ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి,  అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. ."ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల"నీ, "ఒక పూర్తి మానవుడిగా పరిణమించాల"నీ, నేను కంటున్న కల,  కడుతున్న కోట. . .ఒహ్ ఇంతెందుకు కనుచూపు మేరలో. . . నా జీవితం ఒక వేద సంకలనం!!  నేనొక ఈశ్వరుడిని!!! ( ఇది ఈ బ్లాగులోని ప్రసంగి కథలో ఒక పాత్ర మనోభావాలు __ రచయిత )

Friday, August 31, 2007

రాయస్థాపనాచార్య!.. 2 (కథ)

రాయస్థాపనాచార్య!

(‘స్వాతి’ సపరివార పత్రిక సంచిక 11.07.2003 లో ప్రచురితమైన చారిత్రాత్మక కథ! పాఠకుల మనసులు కలచివేస్తూ, మానవ విలువల్ని సునిశితంగా ప్రశ్నించే కథ యిది! "తెలుగు అకాడమీ" వారెవరైనా దీన్ని 6వ తరగతి నుండి 10వ తరగతి వరకూ తెలుగు పాఠ్యాంశంగా మార్చడానికి ప్రయత్నించగలరని ప్రార్థన!)


‘వెళ్ళార’న్నట్టు తలూపింది వెంగమాంబ.

“వెళ్ళమ్మా వెంగమాంబా! గుండయ బాగా అలిసిపోయి వచ్చాడు. కాళ్లకి నీళ్ళిచ్చి లోపలిగదిలోకి తీసుకు వెళ్ళు! అన్ని శుభవార్తలూ ఏకాంతంలో నీ నోటితోనే విన్పించు!” అంది పుండరీయమ్మ.

“ఏందమ్మా ఈ హడావిడంతా? ఏమైంది?” గొంతు పూడుకుపోతుండగా, తల్లిని అడగలేక అడిగాడు గుండయనాయకుడు.

“అన్నీ చెపుతుందిలే నీ భార్య. ముందు లోపలికి వెళ్లు నాయనా!” అంది. . .ముంచుకొచ్చిన ముప్పు గురించి తెలీని ఆ వృద్దురాలెంతో సంతోషంగా.

గుండయ తల్లివైపు చూశాడు. ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోతోంది. అతడికి జాలేసింది. “ఇంకెంతసేపమ్మా! ఈ వెర్రి సంబరం?” అనుకున్నాడు. దుఃఖం ముంచుకొచ్చింది. మౌనంగా లోపలికి నడిచాడు.

లోపలి గదిలోకి వెళ్ళగానే గది తలుపులు మూసి లోన గడియపెట్టి, భర్త పాదాలకి వినయంగా నమస్కరించింది వెంగమాంబ.

“ఏమిటిది వెంగమాంబా ఏమయింది?” ఆమె భూజాలు పట్టిలేపి, తన గుండెలకి హత్తుకుంటూ అడిగాడు గుండయనాయకుడు. వెంగమాంబ కళ్ళలో ఆనందబాష్పాలు ఉబికాయి. “అయ్యా! నా పూజ ఫలించింది. మన కల పండింది!” అంది.

గుండయనాయకుడు మాట్లడలేదు.

“సోమనాథ సేనాని కుమారుడు నాగదేవుడు మన అమ్మాయిని పెళ్ళాడడానికి అంగీకరించాడట. ఆ సంగతి సోమనాథ సేనాని కబురు పంపించాడు.” అంది.

మరో సమయంలోనైతే ఆమాటకి గుండయ ఎగిరి గంతేసేవాడు. ప్రాణాలే అనిశ్చితమైన ఆ విపత్కర సమయంలో ఏం సంతోషించగలడు. అందుకే మౌనంగా వుండిపోయాడు. అదేమీ పట్టించుకోని వెంగమాంబ కొనసాగించింది.

“అయ్యా! నిన్న అన్నీ శుభవార్తలే! మన పిల్లవాడు తిమ్మయ నిన్న వాళ్ల పాఠశాలలో కర్నాట రాజాస్థాన తెలుగు పండితులు నిర్వహించిన పద్య పోటీలో నూటపదహారు వరహాల బహుమతిని అందుకున్నాడు.” అంది.

కుమారుడి గొప్పదనం వినగానే గుండయనాయకుడి కళ్లు మెరిశాయి. “నిజమా!” అన్నాడు.

‘నిజమే’నన్నట్టు తలూపి, “వీటన్నిటికన్నా మంచివార్త మరొకటి వుంది!” అందామె సిగ్గుపడుతూ.

“ఏమిటది?” నిర్లిప్తంగా అడిగాడు గుండయ.

వెంగమాంబ అతడి చేయి పట్టుకుని, తీసుకువెళ్ళి మంచం మీద కూర్చోబెట్టింది. పక్కనే తనూ కూర్చుంటూ ముఖాన్ని అతడి గుండెలపై ఆనించి, తరువాత అంది. “అయ్యా! ఇన్నాళ్ళ మీ కోరిక తీరింది. మనకి మరో బిడ్డ పుట్టబోతున్నాడు. నాకిప్పుడు మూడవనెల!”

గుండయనాయకుడు నిరుత్తరుడయ్యాడు.
ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. ‘నిజమా’ అన్నట్టు ఆప్యాయంగా కళ్ళలోకి చూశాడు.

“నిన్న వాంతులు అవుతుంటే అనుమానం కలిగి వైద్యుడిని పిలిపించాను. వచ్చి పరీక్షించి చూసి గర్భమని అన్నాడు.” అందామె.

అది విని గుండయనాయకుడు భార్య ముఖాన్ని ప్రియమార తన గుండెలకి అదుముకున్నాడు.

‘మనసు నిండేట్టు ఎన్ని మాటలు చెప్పినావే వెంగమాంబా. అన్నీ మంచిమాటలే! కానీ నీకు నేనేమని చెప్పను? ఒక్కమాటలో మన కుటుంబ ఇహలోక నిష్క్రమణ వార్త చెప్పి, మీ మాటలకి విలువ లేకుండా చేయనా? నిజానికి సహధర్మచారిణికి చెప్పి తీరాలి! కానీ, నేను చెప్పలేను. చెప్పి ఏడ్పించలేను.’ అతడి కళ్లు నీటిని వర్షించి వెంగమాంబ వీపుభాగం తడిసిపోసాగింది. మళ్ళీ వెంగమాంబకి ఎక్కడ అనుమానం కలుగుతుందోనని. . .

“ఆనందంతో మనసు పొంగిందే! ఆనందాశ్రువులు చూడు!” అంటూ లేచి కన్నీటిని తుడుచుకున్నాడు.

గంగవెర్రులెత్తే ఆనందంలో వెలిగిపోతున్న భార్య ముఖాన్ని చూసి దిండులో తలదాచుకుని వెక్కి వెక్కి. . . వెక్కి వెక్కి ఏడ్చాడు గుండయనాయకుడు.

* * * *

“నాయనగారూ! ఆశీర్వదించండి!” పదకొండేళ్ళ తిమ్మయ గుండయనాయకుడి పాదాలకి ప్రణమిల్లాడు.

ఏమని ఆశీర్వదించగలడు గుండయసేనాని? ‘దీర్ఘాయుష్యమస్తుః అనగలడా.’ “లే నాయనా లే!” విషాదంతో గుండెలు పగిలిపోతుండగా కొడుకుని లేవనెత్తాడు. ప్రియమారా గట్టిగా కౌగలించుకున్నాడు.

“నాయనగారూ! నా పద్యానికి రాజపండితులు గురుకులంలో నూట పదహార్లు బహుకరించారు. ఏదైనా మంచి కావ్యం రచించమని సూచించారు.” అన్నాడు తిమ్మయ.

“ఏం పద్యం రాశావు నాయనా?” అన్నాడు గుండయ.

తిమ్మయ హుషారుగా లోపలి గదిలోకి వెళ్ళి, ఒక లేఖ పట్టుకుని వచ్చాడు. దాన్ని తండ్రి చేతికిస్తూ, “ఈ లేఖని మా గురువర్యులు స్వయంగా మీకివ్వమన్నారు. అందులోనే నేను రాసిన పద్యం కూడా రాశారు!” అన్నాడు.

లేఖనందుకుని విప్పి, గుండయ చదువసాగాడు.

“మహారాజ రాజమార్తాండ కాకతీయ సామ్రాజ్య ఆస్థాన సేనా నాయకులు శ్రీ శ్రీ శ్రీ గుండయనాయకుల వారికి రత్నగిరి గురుకుల ఆచార్యులు విప్రజ్యోతిర్మయుల వారు చేయు ప్రణామములు!

అయ్యా, తమ కుమారుడు చిరంజీవి తిమ్మయ విద్యాభ్యాసం ఎంతో సంతృప్తికరంగా వుంది. ప్రత్యేకించి తిమ్మయ కుమారుడిలోని కావ్య కౌశలం అమోఘమైనది. పసితనంలోనే అది కర్నాటరాజ్యం వరకూ వ్వాపించి, పరిఢవిల్లిందని చెప్పడానికి సంతోషిస్తున్నాము. అదేమిటనగా. . .నిన్న కర్నాటదేశ రాజాస్థాన పండితులు మన గురుకులానికి వేంచేసి, ఇక్కడ విద్యాభ్యాసం చేస్తున్న పిల్లలలోని కవితా పాటవాన్ని పరిశీలించారు. అందుకుగాను పద్యరచనా పోటీని నిర్వహించినారు.

ఆ సందర్భంగా, తిమ్మయ కుమారుడు ప్రదర్శించిన ప్రతిభా పాటవాలు చూసి అచ్చెరువు చెందారు! నివ్వెరపోయారు! వారు తిమ్మయ రాసిన పద్యాన్నిగాక పద్యభావాన్ని గ్రహించి, విస్మయం చెందారు. తిమ్మయకి విద్యాబుద్దులు గఱిపి, ఆ స్థాయికి తెచ్చిన గురువుగా నన్ను ఆభినందించినారు. నాకు కూడా నూట పదహార్లు బహుకరించారు. అయ్యా! కర్నాట రాజ పండితుల చేత గౌరవించబడిన అప్పటి నా ఆనందం వెలకట్టలేనిది. తిమ్మయ వంటి బాలుడిని శిష్యుడిగా పొందిన నేను ధన్యుడిని! జన్మనిచ్చిన తమరు మరింతగా ధన్యతములు!!

దయవుంచి తిమ్మయ నాయకుని ప్రోత్సహించండి! ఆ చిరంజీవికి ఉజ్వలమైన భవిష్యత్తు వుంది. తిమ్మయ రాసిన పద్యం క్రింద వ్రాస్తున్నాను!

‘త్యాగభావమనిన త్యజిత స్వార్థముగాదు
త్యాగపరుని యందు తన స్యార్థతమమె మెండు!
లోక ప్రశంశలకె లోనాత్మ ప్రశంశకే
త్యాగధనుడెపుండు తెగనంగలార్చుచుండు!!’

‘భావం :
త్యాగ భావనలో స్వార్థం వదులుకోవడమనేది లేదు. త్యాగపరునిలో తన గురించిన స్వార్థమే ఎక్కువ. లోకం మెచ్చుకోలు కోసం, తనలోని అహాన్ని సంతృప్తి పరుచుకోడానికి త్యాగి ఎప్పుడూ వెంపర్లాడుతుంటాడు.’

చూడండి తిమ్మయ ఎంత లోతుగా ఆలోచించి ఎంత గొప్పగా వ్రాసినాడో. రేపు ఏకాదశినాడు తమర్ని కలిసి, తమ దర్శనం చేసుకోగలను!

చిత్తగించవలయును!
ఇట్లు. . .
ఆచార్య విప్రజ్యోతిర్మయుడు”

గుండయనాయకుడు చదవడం ముగించాడు. తిమ్మయను మరొక్కసారి ఆప్యాయంగా గుండెలకి హత్తుకున్నాడు. పెద్దగా రోదించినట్టుగా ఏడ్చాడు.

“త్యాగం గురించి ఎంత చక్కగా వివరించావు నాయనా తిమ్మయా! ఇంతకాలం నేనో పెద్ద త్యాగమూర్తినని విర్రవీగాను. మిడిసిపడ్డాను. నాకన్నా స్వార్థపరుడులేడని పసినాటనే పద్యం రాసి కనువిప్పు కలిగించావు. నీకు నేనే విధంగా భవిష్యత్తు కల్పించగలనురా తండ్రీ.!” గుండయనాయకుడు కొడుకుని పట్టుకుని వదలలేక రోదిస్తూనే వున్నాడు.

అక్కడే నిలబడి ఆదృశ్యమంతటినీ చూస్తున్న అతడి తల్లి పుండరీయమ్మ, ఇల్లాలు వెంగమాంబ, పద్దెనిమిదేళ్ళ కూతురు గోపికాపూర్ణిమ అందరూ అవన్నీ గుండయనాయకుడి ఆనందభాష్పాలనుకున్నారు.

వాళ్ళ కళ్ళల్లో కూడా ఆనందభాష్పాలు మెరిశాయి.

* * * *
ఆరోజు మధ్యాహ్నం గుండయనాయకుడు కుమార్తె గోపికాపూర్ణిమ గదిలోకి నడిచాడు. ఆ సమయానికి గోపికాపూర్ణిమ పట్టు పరుపు మీద పవళించి, ఏదో లేఖ చదువుకుంటోంది. తండ్రి రాకని గమనించి మంచంమీంచి లేచింది. లేఖని పరుపు క్రింద దాచింది.

(సశేషం)

1 అభిప్రాయాలు:

Anonymous said...

ఇదేమిటి సార్! మానవతావిలువల్ని ప్రశ్నించడం కోసం తర్కాన్ని పూర్తిగా వదులుకోవలసిందేనా? తాను వెళ్ళి కుటుంబాన్ని చూసుకుని చక్కా వచ్చేయొచ్చు కానీ కుటుంబాన్ని తీసుకువెళ్ళరాదా? ఊళ్ళోకి జనాలు వచ్చీపోతుంటే శత్రువులకు అనుమానం కలుగుతుందా? ఆ ఊరుని శత్రుసైన్యం చుట్టుముట్టిందని ఊళ్ళోవాళ్ళకు తెలియదా?
అవును, మన పిల్లల పాఠ్యపుస్తకాలకు బాగా సరిపోతుంది.