ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి,  అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. ."ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల"నీ, "ఒక పూర్తి మానవుడిగా పరిణమించాల"నీ, నేను కంటున్న కల,  కడుతున్న కోట. . .ఒహ్ ఇంతెందుకు కనుచూపు మేరలో. . . నా జీవితం ఒక వేద సంకలనం!!  నేనొక ఈశ్వరుడిని!!! ( ఇది ఈ బ్లాగులోని ప్రసంగి కథలో ఒక పాత్ర మనోభావాలు __ రచయిత )

Showing posts with label చారిత్రక కథ. Show all posts
Showing posts with label చారిత్రక కథ. Show all posts

Saturday, September 1, 2007

రాయస్థాపనాచార్య!.. 3 (కథ)

రాయస్థాపనాచార్య!

(‘స్వాతి’ సపరివార పత్రిక సంచిక 11.07.2003 లో ప్రచురితమైన చారిత్రాత్మక కథ! పాఠకుల మనసులు కలచివేస్తూ, మానవ విలువల్ని సునిశితంగా ప్రశ్నించే కథ యిది! ‘తెలుగు అకాడమీ’ వారెవరైనా పూనుకుని ఈ కథను 6వ తరగతి నుండి 10వ తరగతి లోపు ఏదో ఒక క్లాసులో తెలుగు పాఠ్యాంశంగా దీన్ని మార్చడానికి ప్రయత్నం చేయగలరని ప్రార్థన!)

గుండయనాయకుడు ఆమెను సమీపించి, ఆమె తలపై చేయివేసి మృదువుగా నిమురుతూ, “నాగదేవుడు నిన్ను పెళ్ళాడతాడటగా?” అన్నాడు. కూతురి కళ్ళలో వెలుగు చూడాలన్న ఏదో వెర్రి తలపుతో ఆ మాట అడిగాడే గానీ అతడన్న మాట అతడికే నవ్వు తెప్పించింది.

తండ్రి మాటకి గోపికాపూర్ణిమ సిగ్గుల మొగ్గయింది. నెమ్మదిగా వంగి, తండ్రి పాదాలకి నమస్కరించింది. కనుకొలనుల్లో నీళ్ళు చిప్పిల్లుతుండగా, “తమరి కీర్తి ప్రతిష్టలే కదా నాన్నగారూ! దీనికి కారణం!” అంది.

తర్వాత లేచి, తండ్రి ముఖంలోకి చూడలేక నవ్వింది. ఆపైన సిగ్గుని భరించలేక అక్కడనుండి బయటకి పరుగులు తీసింది. అలా సిగ్గులొలకబోసుకుంటూ పరుగిడుతున్న కుమార్తెని క్షణం సేపు తనివిదీరా చూసుకుని, ఆపైన గుండయనాయకుడు మంచం మీద కూర్చున్నాడు. కుమార్తె పరుపుకింద దాచిన లేఖని తీశాడు. అది గోపికాపూర్ణిమ నాగదేవుడికి రాసిన లేఖ. చదువనారంభించినాడు.

“నా ప్రాణదేవులు నాగదేవుల వారికి,

గోపికా పూర్ణిమ నమస్కృతులు!

మీతో పరిణయం నాలోని ఏకైక స్వప్నం! ప్రభూ! నా స్వప్నం వీడింది. మీ తండ్రి గారు చెప్పి పంపిన శుభవార్తతో అది ఈ నాటికి నిజమై కళ్ళముందు రూపుదాల్చబోతోంది.

మీరు జన్మతః అహింసావాదులని నాకు తెలుసు! అనుక్షణం పుస్తక పఠనంలోనూ, గ్రంథరచన లోనూ కాలం గడిపే సాత్విక స్వభావులనీ తెలుసు. అందుకే మీరంటే నాకు వల్లమాలిన ప్రేమానురాగాలు!

ప్రభూ! మనకి జన్మించబోయే మగ శిశువు మరో సోమనాథ సేనాని కాగలడు. లేదంటే గుండయసేనాని కాగలడు. అదే మా వాళ్ళందరీ అకాంక్ష! కానీ, ప్రభూ. . . మీ వలెనే నాకీ హింసతో ముడిపడిన రాజనీతంటే పడదు.

వచ్చే ఏడాది ఋతుపవనాల నాటికి మనకి జన్మించబోయే సేనాపతుల వంశపు బిడ్డడు అహింసా ప్రభోదకుడై, విశ్వశాంతి కాముకుడై ప్రపంచాన్ని వెలుగువైపు నడిపే మహాపురుషుడు కావాలని కళ్ళముందు మరో స్వప్నాన్ని ఆవిష్కరింపజేసుకుంటూ. . .మీ లేఖ కోసం ఎదురుచూసే. . .

మీ పాదదాసి. . .గోపికాపూర్ణిమ.

చదవడం చాలించి, గుండయనాయకుడు “ఎంత మంచి కలగంటున్నావే నా కన్నతల్లీ! నీ కలను నిజం చేయను నేను నిస్సహాయుడిని. నిర్దయాపరుడినమ్మా! నన్ను మన్నించుమమ్మా!” పరుపుమీద పడి ఏడవసాగాడు.

ఆరోజు సాయంత్రం గుండయనాయకుడు తనే సంతకెళ్ళాడు. అన్నిరకాల తినుబండారాలూ, పండ్లూ, పూలూ, మద్యం అన్నీ ఒక గుర్రపు బగ్గీమీద వేయించి ఇల్లు చేర్పించినాడు. తమ జీవితాల్లో చివరి రాత్రిని చేతనైనంత ఆనందంగా గడిపించదలిచాడు. ఇదేమీ తెలీని అతడి కుటుంబసభ్యులు ‘శుభవార్తలు విన్న సంబరంలో గుండయ అదంతా చేస్తున్న’ట్టుగా భావించారు.

పొంగిపొరలే దుఃఖాన్ని బలవంతంగా అణగిద్రొక్కి ఆరాత్రి గుండయనాయకుడు అందరిచేతా తన చేతుల్తో స్వయంగా తినుబండారాలు తినిపించాడు. తను మాత్రం విషాదం భరించలేక మద్యం సేవించినాడు. ఎన్నడూ చూడని ఆ వింత చూసి నవ్వుకున్నారు అతడి కుటుంబ సభ్యులు.

పరుపులు నేలమీద పరిచి, మధ్యలో తను కూర్చుని చుట్టూరా తల్లినీ, భార్యనీ, కూతుర్నీ, కొడుకునీ అందర్నీ కూర్చోబెట్టుకుని రాత్రంతా వాళ్ల తలలు నిమురుతూ నుదుటిపై ముద్దులు పెట్టుకుంటూ వీలు చిక్కినప్పుడల్లా చాటుకెళ్ళి ఎలుగెత్తియేడ్చి, విలపించి వస్తూ, భయంకరంగా గడిపాడు గుండయసేనాని ఆ రాత్రిని.

రాత్రి మెల్లగా తెల్లవారసాగింది! ఉన్నట్టుండి ఎందుకో అనుమానం వచ్చి బైటకెళ్ళి ఓసారి ఆకాశంవెపు చూసాడు. వేకువచుక్క పొడవనే పొడిచింది! అది చూసి ఒక వెర్రికేక పెట్టాడు గుండయనాయకుడు.

సరిగ్గా అదే సమయానికి ఓరుగల్లుకోట నుండి ప్రమాదసూచకంగా ‘నగారా’ శబ్ధం వినిపించసాగింది.

పరుగు పరుగున వచ్చాడు గుండయనాయకుడు! మళ్ళీ తన స్థానంలో తను కూర్చుంటూ అందరినీ ఒక్కసారిగా రెండు చేతులతో పొదివి పట్టుకున్నాడు. దగ్గరికి చేర్చుకున్నాడు. ఇక దుఖం ఆగలేదు. పెద్దగా పొలికేకలు పెట్టి ఏడ్చాడు. అతడి ప్రవర్తనని చిత్రంగా చూశారు అతడి కుటుంబ సభ్యులు. “ఏం జరిగింద”ని అతడ్ని అడగబోయారు. . .ఆ చివరి క్షణంలో!

అంతే! ప్రశ్న ప్రశ్నగానే కంఠంలో మిగిలిపోయింది!

‘ధగ్గు’మన్న ఒకే ఒక్క కఠోర శబ్ధంతో, భయోత్పాతమైన వెలుగు, విద్యుచ్ఛటలతో అక్కడ మంటలు వ్యాపించుకున్నాయి. ‘ధఢ ధఢ ధణేల్’ మన్న వికృత శబ్ధాలతో ఆ ఇల్లు నిలువునా కూలిపోయింది. అరక్షణంలో అయిదు ప్రాణాలూ అనంతవాయువుల్లో కలిసిపోయాయి.

రత్నగిరి కొండపైన వున్న అయిదొందల కుటుంబాలూ అగ్నికి ఆహుతయినాయి. దేవగిరి శత్రుసైన్యాలు ప్రాణాలు వదిలి పైనున్న దేవగిరికి ప్రయాణం కట్టాయి. రత్నగిరి మొత్తం సర్వం. . .సర్వ నాశనమయిపోయింది!

ఆ తర్వాత, రుద్రమదేవి తనపై దండైత్తి వచ్చిన యాదవ మహదేవరాజుని దేవగిరి దాకా తరిమి తరిమికొట్టింది. అతడు చేసిన తప్పుకి అతడి చేత కప్పం కట్టించుకుని మరీ వదిలిపెట్టింది. తర్వాత, విధ్వంసమైన రత్నగిరిని సందర్శించి సభను సమావేశపరిచి ఈ విధంగా అన్నది.

“రాయస్థాపనాచార్య గుండయ సేనాని జీవిత వృత్తాంతం శాసనబద్దం చేయండి! ఆ మహానుభావుడి కీర్తినీ, త్యాగాన్నీ రత్నగిరి శాసనం (కల్పించబడింది) పేరిట వివరంగా లిఖించండి. గుండయనాయకుడి జీవితమే రత్నగిరి శాసనం కావాలి!”

( సమాప్తం )

Friday, August 31, 2007

రాయస్థాపనాచార్య!.. 2 (కథ)

రాయస్థాపనాచార్య!

(‘స్వాతి’ సపరివార పత్రిక సంచిక 11.07.2003 లో ప్రచురితమైన చారిత్రాత్మక కథ! పాఠకుల మనసులు కలచివేస్తూ, మానవ విలువల్ని సునిశితంగా ప్రశ్నించే కథ యిది! "తెలుగు అకాడమీ" వారెవరైనా దీన్ని 6వ తరగతి నుండి 10వ తరగతి వరకూ తెలుగు పాఠ్యాంశంగా మార్చడానికి ప్రయత్నించగలరని ప్రార్థన!)


‘వెళ్ళార’న్నట్టు తలూపింది వెంగమాంబ.

“వెళ్ళమ్మా వెంగమాంబా! గుండయ బాగా అలిసిపోయి వచ్చాడు. కాళ్లకి నీళ్ళిచ్చి లోపలిగదిలోకి తీసుకు వెళ్ళు! అన్ని శుభవార్తలూ ఏకాంతంలో నీ నోటితోనే విన్పించు!” అంది పుండరీయమ్మ.

“ఏందమ్మా ఈ హడావిడంతా? ఏమైంది?” గొంతు పూడుకుపోతుండగా, తల్లిని అడగలేక అడిగాడు గుండయనాయకుడు.

“అన్నీ చెపుతుందిలే నీ భార్య. ముందు లోపలికి వెళ్లు నాయనా!” అంది. . .ముంచుకొచ్చిన ముప్పు గురించి తెలీని ఆ వృద్దురాలెంతో సంతోషంగా.

గుండయ తల్లివైపు చూశాడు. ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోతోంది. అతడికి జాలేసింది. “ఇంకెంతసేపమ్మా! ఈ వెర్రి సంబరం?” అనుకున్నాడు. దుఃఖం ముంచుకొచ్చింది. మౌనంగా లోపలికి నడిచాడు.

లోపలి గదిలోకి వెళ్ళగానే గది తలుపులు మూసి లోన గడియపెట్టి, భర్త పాదాలకి వినయంగా నమస్కరించింది వెంగమాంబ.

“ఏమిటిది వెంగమాంబా ఏమయింది?” ఆమె భూజాలు పట్టిలేపి, తన గుండెలకి హత్తుకుంటూ అడిగాడు గుండయనాయకుడు. వెంగమాంబ కళ్ళలో ఆనందబాష్పాలు ఉబికాయి. “అయ్యా! నా పూజ ఫలించింది. మన కల పండింది!” అంది.

గుండయనాయకుడు మాట్లడలేదు.

“సోమనాథ సేనాని కుమారుడు నాగదేవుడు మన అమ్మాయిని పెళ్ళాడడానికి అంగీకరించాడట. ఆ సంగతి సోమనాథ సేనాని కబురు పంపించాడు.” అంది.

మరో సమయంలోనైతే ఆమాటకి గుండయ ఎగిరి గంతేసేవాడు. ప్రాణాలే అనిశ్చితమైన ఆ విపత్కర సమయంలో ఏం సంతోషించగలడు. అందుకే మౌనంగా వుండిపోయాడు. అదేమీ పట్టించుకోని వెంగమాంబ కొనసాగించింది.

“అయ్యా! నిన్న అన్నీ శుభవార్తలే! మన పిల్లవాడు తిమ్మయ నిన్న వాళ్ల పాఠశాలలో కర్నాట రాజాస్థాన తెలుగు పండితులు నిర్వహించిన పద్య పోటీలో నూటపదహారు వరహాల బహుమతిని అందుకున్నాడు.” అంది.

కుమారుడి గొప్పదనం వినగానే గుండయనాయకుడి కళ్లు మెరిశాయి. “నిజమా!” అన్నాడు.

‘నిజమే’నన్నట్టు తలూపి, “వీటన్నిటికన్నా మంచివార్త మరొకటి వుంది!” అందామె సిగ్గుపడుతూ.

“ఏమిటది?” నిర్లిప్తంగా అడిగాడు గుండయ.

వెంగమాంబ అతడి చేయి పట్టుకుని, తీసుకువెళ్ళి మంచం మీద కూర్చోబెట్టింది. పక్కనే తనూ కూర్చుంటూ ముఖాన్ని అతడి గుండెలపై ఆనించి, తరువాత అంది. “అయ్యా! ఇన్నాళ్ళ మీ కోరిక తీరింది. మనకి మరో బిడ్డ పుట్టబోతున్నాడు. నాకిప్పుడు మూడవనెల!”

గుండయనాయకుడు నిరుత్తరుడయ్యాడు.
ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. ‘నిజమా’ అన్నట్టు ఆప్యాయంగా కళ్ళలోకి చూశాడు.

“నిన్న వాంతులు అవుతుంటే అనుమానం కలిగి వైద్యుడిని పిలిపించాను. వచ్చి పరీక్షించి చూసి గర్భమని అన్నాడు.” అందామె.

అది విని గుండయనాయకుడు భార్య ముఖాన్ని ప్రియమార తన గుండెలకి అదుముకున్నాడు.

‘మనసు నిండేట్టు ఎన్ని మాటలు చెప్పినావే వెంగమాంబా. అన్నీ మంచిమాటలే! కానీ నీకు నేనేమని చెప్పను? ఒక్కమాటలో మన కుటుంబ ఇహలోక నిష్క్రమణ వార్త చెప్పి, మీ మాటలకి విలువ లేకుండా చేయనా? నిజానికి సహధర్మచారిణికి చెప్పి తీరాలి! కానీ, నేను చెప్పలేను. చెప్పి ఏడ్పించలేను.’ అతడి కళ్లు నీటిని వర్షించి వెంగమాంబ వీపుభాగం తడిసిపోసాగింది. మళ్ళీ వెంగమాంబకి ఎక్కడ అనుమానం కలుగుతుందోనని. . .

“ఆనందంతో మనసు పొంగిందే! ఆనందాశ్రువులు చూడు!” అంటూ లేచి కన్నీటిని తుడుచుకున్నాడు.

గంగవెర్రులెత్తే ఆనందంలో వెలిగిపోతున్న భార్య ముఖాన్ని చూసి దిండులో తలదాచుకుని వెక్కి వెక్కి. . . వెక్కి వెక్కి ఏడ్చాడు గుండయనాయకుడు.

* * * *

“నాయనగారూ! ఆశీర్వదించండి!” పదకొండేళ్ళ తిమ్మయ గుండయనాయకుడి పాదాలకి ప్రణమిల్లాడు.

ఏమని ఆశీర్వదించగలడు గుండయసేనాని? ‘దీర్ఘాయుష్యమస్తుః అనగలడా.’ “లే నాయనా లే!” విషాదంతో గుండెలు పగిలిపోతుండగా కొడుకుని లేవనెత్తాడు. ప్రియమారా గట్టిగా కౌగలించుకున్నాడు.

“నాయనగారూ! నా పద్యానికి రాజపండితులు గురుకులంలో నూట పదహార్లు బహుకరించారు. ఏదైనా మంచి కావ్యం రచించమని సూచించారు.” అన్నాడు తిమ్మయ.

“ఏం పద్యం రాశావు నాయనా?” అన్నాడు గుండయ.

తిమ్మయ హుషారుగా లోపలి గదిలోకి వెళ్ళి, ఒక లేఖ పట్టుకుని వచ్చాడు. దాన్ని తండ్రి చేతికిస్తూ, “ఈ లేఖని మా గురువర్యులు స్వయంగా మీకివ్వమన్నారు. అందులోనే నేను రాసిన పద్యం కూడా రాశారు!” అన్నాడు.

లేఖనందుకుని విప్పి, గుండయ చదువసాగాడు.

“మహారాజ రాజమార్తాండ కాకతీయ సామ్రాజ్య ఆస్థాన సేనా నాయకులు శ్రీ శ్రీ శ్రీ గుండయనాయకుల వారికి రత్నగిరి గురుకుల ఆచార్యులు విప్రజ్యోతిర్మయుల వారు చేయు ప్రణామములు!

అయ్యా, తమ కుమారుడు చిరంజీవి తిమ్మయ విద్యాభ్యాసం ఎంతో సంతృప్తికరంగా వుంది. ప్రత్యేకించి తిమ్మయ కుమారుడిలోని కావ్య కౌశలం అమోఘమైనది. పసితనంలోనే అది కర్నాటరాజ్యం వరకూ వ్వాపించి, పరిఢవిల్లిందని చెప్పడానికి సంతోషిస్తున్నాము. అదేమిటనగా. . .నిన్న కర్నాటదేశ రాజాస్థాన పండితులు మన గురుకులానికి వేంచేసి, ఇక్కడ విద్యాభ్యాసం చేస్తున్న పిల్లలలోని కవితా పాటవాన్ని పరిశీలించారు. అందుకుగాను పద్యరచనా పోటీని నిర్వహించినారు.

ఆ సందర్భంగా, తిమ్మయ కుమారుడు ప్రదర్శించిన ప్రతిభా పాటవాలు చూసి అచ్చెరువు చెందారు! నివ్వెరపోయారు! వారు తిమ్మయ రాసిన పద్యాన్నిగాక పద్యభావాన్ని గ్రహించి, విస్మయం చెందారు. తిమ్మయకి విద్యాబుద్దులు గఱిపి, ఆ స్థాయికి తెచ్చిన గురువుగా నన్ను ఆభినందించినారు. నాకు కూడా నూట పదహార్లు బహుకరించారు. అయ్యా! కర్నాట రాజ పండితుల చేత గౌరవించబడిన అప్పటి నా ఆనందం వెలకట్టలేనిది. తిమ్మయ వంటి బాలుడిని శిష్యుడిగా పొందిన నేను ధన్యుడిని! జన్మనిచ్చిన తమరు మరింతగా ధన్యతములు!!

దయవుంచి తిమ్మయ నాయకుని ప్రోత్సహించండి! ఆ చిరంజీవికి ఉజ్వలమైన భవిష్యత్తు వుంది. తిమ్మయ రాసిన పద్యం క్రింద వ్రాస్తున్నాను!

‘త్యాగభావమనిన త్యజిత స్వార్థముగాదు
త్యాగపరుని యందు తన స్యార్థతమమె మెండు!
లోక ప్రశంశలకె లోనాత్మ ప్రశంశకే
త్యాగధనుడెపుండు తెగనంగలార్చుచుండు!!’

‘భావం :
త్యాగ భావనలో స్వార్థం వదులుకోవడమనేది లేదు. త్యాగపరునిలో తన గురించిన స్వార్థమే ఎక్కువ. లోకం మెచ్చుకోలు కోసం, తనలోని అహాన్ని సంతృప్తి పరుచుకోడానికి త్యాగి ఎప్పుడూ వెంపర్లాడుతుంటాడు.’

చూడండి తిమ్మయ ఎంత లోతుగా ఆలోచించి ఎంత గొప్పగా వ్రాసినాడో. రేపు ఏకాదశినాడు తమర్ని కలిసి, తమ దర్శనం చేసుకోగలను!

చిత్తగించవలయును!
ఇట్లు. . .
ఆచార్య విప్రజ్యోతిర్మయుడు”

గుండయనాయకుడు చదవడం ముగించాడు. తిమ్మయను మరొక్కసారి ఆప్యాయంగా గుండెలకి హత్తుకున్నాడు. పెద్దగా రోదించినట్టుగా ఏడ్చాడు.

“త్యాగం గురించి ఎంత చక్కగా వివరించావు నాయనా తిమ్మయా! ఇంతకాలం నేనో పెద్ద త్యాగమూర్తినని విర్రవీగాను. మిడిసిపడ్డాను. నాకన్నా స్వార్థపరుడులేడని పసినాటనే పద్యం రాసి కనువిప్పు కలిగించావు. నీకు నేనే విధంగా భవిష్యత్తు కల్పించగలనురా తండ్రీ.!” గుండయనాయకుడు కొడుకుని పట్టుకుని వదలలేక రోదిస్తూనే వున్నాడు.

అక్కడే నిలబడి ఆదృశ్యమంతటినీ చూస్తున్న అతడి తల్లి పుండరీయమ్మ, ఇల్లాలు వెంగమాంబ, పద్దెనిమిదేళ్ళ కూతురు గోపికాపూర్ణిమ అందరూ అవన్నీ గుండయనాయకుడి ఆనందభాష్పాలనుకున్నారు.

వాళ్ళ కళ్ళల్లో కూడా ఆనందభాష్పాలు మెరిశాయి.

* * * *
ఆరోజు మధ్యాహ్నం గుండయనాయకుడు కుమార్తె గోపికాపూర్ణిమ గదిలోకి నడిచాడు. ఆ సమయానికి గోపికాపూర్ణిమ పట్టు పరుపు మీద పవళించి, ఏదో లేఖ చదువుకుంటోంది. తండ్రి రాకని గమనించి మంచంమీంచి లేచింది. లేఖని పరుపు క్రింద దాచింది.

(సశేషం)

Thursday, August 30, 2007

రాయస్థాపనాచార్య!.. 1 (కథ)

రాయస్థాపనాచార్య!

(‘స్వాతి’ సపరివార పత్రిక సంచిక 11.07.2003 లో ప్రచురితమైన చారిత్రాత్మక కథ! పాఠకుల మనసులు కలచివేస్తూ, మానవ విలువల్ని సునిశితంగా ప్రశ్నించే కథ యిది!)

కాలం : క్రీ.శ. 1271. కాకతీయుల నాటి కాలం!
స్థలం -: ఓరుగల్లు! సమయం వేకువవేళ!

అక్కడ కోటలో ఒక రహస్య సమావేశం జరుగుతున్నది. సమావేశమందిరంలో ఒక ఉన్నతాసనం పైన రాణీ రుద్రమదేవి ఆసీనురాలై వుంది. ఆమె ఎదురుగా సేనానాయకులు ప్రసాదిత్యుడు, అంబదేవులు, గంగయసాహిణి, గోనగన్నయ, కన్నర, త్రిపురారి, జన్నిగ, మాదయ నాయకులు ఆసీనులయి వున్నారు. వారికి ఒక ప్రక్కగా గుండయనాయకుడు కూర్చుని వున్నాడు.

రుద్రమదేవి గొంతు సవరించుకుంది. గుండయనాయకుడిని చూసింది. మధుర గంభీర స్వరంతో, “గుండయ నాయకా! ఓరుగల్లుకి ప్రమాదం వాటిల్లింది. ఓరుగల్లు కోటపై దేవగిరి యాదవుల దాడి ప్రారంభమయింది. యాదవ మహదేవరాజు దురాక్రమణ ప్రయత్నాలు ప్రారంభించాడు. అందులో భాగంగా మొదట సైన్యాన్ని రత్నగిరి తరలించాడు. రత్నగిరిలోని రహస్య ప్రదేశాల్లో సైన్యం మొహరించివుంది. ప్రస్తుతం రత్నగిరి యాదవరాజు ఆధీనంలో వుంది.” అంది.

‘సైన్యం రత్నగిరిని ఆక్రమించుకుంద’న్న మాట వినగానే ఉలిక్కిపడ్డాడు గుండయనాయకుడు. ఎందుకంటే ఆయన ఇల్లూ, కుటుంబం రత్నగిరిలో వున్నాయి.

సన్నగా వణుకుతున్న స్వరంతో, “ఎప్పుడు జరిగింది మహారాణీ ఈ ఆక్రమణ?” అని అన్నాడు.

“రాత్రి” అని, “గుండయనాయకా! మీరు రాయస్థాపనాచార్య బిరుదాంకితులు. ఈ ఆపద సమయంలో ఆత్మస్థైర్యం వహించాలి.” అంది రుద్రమదేవి. మళ్ళీ తనే. . “గుండయనాయకా! రత్నగిరి కొండపై మొత్తం నాలుగైదు వందల కుటుంబాలు మాత్రమే వున్నాయి. మహదేవరాజు సైన్యాన్ని తిప్పికొట్టడం లేదా నాశనం చేయడం మనకో లెక్కలోది కాదు. ఎందుకంటే నాలుగడుగుల వ్యాసార్థం గల పెద్ద ఫిరంగి రత్నగిరి ముఖద్వారానికి గురిపెట్టబడి వుంది. మూడడుగుల ఫిరంగులు పది రత్నగిరిలోని అన్ని ప్రముఖ ప్రాంతాలకీ గురిపెట్టి వున్నాయి.”

“ఇంకా అసంఖ్యాకమైన పదాతిదళాలు క్షణంలో రత్నగిరి లోని సైన్యాన్ని తుడిచిపెట్టగలవు. అయితే, రత్నగిరిలో నివసించే నాలుగైదువందల కుటుంబాలూ ప్రమాదానికి గురవుతాయి. అదీ నిజానికి మనకి సమస్య కాదు. ఎందుకంటే లక్షల కుటుంబాల్ని కాపాడుకోడం కోసం ఓ అయిదొందల కుటుంబాలు వదలుకోవడం తప్పనిసరైతే వాటిని నిర్థాక్షిణ్యంగా వదులుకోవడం రాజనీతి!”

“ఎటొచ్చీ, అసలు సమస్య మీ కుటుంబం గూర్చి! మీ కుటుంబం రత్నగిరిలో చిక్కుకునిపోయింది. తప్పించడానికి వీలులేదు. సైన్యం మీ యింటిమీద నిఘా వేసివుంది. తప్పించడానికి ప్రయత్నిస్తే వాళ్ళు రత్నగిరిని ఆక్రమించిన విషయం మనకి తెలిసిపోయిందని భయపడి వెంటనే ఓరుగల్లు కోటపై దాడికి దిగుతారు.” చెప్పి, శ్వాస తీసుకోవడం కోసమని ఆగింది రుద్రమదేవి.

“అయ్యా! గుండయనాయకా! మా దాయాదులు హరిహర, మురారిదేవులు నాపై తిరుగుబాటు చేసినప్పుడు మీరు నా తండ్రివలె అనుక్షణం నా వెంటవుండి కాపాడినారు. దేశంలోని అంతః కలహాల్ని సమర్థవంతంగా అణిచి వేశారు. అటువంటి ప్రశస్తమయిన సేవాతత్పరత గల్గిన నాయకులు మీరు. మీ కుటుంబం శత్రుబారిన పడటం, అదీ కేవలం మన ఫిరంగుల కారణంగానే చనిపోవలసిరావడం ఎంతో దురదృష్టకరం. దేశ ప్రజలకీ, అంతకన్నా ముఖ్యంగా నాకు చాలా బాధాకరం!” రుద్రమదేవి నేత్రాల్లో కన్నీరు చిప్పిల్లాయి. కంఠం పూడుకుపోయింది.

“ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే. . . మీరు తక్షణం ఇక్కడ్నుంచి ఒంటరిగానే రత్నగిరికి వెళ్ళండి. కడసారి చూపులుగా ఈ పగలంతా మీ కుటుంబ సభ్యుల మధ్య గడపండి. రాత్రిలోపు మీరు కుటుంబాన్ని వీడి రాలేకపోయారంటే రేపు సరిగ్గా వేకువ చుక్కపొడిచే సమయానికి మీరు ఫిరంగులకి ఆహుతైపోక తప్పదు!” రుద్రమదేవి దుఃఖోద్వేగంతో పెదవి విప్పి మాట్లాడలేక పోయింది. కొంతసేపటికి ఎలాగో ఆ దుఃఖం నుండి తేరుకుని, “వెళ్ళండి! సేనానాయకా! తక్షణం వెళ్ళండి. వెళ్ళి మీ కుటుంబాన్ని కలవండి. మీరు రావాలనే ఆశిస్తాను.” అంది.

గుండయనాయకుడికి విషయం అర్థమైపోయింది. ఇక తను చేయాల్సిందేగానీ చెప్పాల్సిందేమీలేదు. అసనంలోంచి లేచాడు. అక్కడున్న వారందరికి చేతులు జోడించి నమస్కరించాడు. రుద్రమదేవి వైపు చూశాడు.

“అమ్మా రుద్రాంబా! దురదృష్టవంతుడిని. దేశ రక్షణలో పాలుపంచకోవలసిన విపత్కర సమయాన కుటుంబంకోసం వెళ్ళవలసి వచ్చింది. వెళతాను. రాగలిగితే రాత్రిలోపు తిరిగి వస్తాను. లేదంటే ఆగిపోతాను. కానీ మీరు మాత్రం మా గురించి ఆలోచిస్తూ వేకువ వేళకి విధ్వంసం చేయడం ఆపవద్దు. ఆపినారా రేపు సాయంత్రానికి యాదవ మహదేవరాజు దాడి ప్రారంభిస్తాడు. ఓరుగల్లు కోట వాళ్ళ వశమవుతుంది. ఆ దుర్మార్గుడి పాలనలో ప్రజలు పురిటి మంచం పన్నులతో సహా కట్టలేక కష్టాలపాలు కావలసివస్తుంది.” చెప్పి, రుద్రమదేవికి నమస్కరించి గుండయనాయకుడు కదిలాడు.

దేశ సంరక్షణ కోసం కుటుంబాన్ని త్యాగం చేసి, కదిలి వెళ్తున్న ఆ సేనా నాయకుడుని చూసి మిగిలిన నాయకులంతా కన్నీరు పెట్టారు. వీడ్కోలు చెప్పారు.

“గుండయనాయకా!” వెళ్తున్న గుండయనాయకుడిని రుద్రమదేవి పిలిచింది. వెళ్తున్నవాడు ఆగి, చటుక్కున వెనక్కి తిరిగాడు. ఏమిటన్నట్టు చూశాడు.

“ఎటువంటి పరిస్థితుల్లోనూ, కుటుంబాన్ని రత్నగిరి దాటించడానికి ప్రయత్నించకండి. ఆ పని చేసినారంటే మేమంతా వుండం. ఇకపై కాకతీయుల పాలన వుండదు!” అంటూ రెండు చేతులూ ఎత్తి నమస్కరించింది రుద్రమదేవి.

గుండయనాయకుడు నవ్వాడు. ఆ పని ఎన్నటికీ జరగదన్నట్టు తల అడ్డంగా వూపాడు. తరువాత అన్నాడు.

“ప్రజలంటే నీకే కాదమ్మా. నాకూ బిడ్డల్లాంటివారే!”

* * * *

“టక్! టక్!” మని తన ఇంటి తలుపు తట్టాడు గుండయనాయకుడు. క్షణకాలం గడిచిన తర్వాత తలుపులు తెరుచుకున్నాయి. ఎదురుగా అతడి తల్లి పుండరీయమ్మ నిలుచుని వుంది.

“వచ్చావా నాయనా?” అని లోపలికి తొంగిచూస్తూ, “గుండయ వచ్చాడమ్మా వెంగమాంబా! ఎర్రనీళ్ళూ, హారతీ పట్టుకురా. దృష్టి తీద్దువుగానీ!” అందామె.

“నాకు దృష్టేమిటమ్మా. . .నీ పిచ్చిగానీ” వికల మనస్కుడైన గుండయ గడప దాటి లోనికెళ్ళబోయాడు.

ఆగు నాయనా గుండయా! ఈ రోజు నీకు అన్నీ శుభవార్తలే. దృష్టి తీయవలసినదే.” అంది పుండరీయమ్మ.

తల్లినోట ‘శుభవార్త’ అన్నమాట వినగానే గుండయనాయకుడి కళ్ళవెంట కన్నీరు వుబికింది. ఎత్తిన కాలు ఎత్తినట్టే ఆపి, వాకిట్లోనే నిలబడిపోయాడు. “ఇక శుభవార్త లెక్కడివమ్మా మనకి. . .రేపీ సమయానికి అందరూ వినబోయేది మన చావువార్తలే!” స్వగతంలో అనుకున్నాడు.

నిముషం తర్వాత వెంగమాంబ వచ్చింది. పళ్ళెంలో ఎర్రనీళ్ళూ, ఉప్పూ, హారతీ పట్టుకు వచ్చింది. తలస్నానం చేసి, పట్టు వస్త్రాలు ధరించి వుంది. భర్తను చూసి కొత్త పెళ్ళికూతురిలూ సిగ్గుపడింది. ఆ తరువాత "మీ రాక కోసమే ఎదురు చూస్తున్నాం!" అంటూ దృష్టి తీసింది. ఎర్రనీళ్ళు బయట పారబోసి, ఉప్పు తీసుకెళ్ళి, ఇంట్లో నిప్పుల్లో వేసి వచ్చింది. మళ్ళీ భర్తని సమీపిస్తూ, “ఆ కళ్ళలో నీళ్ళేమిటండీ?” అంది అనుమానంగా.

“ఏదో నలుసుపడిందిలే!” అన్నాడు గుండయనాయకుడు ముఖం పక్కకి తిప్పుకుంటూ. నడుముకి వ్రేలాడుతున్న కరవాలం తీసి భార్యకి అందించాడు.

“పిల్లలేరి?” అడిగాడు ఇల్లంతా కలియజూస్తూ.

“ఇంట్లో తులసి మొక్క ఎండితే ఇంకోటి తీసుకురాను పక్కింటికెళ్ళారు. వస్తారులే!” అంది వెంగమాంబ.

“ఇద్దరూ వెళ్ళారా?” అడిగాడు గుండయనాయకుడు “యాదవుల సైన్యం రత్నగిరిని చుట్టుముడితే తులసి మొక్క ఎండక ఏంచేస్తుంద”నుకుంటూ.

( సశేషం )