం.

ఏదో సందర్బంలో విశ్వనాధ వారు ఈ మాటన్నారు.

“పది విషయములు దెలిసియున్న భిన్న వస్తు స్వరూపజ్ఞానము దెలియినుగానీ, తెలిసినదియే ఒకటియై దాని యందే సర్వోత్కృష్టతా భావమును కలిగియుండుట బహు మానవులకు జీవితములో సంభవించునొక దురదృష్టము” అని.

అయితే, యిదంతా కూలంకషంగా చదివిన పిదప మీకో సందేహం కలగొచ్చు. వేంకటేశ్వరుడు చాలా దెబ్బల కోర్చి ఘనుడైనట్టు ఎప్పుడూ కష్టాల కొలిమిలో కాలుతూండే కార్మికులూ, కూలీనాలీ జనాలూ బతుకులో మనందరికంటే ఎక్కవ దెబ్బలు తినే వుంటారు గనుక, వాళ్ళంతా ఎందుకు జ్ఞానవంతులు కారూ? అని.

ఈ సందేహం కలిగిన వారికి నాదొకటే సమాధానం.

కష్టాలు పడినంతమాత్రాన ప్రయోజనం లేదు. కష్టమైనా, సుఖమైనా, జీవితంలో ఆయా అనుభవాల సారం పిండుకున్నవాళ్ళు, ఆయా విలువల్ని ప్రశ్నించి నిగ్గుదేల్చుకున్న వాళ్లు మాత్రమే గొప్పవారు కాగలరు!

మీరేమంటారు?
(సమాప్తం)

Tuesday, November 27, 2007

నా దృక్పథం నుండి స్త్రీమూర్తి!...2

(ఇది ఆడవాళ్ళ సానుభూతిని సంపాదించడం కోసమో, పురుషుల్ని బాధ పెట్టడం కోసమో ఉద్దేశించిన వ్యాసం కాదు. మానవజాతి చరిత్రలో నేను చూసిన, నాకు అన్పించిన ఒక సత్యాన్ని ఇక్కడ ఆవిష్కరిస్తున్నాను. అభిప్రాయ భేదాలుంటే నిర్మాణాత్మకమైన విమర్శ చేయమని పఠితల్ని కోరుతున్నాను)

నా దృక్పథం నుండి స్త్రీమూర్తి

ఇక ‘చలం’ గురించి. ఆచార వ్యవహారాల పేరుతో బానిసగా మారిన స్త్రీమూర్తిని చూసి చలం చలించిపోయాడు. పురుషుడు ముద్దు పెట్టుకుంటేనే గర్భం వస్తుందనుకునే మానసిక పరిణతి లేని స్త్రీలు ఆనాటికే 25 శాతం మంది వున్నారన్న కొన్ని నగ్నసత్యాల్ని గ్రహించి విల విలలాడాడు. స్త్రీ శరీరానికీ, మనసుకీ వ్యాయామం కావాలని ఎలుగెత్తి చాటాడు. స్త్రీని విశ్వకేంద్రంలో నిలిపి, కలాన్ని సమ్మెటగా చేసి ఆమె దాస్య శృంఖలాల్ని పగులగొట్ట బృహత్ ప్రయత్నించినాడు. ఎంత విశృంఖలత వుందనుకున్నా చలం రచనలు సాధించిన ఘనత తక్కవేమీ కాదు. అవి ఆంధ్ర వాజ్ఞయంలో తగిన స్థానం సంపాదించుకోగలిగాయి. యావత్ తెలుగుజాతి ఆలోచనా విధానాన్ని ప్రభావితంజేసి, తెలుగువారి దృక్పథంలో నూతనత్వానికి శ్రీకారం చుట్టాయి. ఒకనాడు తెలుగు సాహితీ ప్రపంచమే సంచలనాత్మక రచయిత వైపు దృష్టిసారించి అబ్బురపడిందన్న విషయం మనం మరువలేనిది. ఆపైన ఆథ్యాత్మిక చైతన్యం పొందిన చలం మాటలకు విలువ వుంటుందని నేననుకోను. ఒక్క చలమే కాదు ఆథ్యాత్మిక చైతన్యం పొందిన ఏ వ్యక్తి మాటలకైనా ఆథ్యాత్మిక విలువ తప్ప సామాజిక విలువలు వుండవు. ఎందుకంటే ఆథ్యాత్మిక మానవుడికి అన్ని విలువలూ సమానమే. భావాల హెచ్చుతగ్గుల వివక్ష వుండదు. అప్పుడే ఆథ్యాత్మికం సాధ్యం కూడా. ఏది ఏమైనా స్త్రీకి స్వేచ్ఛని ప్రసాదించాలనే తీవ్ర తాపత్రయంలో భారతీయ కుటుంబ వ్యవస్థనూ, పసిపిల్లల భవిష్యత్తునూ చలం విస్మరించారనే విషయమూ విమర్శలకు నోచుకుంది.

కానీ, గడచిన రెండు దశాబ్దాలకాలంలో ఆధునిక స్త్రీ తన దాస్య శృంఖలాల్ని తనే ఛేదించుకోవాలనే స్వీయ జ్ఞానాన్ని పొందింది. నడుం బిగించి ఆ దిశగా తనకి తానుగానే ఉద్యమించింది. ఆ క్రమంలో ఆమె సాధించిన విజయాలు తక్కువేమీ కాదు. పురుషుడితో సమానంగా ఆమె ఆర్థిక స్వావలంబన సాధించుకుంది. తన ప్రాణ, మాన సంరక్షణ కోసం తగువిధంగా చట్టాలు రూపొందించుకోగిలిగింది. అయినా, కనుచూపు మేరలో ఆమె సామాజిక స్వేచ్ఛ ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే చందంగా వుండిపోయింది.

అదే చట్టాలు సంఘంలో బరితెగించిన స్త్రీ వ్యక్తులకు మారణాయుధాలై చేతికందాయి. మంచి ప్రవర్తన గల మగవాళ్ళు సైతం ఈ చెడు మార్గాన్ననుసరించిన స్త్రీల చేత భంగపడిన సంఘటలలు ఇటీవల కోకొల్లలు. వరకట్నం ఊసెత్తని పురుషుడ్ని సైతం తనకి అభిప్రాయభేదం కలిగినప్పుడు స్త్రీలు వరకట్నపీడితుడిగా కోర్టుల కీడ్చి శిక్షింపజేయడం వంటి సంఘటనలు ఎంతైనా అమానుషం. ఇటువంటి స్త్రీలు తమని సామాజిక, ప్రాణ సంరక్షణకోసం ఏర్పడిన చట్టాల వెనుక స్త్రీ వేదననూ, బాధలనూ గుర్తించిన పురుషులు అనేకులున్నారన్న విషయం విస్మరించరాదు. కేవలం స్త్రీల వల్లనే ఆయా చట్టాలు రూపొందించబడలేదు. సరిగ్గా యిక్కడే పురుషుడు కూడా స్త్రీని ద్వేషించడం, తనకి బాధాకరంగా పరిణమించిన చట్టాల్ని దుయ్యబట్టడం జరిగింది.

ఏదియేమైనా, పురుషుడు తన జాత్యహంకారం మూలంగా స్త్రీ అనాది నుండీ అణచివేతకి గురైనదన్న విషయం అంగీకరించక తప్పదు. అదే విధంగా స్త్రీలు తమకి అణ్వాయుధాలై చేతికందిన ‘ఉమెన్ ప్రొటెక్షన్’ వంటి కేసుల్ని తప్పుడు పోకడలకు కాక నిజమైన తప్పిదం జరిగిన చోట మాత్రమే వాడుకోవడం సమంజసం. ఎందుకంటే, మానవజాతిలో స్త్రీ, పురుషులిద్దరూ భాగస్వాములు. స్త్రీ లేనిదే పురుషుడు లేడు. అలాగే స్త్రీ విషయంలో కూడా. అలా స్త్రీ పురుషులిద్దరూ సమదృష్టితో మెలగినంత కాలమే మానవత్వానికి మనుగడ. మానవజాతి మనుగడ. కడకి మనిషికే మనుగడ. ఆ అవగాహన నశించిన రోజున మనకి మిగిలేది శూన్యం.

చివరగా ఒకమాట. ఆచారాల పేరిట, కట్టుబాట్ల పేరిట, మతాల పేరిట స్త్రీ అణచివేతకి గురైందన్న విషయం నూరుకి నూరు పాళ్ళూ సత్యమనడానికి ఎన్నో తార్కాణాలు అవసరం లేదు. స్వంతంత్రించి, ఒక్కటే ఒక్కటి ఉదహరిస్తాను.

స్త్రీ శరీరం యావత్తూ పురుషుడి స్వంతమేనన్నది విశ్వసత్యం. అటువంటి పురుషుడి సొత్తైన స్త్రీ శరీరపు వంపు సొంపుల్నీ, ముఖ సోయగాల్నీ, లావణ్యాన్నీ, సుకుమారతనీ పురుషుడు వీక్షించి, తరించి, తథాత్మ్యం చెందాల్సిన స్త్రీమూర్తి గీర్వాణ సౌందర్యాన్ని ఒక మతం వారు నల్లముసుగులు వేసి మరుగు పరిస్తే, ఆ స్త్రీలు ఏ పాపమూ ఎరుగకుండానే ముసుగుదొంగలకి మల్లే మన మధ్యనే సంచరిస్తుంటే, సహజీవిస్తుంటే మనసున్న ఏ మనిషికైనా ప్రస్ఫుటంగా తెలీడం లేదా చరిత్రలో స్త్రీమూర్తి నిస్సందేహంగా అణచివేతకు గురైనదని, ప్రస్తుతం గురౌతూనే వున్నదన్న విషయం.

ఇంతకుమించిన తార్కాణాలు కావాలంటారా?

(సమాప్తం)