ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి,  అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. ."ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల"నీ, "ఒక పూర్తి మానవుడిగా పరిణమించాల"నీ, నేను కంటున్న కల,  కడుతున్న కోట. . .ఒహ్ ఇంతెందుకు కనుచూపు మేరలో. . . నా జీవితం ఒక వేద సంకలనం!!  నేనొక ఈశ్వరుడిని!!! ( ఇది ఈ బ్లాగులోని ప్రసంగి కథలో ఒక పాత్ర మనోభావాలు __ రచయిత )

Thursday, August 30, 2007

రాయస్థాపనాచార్య!.. 1 (కథ)

రాయస్థాపనాచార్య!

(‘స్వాతి’ సపరివార పత్రిక సంచిక 11.07.2003 లో ప్రచురితమైన చారిత్రాత్మక కథ! పాఠకుల మనసులు కలచివేస్తూ, మానవ విలువల్ని సునిశితంగా ప్రశ్నించే కథ యిది!)

కాలం : క్రీ.శ. 1271. కాకతీయుల నాటి కాలం!
స్థలం -: ఓరుగల్లు! సమయం వేకువవేళ!

అక్కడ కోటలో ఒక రహస్య సమావేశం జరుగుతున్నది. సమావేశమందిరంలో ఒక ఉన్నతాసనం పైన రాణీ రుద్రమదేవి ఆసీనురాలై వుంది. ఆమె ఎదురుగా సేనానాయకులు ప్రసాదిత్యుడు, అంబదేవులు, గంగయసాహిణి, గోనగన్నయ, కన్నర, త్రిపురారి, జన్నిగ, మాదయ నాయకులు ఆసీనులయి వున్నారు. వారికి ఒక ప్రక్కగా గుండయనాయకుడు కూర్చుని వున్నాడు.

రుద్రమదేవి గొంతు సవరించుకుంది. గుండయనాయకుడిని చూసింది. మధుర గంభీర స్వరంతో, “గుండయ నాయకా! ఓరుగల్లుకి ప్రమాదం వాటిల్లింది. ఓరుగల్లు కోటపై దేవగిరి యాదవుల దాడి ప్రారంభమయింది. యాదవ మహదేవరాజు దురాక్రమణ ప్రయత్నాలు ప్రారంభించాడు. అందులో భాగంగా మొదట సైన్యాన్ని రత్నగిరి తరలించాడు. రత్నగిరిలోని రహస్య ప్రదేశాల్లో సైన్యం మొహరించివుంది. ప్రస్తుతం రత్నగిరి యాదవరాజు ఆధీనంలో వుంది.” అంది.

‘సైన్యం రత్నగిరిని ఆక్రమించుకుంద’న్న మాట వినగానే ఉలిక్కిపడ్డాడు గుండయనాయకుడు. ఎందుకంటే ఆయన ఇల్లూ, కుటుంబం రత్నగిరిలో వున్నాయి.

సన్నగా వణుకుతున్న స్వరంతో, “ఎప్పుడు జరిగింది మహారాణీ ఈ ఆక్రమణ?” అని అన్నాడు.

“రాత్రి” అని, “గుండయనాయకా! మీరు రాయస్థాపనాచార్య బిరుదాంకితులు. ఈ ఆపద సమయంలో ఆత్మస్థైర్యం వహించాలి.” అంది రుద్రమదేవి. మళ్ళీ తనే. . “గుండయనాయకా! రత్నగిరి కొండపై మొత్తం నాలుగైదు వందల కుటుంబాలు మాత్రమే వున్నాయి. మహదేవరాజు సైన్యాన్ని తిప్పికొట్టడం లేదా నాశనం చేయడం మనకో లెక్కలోది కాదు. ఎందుకంటే నాలుగడుగుల వ్యాసార్థం గల పెద్ద ఫిరంగి రత్నగిరి ముఖద్వారానికి గురిపెట్టబడి వుంది. మూడడుగుల ఫిరంగులు పది రత్నగిరిలోని అన్ని ప్రముఖ ప్రాంతాలకీ గురిపెట్టి వున్నాయి.”

“ఇంకా అసంఖ్యాకమైన పదాతిదళాలు క్షణంలో రత్నగిరి లోని సైన్యాన్ని తుడిచిపెట్టగలవు. అయితే, రత్నగిరిలో నివసించే నాలుగైదువందల కుటుంబాలూ ప్రమాదానికి గురవుతాయి. అదీ నిజానికి మనకి సమస్య కాదు. ఎందుకంటే లక్షల కుటుంబాల్ని కాపాడుకోడం కోసం ఓ అయిదొందల కుటుంబాలు వదలుకోవడం తప్పనిసరైతే వాటిని నిర్థాక్షిణ్యంగా వదులుకోవడం రాజనీతి!”

“ఎటొచ్చీ, అసలు సమస్య మీ కుటుంబం గూర్చి! మీ కుటుంబం రత్నగిరిలో చిక్కుకునిపోయింది. తప్పించడానికి వీలులేదు. సైన్యం మీ యింటిమీద నిఘా వేసివుంది. తప్పించడానికి ప్రయత్నిస్తే వాళ్ళు రత్నగిరిని ఆక్రమించిన విషయం మనకి తెలిసిపోయిందని భయపడి వెంటనే ఓరుగల్లు కోటపై దాడికి దిగుతారు.” చెప్పి, శ్వాస తీసుకోవడం కోసమని ఆగింది రుద్రమదేవి.

“అయ్యా! గుండయనాయకా! మా దాయాదులు హరిహర, మురారిదేవులు నాపై తిరుగుబాటు చేసినప్పుడు మీరు నా తండ్రివలె అనుక్షణం నా వెంటవుండి కాపాడినారు. దేశంలోని అంతః కలహాల్ని సమర్థవంతంగా అణిచి వేశారు. అటువంటి ప్రశస్తమయిన సేవాతత్పరత గల్గిన నాయకులు మీరు. మీ కుటుంబం శత్రుబారిన పడటం, అదీ కేవలం మన ఫిరంగుల కారణంగానే చనిపోవలసిరావడం ఎంతో దురదృష్టకరం. దేశ ప్రజలకీ, అంతకన్నా ముఖ్యంగా నాకు చాలా బాధాకరం!” రుద్రమదేవి నేత్రాల్లో కన్నీరు చిప్పిల్లాయి. కంఠం పూడుకుపోయింది.

“ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే. . . మీరు తక్షణం ఇక్కడ్నుంచి ఒంటరిగానే రత్నగిరికి వెళ్ళండి. కడసారి చూపులుగా ఈ పగలంతా మీ కుటుంబ సభ్యుల మధ్య గడపండి. రాత్రిలోపు మీరు కుటుంబాన్ని వీడి రాలేకపోయారంటే రేపు సరిగ్గా వేకువ చుక్కపొడిచే సమయానికి మీరు ఫిరంగులకి ఆహుతైపోక తప్పదు!” రుద్రమదేవి దుఃఖోద్వేగంతో పెదవి విప్పి మాట్లాడలేక పోయింది. కొంతసేపటికి ఎలాగో ఆ దుఃఖం నుండి తేరుకుని, “వెళ్ళండి! సేనానాయకా! తక్షణం వెళ్ళండి. వెళ్ళి మీ కుటుంబాన్ని కలవండి. మీరు రావాలనే ఆశిస్తాను.” అంది.

గుండయనాయకుడికి విషయం అర్థమైపోయింది. ఇక తను చేయాల్సిందేగానీ చెప్పాల్సిందేమీలేదు. అసనంలోంచి లేచాడు. అక్కడున్న వారందరికి చేతులు జోడించి నమస్కరించాడు. రుద్రమదేవి వైపు చూశాడు.

“అమ్మా రుద్రాంబా! దురదృష్టవంతుడిని. దేశ రక్షణలో పాలుపంచకోవలసిన విపత్కర సమయాన కుటుంబంకోసం వెళ్ళవలసి వచ్చింది. వెళతాను. రాగలిగితే రాత్రిలోపు తిరిగి వస్తాను. లేదంటే ఆగిపోతాను. కానీ మీరు మాత్రం మా గురించి ఆలోచిస్తూ వేకువ వేళకి విధ్వంసం చేయడం ఆపవద్దు. ఆపినారా రేపు సాయంత్రానికి యాదవ మహదేవరాజు దాడి ప్రారంభిస్తాడు. ఓరుగల్లు కోట వాళ్ళ వశమవుతుంది. ఆ దుర్మార్గుడి పాలనలో ప్రజలు పురిటి మంచం పన్నులతో సహా కట్టలేక కష్టాలపాలు కావలసివస్తుంది.” చెప్పి, రుద్రమదేవికి నమస్కరించి గుండయనాయకుడు కదిలాడు.

దేశ సంరక్షణ కోసం కుటుంబాన్ని త్యాగం చేసి, కదిలి వెళ్తున్న ఆ సేనా నాయకుడుని చూసి మిగిలిన నాయకులంతా కన్నీరు పెట్టారు. వీడ్కోలు చెప్పారు.

“గుండయనాయకా!” వెళ్తున్న గుండయనాయకుడిని రుద్రమదేవి పిలిచింది. వెళ్తున్నవాడు ఆగి, చటుక్కున వెనక్కి తిరిగాడు. ఏమిటన్నట్టు చూశాడు.

“ఎటువంటి పరిస్థితుల్లోనూ, కుటుంబాన్ని రత్నగిరి దాటించడానికి ప్రయత్నించకండి. ఆ పని చేసినారంటే మేమంతా వుండం. ఇకపై కాకతీయుల పాలన వుండదు!” అంటూ రెండు చేతులూ ఎత్తి నమస్కరించింది రుద్రమదేవి.

గుండయనాయకుడు నవ్వాడు. ఆ పని ఎన్నటికీ జరగదన్నట్టు తల అడ్డంగా వూపాడు. తరువాత అన్నాడు.

“ప్రజలంటే నీకే కాదమ్మా. నాకూ బిడ్డల్లాంటివారే!”

* * * *

“టక్! టక్!” మని తన ఇంటి తలుపు తట్టాడు గుండయనాయకుడు. క్షణకాలం గడిచిన తర్వాత తలుపులు తెరుచుకున్నాయి. ఎదురుగా అతడి తల్లి పుండరీయమ్మ నిలుచుని వుంది.

“వచ్చావా నాయనా?” అని లోపలికి తొంగిచూస్తూ, “గుండయ వచ్చాడమ్మా వెంగమాంబా! ఎర్రనీళ్ళూ, హారతీ పట్టుకురా. దృష్టి తీద్దువుగానీ!” అందామె.

“నాకు దృష్టేమిటమ్మా. . .నీ పిచ్చిగానీ” వికల మనస్కుడైన గుండయ గడప దాటి లోనికెళ్ళబోయాడు.

ఆగు నాయనా గుండయా! ఈ రోజు నీకు అన్నీ శుభవార్తలే. దృష్టి తీయవలసినదే.” అంది పుండరీయమ్మ.

తల్లినోట ‘శుభవార్త’ అన్నమాట వినగానే గుండయనాయకుడి కళ్ళవెంట కన్నీరు వుబికింది. ఎత్తిన కాలు ఎత్తినట్టే ఆపి, వాకిట్లోనే నిలబడిపోయాడు. “ఇక శుభవార్త లెక్కడివమ్మా మనకి. . .రేపీ సమయానికి అందరూ వినబోయేది మన చావువార్తలే!” స్వగతంలో అనుకున్నాడు.

నిముషం తర్వాత వెంగమాంబ వచ్చింది. పళ్ళెంలో ఎర్రనీళ్ళూ, ఉప్పూ, హారతీ పట్టుకు వచ్చింది. తలస్నానం చేసి, పట్టు వస్త్రాలు ధరించి వుంది. భర్తను చూసి కొత్త పెళ్ళికూతురిలూ సిగ్గుపడింది. ఆ తరువాత "మీ రాక కోసమే ఎదురు చూస్తున్నాం!" అంటూ దృష్టి తీసింది. ఎర్రనీళ్ళు బయట పారబోసి, ఉప్పు తీసుకెళ్ళి, ఇంట్లో నిప్పుల్లో వేసి వచ్చింది. మళ్ళీ భర్తని సమీపిస్తూ, “ఆ కళ్ళలో నీళ్ళేమిటండీ?” అంది అనుమానంగా.

“ఏదో నలుసుపడిందిలే!” అన్నాడు గుండయనాయకుడు ముఖం పక్కకి తిప్పుకుంటూ. నడుముకి వ్రేలాడుతున్న కరవాలం తీసి భార్యకి అందించాడు.

“పిల్లలేరి?” అడిగాడు ఇల్లంతా కలియజూస్తూ.

“ఇంట్లో తులసి మొక్క ఎండితే ఇంకోటి తీసుకురాను పక్కింటికెళ్ళారు. వస్తారులే!” అంది వెంగమాంబ.

“ఇద్దరూ వెళ్ళారా?” అడిగాడు గుండయనాయకుడు “యాదవుల సైన్యం రత్నగిరిని చుట్టుముడితే తులసి మొక్క ఎండక ఏంచేస్తుంద”నుకుంటూ.

( సశేషం )

0 అభిప్రాయాలు: