ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి,  అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. ."ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల"నీ, "ఒక పూర్తి మానవుడిగా పరిణమించాల"నీ, నేను కంటున్న కల,  కడుతున్న కోట. . .ఒహ్ ఇంతెందుకు కనుచూపు మేరలో. . . నా జీవితం ఒక వేద సంకలనం!!  నేనొక ఈశ్వరుడిని!!! ( ఇది ఈ బ్లాగులోని ప్రసంగి కథలో ఒక పాత్ర మనోభావాలు __ రచయిత )

Monday, August 27, 2007

ఒక అసాంఘికుడు -- రెండు అకృత్యాలూ!!

“అసాంఘికులు -- అకృత్యాలు” పేరుతో భాగ్యనగర అభాగ్యపు బాంబు విస్ఫోటనాల గురించి ఒక వ్యాసం రాద్దామనుకున్నా. కొన్ని కారణాల వల్ల బాగా లేటయింది. ఇప్పుడు రాసినా పెద్దగా ప్రయోజనం వుండదు. ఎందుకంటే పత్రికల్లోనూ, టీవీ ల్లోనూ నే చెప్పేదాని కంటే యింకా విపులంగా అంతా వచ్చేసింది.

“ధ్వజం!” కథ రాసిన తర్వాత, “ధ్వజం కథ - దానికథ” అనే టైటిల్ తో కథా వైశిష్ట్యాన్ని గురించి వివరిస్తూ, ఈ కథ మీదీ నాదీ కాదనీ, విశ్వజనీన మానవుడి జీవన వైశాల్యం, అందులో ప్రమాదాల పారంపర్యతకున్నట్టి అపార అవకాశం గురించి చెప్తూ, కాలానుగుణంగా వచ్చే మార్పులననుసరించి మానసికంగా ప్రతి వ్యక్తీ అనుక్షణం జాగరూకుడై మసలుకోవాలని ఆరోజు ఉద్ఘాటించాను. ఆ మాట అవసరం, విలువ ఆనాడు ఎంతమందికి అర్థమయిందో లేదో నాకు తెలీదు. కానీ, నిన్న రెండు వరస పేలుళ్ళు చూసాక ఎందుకో ధ్వజం కథలోని కొన్ని భాగాల్ని తిరిగి రిప్రజంట్ చేయాలనిపంచి చేస్తున్నాను.

( ఇది భూకంపాన్ని వర్ణించిన సందర్భం.... నిన్నటి లుంబినీ పార్కూ, గోకల్ ఛాటూ వర్ణన యింతటిది కాదా?)

ఏ దేశ మయితేనేం. . . మానవుడుంటున్న దేశం!
ఏ స్థల మయితేనేం. . . ఇళ్ళూ, భవంతులూ నిర్మించుకున్న స్థలం!!
ఏ మత మయితేనేం. . . అది వైయక్తిక మనస్తత్వ సమ్మతం!!!

అక్కడ. . . ఆ ప్రదేశంలో. . . అప్పుడు. . . ఓ సాయం సంధ్య వేళ. . .

ఆహ్లాదభరితమై సాగిపోతున్న పిట్ట కూనల, పక్షి ప్రౌఢల, కేరింతల త్రుళ్ళింతల క్రిల క్రిల క్రిలా ధ్వానం ఎందుకో లిప్తపాటు ఆగింది. నవనవోన్మేషాల వసంతాల గానం ఏమైందో క్షణం సేపు దాగింది. మహోన్మత్త ముక్త కోకిలా రావం ఏకంగా మాయమే అయింది. ముంచుకొస్తున్న ప్రాకృతిక ప్రళయాన్ని ముందుగానే పసిగట్టిందో యేమో ఓ పక్షి ప్రాణి ‘కీచు’ మని అరిచింది.

అంతే!!

క్షణంలోపు క్షణంపాటు అక్కడ భూమి కదిలింది. . . భూమి కుదిలింది. . భూమి పగిలింది. ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. జరగాల్సింది జరగనే జరిగింది. ఒక కంపనం పెను ప్రకంపనంగా మారి భూకంపమయింది. ప్రళయ కార్యానికి అది కారణభూతమయింది. ఆ మహా ప్రళయాన ఒక సంపూర్ణ రాష్ట్రమే లయమై విలయమయింది. . .విధ్వంసమయింది.

క్షణం నిడివిలో సస్యశ్యామలమంతా శవాల మయమయింది.

ధఢ. . . ధఢ. . . ధఢ. . . ధఢేల్ మను ధ్వనులతో అకాశ హర్మ్యాలే అక్కడ నేల కొరిగాయి. ఘన సుందర సౌధాలే శిధిలాలయాయి. శిధిలాల శకలాలయినాయి. మనుష్యులు మట్టి పాలయ్యారు. శకలాల క్రింది వికలాంగులయారు.

మానవ ప్రాణులు, జంతు ప్రాణులు, పక్షి ప్రాణులు. . . ఒకరేమిటి. . . ఒకటనేమిటి. . . ప్రకృతికి ప్రాణాల హెచ్చు తగ్గుల వివక్ష లేదు. అన్నీ శిధిలాల క్రిందే లెక్క. . . సగం యిరుక్కుని. . . సగం పెరుక్కుని. . . ఖండాలుగా, ఖండ ఖండాలుగా. . . మొండాలుగా. . . “దేవుడా రక్షించ రారమ్మం” టూ, ధీనంగా వేడికొంటూ.

తప్పించుకున్నవాడూ తప్పుకున్నవాడూ ధన్యతములు. చచ్చిన వాడూ ధన్యుడే. . . తప్పుకోనూలేక, చావనూ రాక యిరుక్కుపోయిన వాడే దౌర్భాగ్యుడు.

శిశువులూ, పశువులూ, గర్భిణీ స్త్రీలూ. . . సర్వులూ క్షతగాత్రులే! రాళ్ళ క్రింది క్షతగాత్రులు. అరుపులూ, ఆర్తనాదాలూ, మిన్నంటిన హాహాకారాలూ, మితిమీరిన రోదనలూ. . . ఎన్నని?. . . ఎవ్నరివని?. . . అది జీవన్మరణాల ఘోష! విషాద ప్రాణుల శరణాల భాష!!!

విజ్ఞాన శాస్త్రాలూ. . . రిక్టర్ స్కేళ్ళూ. . . ఎలాస్టిక్ రీ బౌండ్ థియరీలూ. . . ఆకర్షణ వికర్షణ భూ విద్యుచ్ఛాలక బలాల సిద్ధాంత రాద్ధాంతాలూ. . . సర్వం. . . సర్వమూ నిరర్ధకం అయినాయి. ప్రమాద తీవ్రతను ముందుగా పసిగట్టలేకనే పోయాయి. లక్షల శవాల రాసులే. . . రాసుల గణణమే. . . ఆ పైన విపత్తు తీవ్రతకి తార్కాణమయింది.
ఒక మహోపద్రవం. . . ఒక మహా ఉత్పాతం. . . అక్కడ సంభవించిది.

సుసంపన్నమైన, బహు విధమైన ఆ దేశ వారసత్వ సంపద. . . అక్కడ. . . ఆ ప్రాతం వారికి గర్వకారణం కాలేదు. . . బుగ్గి పాలయింది. . . బూడిద పాలయింది. . . భూకంపం పాలయింది.
* * * *

( మరొక సందర్భం )

“చెప్పు శారదా!” నిర్లిప్తంగా అన్నాడు.

“మీరు. . . మీరు జాగ్రత్త. . . మీ ఆరోగ్యం జాగ్రత్త!” కన్ను మూసింది.

“ఎలా జాగ్రత్త పడనే శారదా నువ్వు లేకుండా” మళ్ళీ గోడు గోడుమని ఏడ్చాడు.

అప్పటికే పొద్దు కృంగింది. ఒక పెంజీకటి ఆ ప్రదేశాన్నీ ఆర్తిగా ఆక్రమించుకో సాగింది.

భార్య శవాన్ని వదిలేసి, కృష్ణమూర్తి లేచాడు. చేతుల్తో తన తల పట్టుకున్నాడు. ఉన్నట్టుండి వంగి, స్వరపేటిక పగిలిపోయేలా బిగ్గరగా ఎలుగెత్తి అరవసాగాడు.

వ్వో. . . వ్వో. . . వ్వో. . . వ్వో. . .

శోకతప్త హృతయంతో విషాదోన్మత్తుడై విలపిస్తున్న అతడి అరుపులు విని, ఆ చీకట్లో ఎవరో వచ్చారు. నాలుగు ఆకారాలు. నలుగురు మనుషులు. ఓదార్చారు. ‘వగపు వలదన్నారు. వెతలు తప్పవన్నారు. మనం మనుషులం. . . మ్రానులమా?’ అన్నారు. ఆపైన ఎవరి దారిన వాళ్ళు వెళ్ళారు.

కృష్ణమూర్తి ఆ రాత్రంతా ఆప్తుల శవాల దగ్గరే కాపు వేశాడు. ఓ బండకి వీపు ఆన్చి జారగిలబడి కూర్చుండి పోయాడు. దూరంగా ఏడ్పులూ, శబ్దాలూ విన్పిస్తూనే వున్నయి. నడి రాత్రయింది. చంద్ర కాంతి శవాల మీద పడి వాటి ఉనికిని తెలియజేస్తోంది. కృష్ణమూర్తి హృదయం శూన్యంగా వుంది. కాలం గతానుగతికం. నిర్విరామం! క్రితంలో బాధ యిప్పుడు లేదు. అంతా పోగొట్టుకున్న వాడిలోని నిశ్చలత్వం. శవాలవైపు చూశాడు. . . నిర్నిమిత్తంగా. . . నిర్నిమేషంగా.

ఎవరు బాంధవులు? ఎవడు ఎవడికి బాంధవుడు. . .?

అసలు నీవెవడవు?

ఒక విడి మానవుడు. . . వేరొక విడి మానవుడికి బంధువా?

అయితే. . . ఆ బాంధవ్యపు గొలుసెక్కడ? ఆ గొలుసే సత్యమైతే. . .నిత్యమైతే. . . ఒకడు పోయినప్పుడు మరొకడు మిగిలివుండడం ఎలా సంభవం? అదే విధం??

కృష్ణమూర్తికి భగవద్గీతలోని ఒక శ్లోక భావం గుర్తుకొచ్చింది.

అవ్యక్తమునందు ఆసక్తమైన మనసుగల వారికి దుఃఖము అధికతరమై వుండును. ఎందుకనగా అవ్యక్తము దేహము కలిగిన వారిచే దుఃఖమునకు గతియై పొందబడుచున్నది!!!
* * *

(ఇంకొకటి ఇది బ్రతికి ఆప్తుల్ని పోగొట్టుకున్న వారికి కథలో సమస్యకి పరిష్కార మార్గంగా సూచించినది)

“చూడు నాయనా కృష్ణమూర్తీ జీవితంలో నీకొక కీడు జరిగింది. గుండె బెదురుపాటు చెందింది. దిక్కుతోచని స్థితిలో నా చెంత చేరావు. సలహా కోరావు. మనసు నొప్పితో దగ్గర చేరిన వాడిని నా కధ చెప్పి, మరింత కలవర పెట్టి పంపడం నాకు తెలిసిన నీతి కాదు. కానీ, కార్య కారణ సంబంధాల లాగే సమస్య, పరిష్కారం ఒకదాని కొకటి ముడిబడి వున్నాయి. సమస్యకి పరిష్కారం చెప్పడంలో నాకు నమ్మకం లేదు. ఒక పరిష్కారం నీకు నేను చెప్పానా. . . మరో సమస్యలోకి నిన్ను పనిగట్టుకుని నేను దింపుతున్నట్టే!!” అన్నాడాయన.

“అంటే?”

“అంటే. . . నువ్వు మళ్ళీ పెళ్ళి చెసుకుని, పిల్లాపాపలతో చక్కటి జీవితం గడపమని సలహా చెప్పవచ్చు. లేదన్నావా. . . ఒంటరిగానే జీవిస్తూ నీలాగే బ్రతుకులో ప్రమాదపడ్డ వారికి సహాయపడుతూ గడపమని చెప్పవచ్చు. కాదంటే ఆధ్యాత్మకంలోకి వెళ్ళమనవచ్చు. అదీ కాదనుకుంటే నీ యిష్టమొచ్చినట్టు జీవించమనవచ్చు. ఇవన్నీ నీ సమస్యకి పరిష్కారాలు. ఇందులో ఏ ఒక్కటి నీకు నేను సూచించినా. . . అది మళ్ళీ నీకు సమస్యని బహుకరిస్తున్నట్టే.”

“అర్ధం కావడం లేదు తాతగారూ!” అన్నాడు కృష్ణమూర్తి. అతడి గొంతు గాద్గధికమైంది. “ఒక మంచి కుటుంబం నాది. అర్ధంచేసుకునే భార్య, చక్కటి పిల్లలు. సాయంత్రం యింటికి రాగానే నాపైకెక్కి ఆడుకునే వాళ్ళు. ఎప్పుడూ గలగలా మాట్లాడే తల్లి. . . అందరూ భూకంపం పాలయ్యారు. ఒంటరిగా నన్ను శోకంలో వదిలారు. గతం వెంటాడుతోంది తాతగారూ. పడుకుంటే నిద్రరాదు. మేలుకునుంటే అవే జ్ఞాపకాలు. శరీరం మీద సృహ వుండదు. ఎందుకీ జీవితం. . .నా వాళ్ళు లేకుండా. ఆత్మహత్య చేసుకుని చస్తే ఏ బాధా వుండదనిపిస్తుంది. ఒకటే పిరికితనం. నాకు ధైర్యం చెప్పండి తాతగారూ!” కృష్ణమూర్తి వల వలా ఏడ్చాడు.

“బాధ పడకు కృష్ణమూర్తీ” అన్నాడు మాధవరావు. . .అతడి భుజం మీద చెయ్యేసి అనునయిస్తూ.

మహారధి కృష్ణమూర్తి వైపు నిశ్చలంగా చూశాడు. మళ్ళీ చెప్పసాగాడు.

“గతం వెన్నాడుతోందన్నావు. ఆత్మహత్య అహ్వానిస్తోందన్నావు. చూడు నాయనా. . .ఆత్మహత్యంటే హింస! హింస తప్పనేది అందరికీ తెలిసిన విషయం! ఉద్దేశపూర్వకంగా చావగలం గానీ, పుట్టలేం. చావడానికి ఉరితాడు చాలు. బ్రతకడానికి చాలా కావాలి. ఇక్కడ అసలు సమస్య గతం! భార్యా పిల్లలూ. . . తల్లీ. . . దుఃఖం. . .పిరికితనం. . . అన్నీ గతమే. దాన్ని మనం నిలువరించాలి. నిలువరించడమంటే దానర్ధం. . .ఏ టీవీనో, సినిమానో, మరే కంప్యూటరో చూస్తూనో, లేదంటే మరేదైనా యిష్టమైన పని కల్పించుకుని అందులో నిమగ్నమైపోయో గతం నుండి తప్పించుకోవడం కాదు. గతమంటే ఏమిటో అర్ధం చేసుకోవడం. దాన్నీ ‘ఢీ’ కొనడం. గతమంటే చీకటి. చీకటిని చీకటితో రాసినా. . . చీకటిని చీకటితో కొట్టినా. . . చీకటిని చీకటితోనే వెలిగించినా. . . ఏది చేసినా వెలుగు పుట్టదు. ఎందుకంటే చీకటి లేక పోవడమే వెలుగు. గతాన్ని మననం చేస్తున్నంత కాలం. . .‘ప్రాక్టీస్’ చేస్తుంన్నంత కాలం అది దుఃఖంలో మనల్ని ముంచెత్తుతుంది. గతాన్ని విడనాడడమే. . . తేలిగ్గా విడనాడడమే వెలుగువైపుకి పయనించే జీవితం. కొత్తది. . . చురుకైన జీవితం!” మహారధి అగాడు. క్షణం తర్వాత మళ్లీ చెప్పసాగాడు.

“చూడు బాబూ కృష్ణమూర్తీ! ఏదో బ్రతుకులో కష్టాలపాలై కఠినంగా మాట్లాడుతున్నానని అనుకోవద్దు. నేను నీకు ధైర్యం చెపితే . . . అదెంత సేపుంటుంది. ఆలోచించు! నేను పక్కకి పోగానే దాని దారి అది చూసుకుంటుంది. అలాగే పరిష్కారం కూడా. పరిష్కారం చెప్పానా, ఆ పరిష్కారం నాదవుతుంది నీదికాదు. ధైర్యమైనా, పరిష్కారమైనా అది నీలో నుండి రావాలి. అరువుతెచ్చుకున్నది కాదు. ఒప్పుకుంటావా” అన్నాడు మహారధి.

“ఒప్పుకుంటాన”న్నట్టు తలాడించేడు కృష్ణమూర్తి.

“అంతస్సులోకి వెళ్ళాలి! అన్వేషణ జరగాలి!! అంతర్మధనం జరగాలి!!! అది జరిగిననాడు నువ్వు నీ సమస్యకి సమాధానం కోసం. . .నీలో వున్న సమాధానం కోసం. . .బయటివాళ్ళని. . . వేరొకర్ని బిచ్చమెత్తాల్సిన అవసరం లేదు. సమాధానం నీలోనే లభ్యమౌతుంది! వెలుగు వుద్భవిస్తుంది!! మనిషి ఒంటరిగా నిలిచి, సర్వ స్వతంత్రుడై జీవించడమంత మహత్తరమైన విషయం మరొకటి లేదు ఈ లోకంలో!! చివరగా ఒక మాట. . . నీ పూర్తి జీవితం నీ చేతిలో వుంది. సర్వం నీలోనే వుంది. ఎంత చిలికేవో అంత వెన్న లభిస్తుంది. నైరాశ్యంలో కొట్టుమిట్టాడాల్సిన అవసరం. . .ఈ లోకంలో ఏ మనిషికీ లేదు. . . ఏ మనిషికి కూడా. . . మనసుని చిలకడం మరిచిన వాడికి తప్ప!” చెప్పడం అయిపోయిందన్నట్టుగా మహారధి లేచాడు.


(ఇవన్నీ. . .”చూశారా నాగొప్ప?” అన్న భేషజంకోసం నేను తిరిగి పబ్లిష్ చేయడం లేదు. ఎందుకో ఈ విపత్కర స్థితిలో ఈ కథా భాగాలు నా బ్లాగు ద్వారా ప్రపంచానికి పంపాలని పించింది. పంపుతున్నా.)

0 అభిప్రాయాలు: