ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి,  అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. ."ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల"నీ, "ఒక పూర్తి మానవుడిగా పరిణమించాల"నీ, నేను కంటున్న కల,  కడుతున్న కోట. . .ఒహ్ ఇంతెందుకు కనుచూపు మేరలో. . . నా జీవితం ఒక వేద సంకలనం!!  నేనొక ఈశ్వరుడిని!!! ( ఇది ఈ బ్లాగులోని ప్రసంగి కథలో ఒక పాత్ర మనోభావాలు __ రచయిత )

Showing posts with label ధ్వజం కథ. Show all posts
Showing posts with label ధ్వజం కథ. Show all posts

Wednesday, August 8, 2007

ధ్వజం! (కథ) -- దాని కథ!

"ధ్వజం!” కథ పూర్తయింది! కథ రాస్తున్నప్పుడు ఒకరిద్దరు స్నేహితులన్నారు ఎందుకలా కష్టాలూ, చావులూ. . .సరదాగా రాయొచ్చుగా అని. నిజమే రాయొచ్చు! సరదాగా వుండడమంటే ఎవరికి యిష్టం వుండదు? లక్ష రూపాయల విలువచేసే బైక్ మీద వెనక ఇద్దర్ని కూర్చోబెట్టుకుని నెక్లస్ రోడ్లు మీద వంద కిలోమీటర్ల స్పీడుతో వెళ్ళే కుర్రాడి సరదా, ఉల్లాసం ఎంత సేపు? రెప్పపాటు! ఆ సరదా సరైందనగలమా. మన సరదాలు కూడా యించుమించు ఈ మాత్రంలోనే వుంటాయనుకుంటా. ఎందుకంటే, బాగా జరుగుతున్నంత కాలం పొంగిపోతాం. పొరపాటున అనుకోనిది జరిగిందా కృంగిపోతాం! కానీ, ధ్వజం కథ ఏం చెపుతుంది. పదమూడు చావులూ.. ఒక భూకంప విపత్తు. . . అంతా ఏడుపుగొట్టు కథ. తెలుగు టీవీ సీరియల్ లాగా, అవార్డు సినిమాలాగా. . అంతేనా యింకేమయినా వుందా?

ఖచ్చితంగా కాదు! ఈ కథ ఒక ప్రయోజనాన్ని ఆశించి రాసింది. మీదో నాదో కాదు. విశ్వజనీన మానవుడి జీవన వైశాల్యం, అందులో ప్రమాదాల పారంపర్యతకున్నట్టి అపారమైన అవకాశం, ‘గతం’. . .భయానకమైన దాని విస్తృతి. . .మనిషి దాని పట్ల జాగరూకుడై వున్నప్పుడు కుంచించుకు పోయే దాని పరిధులు. ఈ మధ్య ఒకసారి యండమూరి వారన్నారు ఓ టీవీ ఛానల్లో. . . నాకిప్పుడు కోపం రావడం లేదు. కానీ, కోపం ప్రదర్శిస్తానని. దానర్ధం ఈ రోజుల్లో ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలీదుగానీ, అంతర్ముఖుడై కోప స్వభావాన్ని తెలుసుకున్న వ్యక్తి. ఆ చెడుగు తనకి అంటకుండా దూరంగా వుంటాడనేది సారాంశం. అదే ‘ధ్వజం!’ చెప్పేది కూడా. మనిషి జీవితంలో బ్యాలెన్స్. . . మానసిక సంయమనం గురించి!

ఈ కథ ఎవరికి సంతోషాన్నిచ్చినా, యివ్వకపోయినా ఫర్లేదుగానీ చదివితే చాలు నాకదే పదివేలు! ఏ కారణంగానైనా బతుకులో భంగపడి నైరాశ్యంలో కొట్టుకుపోతున్న ఏ ఒక్క వ్యక్తి కయినా తన లోపలికి ఒకసారి చూసుకోవాలన్న స్పర్శ ఈ కథ కలిగించ గలిగితే నేను నేననుకున్నది సాధించినట్టే! మానవత్వం నా కథలకి ప్రాతిపదిక. దీనర్ధం. . . నేను సరదా కథలూ, హాస్యకథలూ రాయనని కాదు. అవీ రాస్తాను.

ఇక ఇందులో వాడిన భాష విషయం. కొంతమంది “ఎక్కువైంద”న్నారు. ఒకాయనైతే ఏకంగా “కొన్ని పదాలకి అసలు అర్దమేలేద”న్నారు. అలాంటి విమర్శ విసిరే ముందు ఒకసారి తెలుగు నిఘంటువు చూసి విసిరితే బావుంటుందని వారికి నా సూచన. ఏదేమైనా, సందర్భానికి తగినట్టే భాష ప్రయోగించానని నా ఉద్దేశ్యం. ఎందుకంటే 1996 లోనే విపుల వారి బహుమతి పొందిన నా తొలి కథ మహాపరాధి, యింకా బహుమతులందుకున్న స్వాతి కథలు యింతకంటే రెండితలు ఎక్కువ భాషతో భాసించినవే.

మొదటగా నాకు బ్లాగుల గురించి చెప్పిన స్నేహితుడు మదన్ గారికి, యిక కథ రాసేప్పుడు తమ కామెంట్లతో నన్ను ప్రోత్సహించిన ఎందరో మహానుబావుల్నీ, ఛాటింగ్ లోకొచ్చి సలహా యిచ్చిన వీవెన్ గారూ, కొన్ని సూచనలిచ్చిన సి.బి.రావు గారూ, ప్రదీప్ గారూ, కంప్యూటర్ ఎరా శ్రీధర్ గారూ. . .అన్నింటికీ మించి నేనెవరో తెలీకుండానే. . .నేనడక్కుండానే బ్లాగ్ డిజైన్ చేసి పెట్టి, నాచేత విసిగించబడ్డ మానవ చక్రం మరియూ మహిళా సవ్యసాచి వలబోజు జ్యోతమ్మలు గారూ. . . అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటూ. . . “రేపట్నుండి “ప్రసంగి” అనే కొత్త కధతో మీ ముందుకు రాబోతున్నాన”ని తెలియజేసుకుంటూ. . .వినమ్రతతో. . .

మీ . . . వింజమూరి విజయకుమార్

Tuesday, August 7, 2007

ధ్వజం!...8

“అర్ధం కావడం లేదు తాతగారూ!” అన్నాడు కృష్ణమూర్తి. అతడి గొంతు గాద్గధికమైంది. “ఒక మంచి కుటుంబం నాది. అర్ధంచేసుకునే భార్య, చక్కటి పిల్లలు. సాయంత్రం యింటికి రాగానే నాపైకెక్కి ఆడుకునే వాళ్ళు. ఎప్పుడూ గలగలా మాట్లాడే తల్లి. . . అందరూ భూకంపం పాలయ్యారు. ఒంటరిగా నన్ను శోకంలో వదిలారు. గతం వెంటాడుతోంది తాతగారూ. పడుకుంటే నిద్రరాదు. మేలుకునుంటే అవే జ్ఞాపకాలు. శరీరం మీద సృహ వుండదు. ఎందుకీ జీవితం. . .నా వాళ్ళు లేకుండా. ఆత్మహత్య చేసుకుని చస్తే ఏ బాధా వుండదనిపిస్తుంది. ఒకటే పిరికితనం. నాకు ధైర్యం చెప్పండి తాతగారూ!” కృష్ణమూర్తి వల వలా ఏడ్చాడు.

“బాధ పడకు కృష్ణమూర్తీ” అన్నాడు మాధవరావు. . .అతడి భుజం మీద చెయ్యేసి అనునయిస్తూ.

మహారధి కృష్ణమూర్తి వైపు నిశ్చలంగా చూశాడు. మళ్ళీ చెప్పసాగాడు.

“గతం వెన్నాడుతోందన్నావు. ఆత్మహత్య అహ్వానిస్తోందన్నావు. చూడు నాయనా. . .ఆత్మహత్యంటే హింస! హింస తప్పనేది అందరికీ తెలిసిన విషయం! ఉద్దేశపూర్వకంగా చావగలం గానీ, పుట్టలేం. చావడానికి ఉరితాడు చాలు. బ్రతకడానికి చాలా కావాలి. ఇక్కడ అసలు సమస్య గతం! భార్యా పిల్లలూ. . . తల్లీ. . . దుఃఖం. . .పిరికితనం. . . అన్నీ గతమే. దాన్ని మనం నిలువరించాలి. నిలువరించడమంటే దానర్ధం. . .ఏ టీవీనో, సినిమానో, మరే కంప్యూటరో చూస్తూనో, లేదంటే మరేదైనా యిష్టమైన పని కల్పించుకుని అందులో నిమగ్నమైపోయో గతం నుండి తప్పించుకోవడం కాదు. గతమంటే ఏమిటో అర్ధం చేసుకోవడం. దాన్నీ ‘ఢీ’ కొనడం. గతమంటే చీకటి. చీకటిని చీకటితో రాసినా. . . చీకటిని చీకటితో కొట్టినా. . . చీకటిని చీకటితోనే వెలిగించినా. . . ఏది చేసినా వెలుగు పుట్టదు. ఎందుకంటే చీకటి లేక పోవడమే వెలుగు. గతాన్ని మననం చేస్తున్నంత కాలం. . .‘ప్రాక్టీస్’ చేస్తుంన్నంత కాలం అది దుఃఖంలో మనల్ని ముంచెత్తుతుంది. గతాన్ని విడనాడడమే. . . తేలిగ్గా విడనాడడమే వెలుగువైపుకి పయనించే జీవితం. కొత్తది. . . చురుకైన జీవితం!” మహారధి అగాడు. క్షణం తర్వాత మళ్లీ చెప్పసాగాడు.

“చూడు బాబూ కృష్ణమూర్తీ! ఏదో బ్రతుకులో కష్టాలపాలై కఠినంగా మాట్లాడుతున్నానని అనుకోవద్దు. నేను నీకు ధైర్యం చెపితే . . . అదెంత సేపుంటుంది. ఆలోచించు! నేను పక్కకి పోగానే దాని దారి అది చూసుకుంటుంది. అలాగే పరిష్కారం కూడా. పరిష్కారం చెప్పానా, ఆ పరిష్కారం నాదవుతుంది నీదికాదు. ధైర్యమైనా, పరిష్కారమైనా అది నీలో నుండి రావాలి. అరువుతెచ్చుకున్నది కాదు. ఒప్పుకుంటావా” అన్నాడు మహారధి.

“ఒప్పుకుంటాన”న్నట్టు తలాడించేడు కృష్ణమూర్తి.

“అంతస్సులోకి వెళ్ళాలి! అన్వేషణ జరగాలి!! అంతర్మధనం జరగాలి!!! అది జరిగిననాడు నువ్వు నీ సమస్యకి సమాధానం కోసం. . .నీలో వున్న సమాధానం కోసం. . .బయటివాళ్ళని. . . వేరొకర్ని బిచ్చమెత్తాల్సిన అవసరం లేదు. సమాధానం నీలోనే లభ్యమౌతుంది! వెలుగు వుద్భవిస్తుంది!! మనిషి ఒంటరిగా నిలిచి, సర్వ స్వతంత్రుడై జీవించడమంత మహత్తరమైన విషయం మరొకటి లేదు ఈ లోకంలో!! చివరగా ఒక మాట. . . నీ పూర్తి జీవితం నీ చేతిలో వుంది. సర్వం నీలోనే వుంది. ఎంత చిలికేవో అంత వెన్న లభిస్తుంది. నైరాశ్యంలో కొట్టుమిట్టాడాల్సిన అవసరం. . .ఈ లోకంలో ఏ మనిషికీ లేదు. . . ఏ మనిషికి కూడా. . . మనసుని చిలకడం మరిచిన వాడికి తప్ప!” చెప్పడం అయిపోయిందన్నట్టుగా మహారధి లేచాడు.

-=( ధ్వజం కథ సమాప్తం )=-

Monday, August 6, 2007

ధ్వజం - 7

మహారధి జీవిత వృత్తాంతం విని, కృష్ణమూర్తి విభ్రాంతి చెందాడు!

మాధవరావుకి అది తెలిసిందే అయినా మళ్ళీ విన్నాడు. వినేప్పుడు మనసు మళ్ళీ ఆర్ధ్రమయింది. కన్నీరు వుబికింది.

కృష్ణమూర్తి ఆ వృద్దుడి వైపు ఒకసారి పరిశీలనగా చూశాడు. అస్తమిస్తున్న సూర్యకాంతి ఆయన పొడవైన ముక్కుమీద పడి ప్రతిఫలిస్తోంది. చల్లటి వాయుపవనం తాకి ఆయన వెండి జుట్టు పొడిగా రెప రెప లాడుతోంది. ముఖంలో ఏదో తెలీని శాంతి కనబడుతోంది. కధ చెప్తున్నంత సేపూ ఆయన ఎక్కడా కన్నీరు పెట్టలేదు. వెనక్కి కాలంలోకి వెళ్ళి ఒక పాత సంఘటనని చూసొచ్చి, వివరించినట్టు విలక్షణంగా సాగింది ఆయన చెప్పే విధానం! కృష్ణమూర్తికి అద్భుతమనిపించింది.

ఎదురుగా ఉన్నది మనిషి కాదు. మహత్తర మనీష జీవనసారం!!!

మొదటి చావులో మాత్ర మింగలేక చనిపోయిన పాపని భుజం మీద వేసుకు వెళ్ళి, మట్టిలో పూడ్చి పెడ్తున్నప్పుడూ. . . రెండవ చావులో ముక్కలు ముక్కలైన కొడుకు లేలేత శరీర భాగాల్ని దహనం కోసం ఏరుకుంటున్నప్పుడూ. . . మూడవ చావులో ముగ్ధమోహన రూపుడిని పోస్ట్ మార్టం టేబిల్ మీద ముక్కలుగా కోయిస్తున్నప్పుడూ. . . నాలుగో చావులో చెట్టంత కొడుకుని బావిలో నుండి బయటికి తీయిస్తున్నప్పుడూ. . . ఐదవ చావులో కాలి కమురు కంపు కొడ్తున్న కూతుర్ని చూడలేక జనం ముక్కలు మూసుకుంటున్నప్పుడూ. . . ఆరవ చావులో తన కూతురు తన పైన ఎంతటి ప్రేమానుబంధాల్ని పెంచుకున్నదో తేటతెల్లమైనప్పుడూ. . . ఏడవ చావులో కన్నబిడ్డని కర్కోటకులు చెరుస్తున్నప్పుడూ. . . ఎనిమిదవ చావులో మహాత్ముడంతటి తనయుడు మహారుద్రుడై మరణించినప్పుడూ. . . భార్యకి మతిభ్రమించినప్పుడూ. . . నిర్దోషి అయికూడా దోషిగా పంచాయతీ పెద్దల ముందు తలదించుకోవాల్సి వచ్చినప్పుడూ. . . చివరకి. . .చివరకి, సహధర్మచారినే సహధర్మం వీడి నిష్క్రమిస్తున్నప్పుడూ. . . అన్ని ఘటనలలో, అన్ని గండాలలో, అన్ని ఆపదలలో ఒక్కసారి. . . కనీసం ఒక్కసారైనా గుండె ఆగి చచ్చిపోలేదు. . . ఆ మానవుడు! తక్కువలో తక్కువ ఎవరినైనా కొట్టి చంపాలనే ద్వేషం కూడా ఆయన రక్తంలో కలుగలేదు.

జన్మ ఆదిగా హింసా విరోధి!!!

ఎలా సాధ్యపడిందీ మనీషికి జీవితకాలపు అహింసాపథ నిర్దేశకత్వం? మహోన్నత పవిత్ర జీవన సారధ్యం?!!!

కృష్ణమూర్తికి అర్ధం కాలేదు.

“ఇప్పడు అయిన వాళ్ళని పోగొట్టుకున్న నీ సమస్యకి కొంత ఊరట చిక్కినట్టనిపిస్తోందా నాయనా కృష్ణమూర్తీ?” అడిగాడు మహారధి.

“ఎక్కడ తాతగారూ! ఒక చిన్న గీత పక్కన యింకో పెద్ద గీత గీసి, ‘చూడు నీ గీతెంత చిన్నదో’ అన్నట్టుంది. . . ఈ పరిష్కారం.” అన్నాడు కృష్ణమూర్తి.

“చూడు నాయనా కృష్ణమూర్తీ జీవితంలో నీకొక కీడు జరిగింది. గుండె బెదురుపాటు చెందింది. దిక్కుతోచని స్థితిలో నా చెంత చేరావు. సలహా కోరావు. మనసు నొప్పితో దగ్గర చేరిన వాడిని నా కధ చెప్పి, మరింత కలవర పెట్టి పంపడం నాకు తెలిసిన నీతి కాదు. కానీ, కార్య కారణ సంబంధాల లాగే సమస్య, పరిష్కారం ఒకదాని కొకటి ముడిబడి వున్నాయి. సమస్యకి పరిష్కారం చెప్పడంలో నాకు నమ్మకం లేదు. ఒక పరిష్కారం నీకు నేను చెప్పానా. . . మరో సమస్యలోకి నిన్ను పనిగట్టుకుని నేను దింపుతున్నట్టే!!” అన్నాడాయన.

“అంటే?”

“అంటే. . . నువ్వు మళ్ళీ పెళ్ళి చెసుకుని, పిల్లాపాపలతో చక్కటి జీవితం గడపమని సలహా చెప్పవచ్చు. లేదన్నావా. . . ఒంటరిగానే జీవిస్తూ నీలాగే బ్రతుకులో ప్రమాదపడ్డ వారికి సహాయపడుతూ గడపమని చెప్పవచ్చు. కాదంటే ఆధ్యాత్మకంలోకి వెళ్ళమనవచ్చు. అదీ కాదనుకుంటే నీ యిష్టమొచ్చినట్టు జీవించమనవచ్చు. ఇవన్నీ నీ సమస్యకి పరిష్కారాలు. ఇందులో ఏ ఒక్కటి నీకు నేను సూచించినా. . . అది మళ్ళీ నీకు సమస్యని బహుకరిస్తున్నట్టే.”

(సశేషం)

Saturday, August 4, 2007

ధ్వజం!..‍6

పెద్దమ్మాయి చనిపోయేనాటికి మూడో అమ్మాయి గ్రాడ్యుయేషన్ చేస్తోంది. మా వూర్లో కాలేజీ లేనందువల్ల అక్కడికి ఓ యాభై మైళ్ళ దూరంలో వున్న జిల్లా హెడ్ క్వార్టర్సులో ‘లేడీస్ కాలేజీ’లో చేర్పించినాను. ఆ కాలేజీకి హాస్టల్ ఫెసిలిటీ వుండేది. అందువల్ల హాస్టల్లో వుంటూ చదువు సాగించింది. పెద్దమ్మాయి శవం కారులో యిల్లు చేరిన రోజున ఆ చావు వార్త తెలుపమని ఒక మనిషిని బస్సెక్కించి, అక్కడ హాస్టల్ కి పంపించినాను. అదే నేను చేసిన తప్పు. ఆ వెళ్ళినవాడు తిక్కమనిషి. “మహాలక్ష్మి పోయింద”ని చెప్పడానికి బదులుగా “మహారధి పోయాడ”ని చెప్పాడట. అంతే మారుమాట లేకుండా నిటచున్నచోటనే కుప్పకూలి, క్షణంలో ప్రాణం విడిచిందట నా బిడ్డ. ఎందుకంటే పసినాటినుండీ ఆమెకి నా పట్ల వల్లమాలిన ప్రేమానురాగాలు. అదీ. . .నా యింట ఆరవ చావు!

ఇక నాయింట ఏడు, ఎనిమిది చావుల గురించి చెపుతాను విను!

సినిమాల్లో నటించిన మా చివరివాడి తర్వాత, అందంలో మాయింట్లో చెప్పుకోదగ్గ వ్యక్తి మా రెండవ అమ్మాయి. పొడవైన మంచి సొంపుగల శరీరం ఆమెది. జడకూడా చాలా పొడవుగా వుండేది అమ్మాయిది. చూడ చక్కని చక్కదనం గల పిల్ల. తల్లి పోలికా నా పోలికా కలబోసుకు పుట్టింది. పెద్దమ్మాయీ, మూడో అమ్మాయీ పోయింతర్వాత యింటి పనిలో తల్లికి సహాయకారిగా నిలిచింది. అంతకు ముందెన్నడూ యిల్లుదాటి కాలు బయట పెట్టని పిల్ల, ఆరోజు బిందె తీసుకుని మంచినీళ్ళ కోసం వూరి చివరి బావి దగ్గర కెళ్ళింది. అక్కడ కనిపించాడట కారులో వెళుతూ భూస్వామి కొడుకు. అమ్మాయిని చూసి కారాపాడట. “మీ అమ్మని మా నాయన అనుభవించి వుంటే నువ్వు నాకు చెల్లెలి వరుస అయ్యుండే దానివి. అది జరగనే లేదు గనుక నాకు నువ్వు ఉంపుడుగత్తెవి అవుతావా?” అన్నాట్ట. “ఇట్లా “మాట్లడడం వల్లనే మీ నాన్నకి బ్రతకడం చేతకాలేదు. ఆడది. . .మా అమ్మ చేతిలో చచ్చాడు. నువ్వైనా మాటలు నేర్చుకుని నా చేతిలో చావకుండా వుంటే మంచిది.” అన్నదట మా అమ్మాయి. “అదీ చూద్దాం! తండ్రి సాధించలేక పోయినవన్నీ కొడుకు సాధించాలంటారు. అంతటి భూస్వామి కొడకుని. . . నేను నిన్ను సాధించలేక పోతానా” అంటూ సవాల్ చేసి వెళ్ళిపోయాడట.

అన్నట్టే, అ వెళ్ళినవాడు మరుసటిరోజు మళ్ళీ వచ్చాడు. మంచినీళ్ళ బావి దగ్గరకి కాదు. పట్టపగలు మా యింటికే వచ్చాడు. తండ్రిని మించిన తనయుడనిపించుకోవాలనే తపన వాడికి పాతికేళ్ళుగా బలపడి పోయి వుందనుకుంటా. తప్ప తాగి ఏడుమంది కుర్రాళ్ళని వెంటబెట్టుకు వచ్చాడు. ఆ సమయానికి యింట్లో పెద్దబ్బాయి లేడు. నేనూ, సువర్చలా, అమ్మాయీ వున్నాం. నన్నూ సువర్చలనీ కాళ్ళూ చేతులూ కట్టి, అక్కడే మూలన పడేశారు. మేం చూస్తూండగానే అమ్మాయిని వివస్త్రను చేసి, బలవంతంగా అనుభవించాడు. విజయ గర్వంతో పొంగిపోయాడు. ఆపైన, ఒకడి తర్వాత ఒకడుగా ఏడుమందీ అమ్మాయిని అనుభవించేట్టు చేశాడు. అ సంఘటనలో అమ్మాయి అక్కడే ప్రాణాలు విడిచింది. కొండంత దౌర్భాగ్యమేమో మాది. అ ఘోర భీభత్స కృత్యం నేనూ, సువర్చలా కళ్ళారా చూడాల్సివచ్చింది. అమ్మాయి మరణించిన తర్వాత, భూస్వామి కొడకు సువర్చల దగ్గరకి వచ్చాడు. బిగ్గరగా నవ్వేడు. “చూడవే! నన్ను చంపుతానన్నది నీ కూతురు. అదే చచ్చింది. మేమేమయినా చంపామా? ముద్దొచ్చి సరసమాడాం! ఆ మాత్రానికే చచ్చింది. అసలు ఆనాడే నువ్వు మా నాయన దగ్గర పడుకుని వుంటే ఈ రోజు యింత తతంగం జరిగేది కాదుగా” అన్నాడు. మళ్ళీ నవ్వాడు. పాపం! ఏంచేయగలదు సువర్చల కాళ్ళూ చేతులు కట్టి పడేసిన నిస్సహాయురాలు. ఏడ్చుకుంటూ చనిపోయిన కూతురి వైపు చూసుకుంటోంది.

సరిగ్గా అప్పుడే వచ్చాడు అక్కడికి మా పెద్దబ్బాయి. . .లైబ్రరీ నుండి. వాకిట్లో ఎదురైన భూస్వామి కొడుకుని చూసి, “ఏం జరిగింద”న్నాడు. “నీ చెల్లెమ్మకి కన్నెరికం జరిగింద”న్నాడు వాడు గర్వంగా. మా పెద్దవాడేం మాట్లాడలేదు. చేతిలోవున్న పుస్తకాలు నేలమీద పెట్టేడు. అక్కడవున్న గొడ్డలి ఒకదాన్ని అందుకున్నాడు. పదినిముషాలు. . . సరిగ్గా పదే పది నిముషాల వ్యవధిలో. . . భూస్వామి కొడుకుతో సహా ఎనిమిదిమందినీ ముక్కలు ముక్కలుగా నరికాడు. చీల్చి చండాడేడు. కాకలుతీరిన కుర్రాళ్ళు. . . ఒక్కడూ మిగలకుండా అందరూ చచ్చారు. ఆ ఘర్షణలో మావాడికీ గాయాలయినాయి. తల్లి ఒడిలోకొచ్చి తలబెట్టుకుని తనూ తుది శ్వాస విడిచాడు. “వీడు సోక్రటీజే కాదు. . . అలగ్జాండర్ కూడా” అని అప్పుడనుకున్నా. . .వాడిలో శౌర్యం గ్రహించి! అవి. . . నా యింట ఏడు, ఎనిమిది చావులు!

అంత హింసనీ ఒక్కసారిగా చూసిన సువర్చల ఆ తర్వాత తట్టుకోలేక పోయింది. బాగా భయపడిపోయింది. నలభైయేళ్ళ వయసులోనే అన్ని రకాల యాతనలూ చవిచూసిన ఆ నిష్కల్మషురాలు. . .ఆ పైన మతిభ్రమించి, పిచ్చిదై పోయింది. అప్పటికే ఆవూరి ప్రజలకి “నేనొక దరిద్ర దామోదరుడ”ననే అభిప్రాయం వుంది. సువర్చల కూడా పిచ్చిదవడంతో వాళ్ళ నమ్మకం యింకా బలపడింది. నావంటి “మహాదరిద్రుడు ఆ ఊరిలో వుండడం వూరికే అరిష్టం”గా భావించినారు. పంచాయతీ నిర్వహించి, నన్నూ, నా భార్యనీ ఊరి నుండి వెలివేసి గ్రామ బహిష్కార శిక్ష విధించారు.

అంతటితో ఆ గ్రామం వదిలి ఈ వూరు చేరాను. మాధవరావు తండ్రికీ, నాకూ వయసులో చాలా తేడా వున్నప్పటికీ, ఏదో దూరపు చుట్టరికంలో నాకు తమ్ముడి వరుస అవుతాడు. మేం ఈ వూరు వచ్చినప్పడు అతడు చాలా చిన్నవాడు. పెళ్ళికాలేదు. అతడే మమ్మల్ని చేరదీసి, ఆశ్రయం కల్పించాడు. అప్పట్నుంచీ నేను ఉపాధ్యాయ వృత్తిని వదిలి, నాకు తెలిసిన మరో వృత్తి చేనేత పనిలోకి దిగాను. మతి చెడి పసిబిడ్డలా తయారైన నా భార్యకి నేనే రెండు పూటలా వండిపెడుతూ, పగలంతా మగ్గం మీద కూర్చుంటూ, జీవితం కొనసాగించినాను. ఆ తర్వాత ముప్ఫైయేళ్ళు జీవించి తన డెభై రెండవయేట సువర్చల కన్నుమూసింది. . . అది నా యింట తొమ్మిదవ చావు!

గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ యింట్లో నేను ఒంటరిగా జీవిస్తున్నాను. వేకువనే లేవడం, వ్యాయామం, స్నానం, భోజనం చేసుకుని మగ్గం గుంటలోకి దిగడం. . .సాయంత్రం వరకూ పని. . .ఆపైన, ప్రకృతితో గడపడం. . .తర్వాత, ఎనిమిదింటికల్లా భోంచేసి, నిద్రబోవడం. . . ఇదీ నా దినచర్య! ఇందులో నేను తత్వవిచారానికీ, ధ్యానానికీ సమయం కేటాయించ లేదు. ఎందుకంటే నిద్ర లేచింది మొదలు పడుకునే వరకూ అవి నన్ను అంటిపెట్టుకునే వుంటాయి. ఇకపోతే పత్రికలూ, టీవీలూ, మీడియా, సిధ్ధాంత చర్చలూ నాకు అవసరం లేదు. మనిషికి నిజంగా కాలక్షేపం కావలసివస్తే, అది తన మనసులోనే దొరుకుతుంది.

ఎందరున్నా మాట్లాడుతూ గడప గలను. ఎవరూ లేకున్నా కూడా గడప గలను. చివరగా ఒక్కమాట. ఇప్పుడు నాకు తొంభై సంవత్సరాలు. కానీ, ఈ నాటికీ మగ్గం మీది కండెలోని నూలుపోగు స్పష్టంగా కన్పిస్తుంది. . . కళ్ళజోడు అవసరం లేకుండానే!!”

“అది నాయనా కృష్ణమూర్తీ నా సుదీర్ఘ జీవితపు విషాద గాధ అన్నాడు మహారధి చెప్పడం ముగించి.”
* * * *
(సశేషం)

Friday, August 3, 2007

ధ్వజం! --5

తర్వాత, తొమ్మిదేళ్ళలో సువర్చల మరో ఆరుమందికి జన్మనిచ్చింది. వాళ్ళలో పెద్ద వాళ్ళిద్దరూ మగపిల్లలు. తర్వాతి ముగ్గురూ ఆడపిల్లలు. చివరివాడు మళ్ళీ మగవాడే. కానీ, బాబూ కృష్ణమూర్తీ ఆ చివరివాడున్నాడే వాడు అసాధారణమైన సౌందర్యం గలవాడు. అద్బుతమైన రూపవంతుడు. “కాకి పిల్ల కాకికి ముద్దం”టారు. “హంస పిల్ల అందరికీ ముద్దే”నని వాడు పుట్టిన ఒకటిన్నర సంవత్సరం లోనే నిరూపించినాడు. ఆ చుట్టుప్రక్కల వూర్లలో వుండే ప్రజలంతా తండోపతండోలుగా, అదే పనిగా వచ్చి వాడ్ని చూసి వెళ్ళేవాళ్ళు. “ఎనిమిదవ వాడుగా నా యింట శ్రీకృష్ణుడే జన్మించినాడ”ని అనుకున్నాను.

ఆ రోజుల్లో ప్రసిద్ది చెందిన చలనచిత్ర దర్శకుడొకాయన తను నిర్మించబోయే భారీ పౌరాణిక చిత్రానికి “చిన్ని బాల నటుడు కావాల”ని, “ఫలానా తేదీన సెలక్షన్ వుంటుంద”నీ ఒక దినపత్రకలో ప్రకటన యిచ్చాడు. నేను మా చివరివాడిని తీసుకుని ఆ సెలక్షన్ జరుగుతున్న ఊరు వెళ్ళాను. చిత్రంలో బాలుడి పాత్ర బాగా ప్రాముఖ్యమున్నది కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఐదు వందలమంది తమ పిల్లల్ని వెంటబెట్టుకు వచ్చారు. . . ఆ రోజుల్లోనే. వారం రోజలపాటు సెలక్షన్ తంతు జరిపి, కడకి మా చిన్నవాడ్ని ఎంపికచేసినట్టు ప్రకటించాడు ఆ డైరెక్టర్. ఆ మాట విన్నరోజు మా యింట జరిగిన సంబరం అంతా యింతా కాదు.మూడు నెలల పాటు జరిగింది షూటింగ్! చిత్రం పూర్తయింది. పారితోషికంగా ఐదు వేల రూపాయలు యిచ్చారు. ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం. అప్పటికి నా పూర్తి జీవితమంతటిలో నేను ఒకేసారిగా చూసిన ఎక్కువ డబ్బు అదే! ఆ విషయం భూస్వామి కొడుక్కి తెలిసింది. అట్లా పసివాడు వరుసగా సినిమాల్లో నటించడం మొదలు పెడితే, అతి కొద్దిరోజుల్లోనే నేను పెద్ద ధనవంతుడిని అయిపోతానని భావించినాడు.అంతే!! ఆ మరుసటి రోజు యింటి ఆరు బయట ఆటలాడుకుంటున్న నా చిన్ని కృష్ణుడు. . . ఆ ఆరు బయటే నిర్జీవుడై, శవమై కన్పించినాడు. పోస్టుమార్టం రిపోర్టులో విషప్రయోగమని తెలిసింది. భూస్వామి కొడుకు మీద కేసు పెట్టాను. సాక్ష్యాల్ని కొనేసి కేసు మాఫీ చేయించుకున్నాడు. మళ్ళీ పదేళ్ళ విరామం తర్వాత, నా ఎనిమిదవ బిడ్డ మరణించినాడు. . . అది నా యింట మూడవ చావు!


మిగిలిన ఐదు మందిలో పెద్దవాడు మహా సాత్వికుడు. నాలాగే నెమ్మదస్తుడు. పెద్ద పెద్ద శాస్త్రజ్ఞుల గురించీ, తాత్వికుల గురించీ చిన్ననాటి నుండే అడిగి తెలుసుకునే వాడు. వారి వారి సిధ్ధాతాలు నాతో చర్చించేవాడు. జఠిలమైన తాత్విక సమస్యల్ని కూడా సులువుగా పరిష్కరించగలిగే వాడు. చదువులో కూడా క్లాస్ ఫస్ట్ వుండేవాడు. . . “అన్నీ సోక్రటీస్ లక్షణాలే” అనుకున్నా.రెండవవాడిది దుడుకుబోతు మనస్తత్వం. పదవ తరగతి చదువుకునే రోజుల్లోనే వాడిని వాళ్ళ క్లాస్ టీచర్ “బాల నేరస్తుల కేంద్రంలో చేర్పించ” మన్నాడు. “నా కడుపున హిట్లర్ పుట్టడమేమిటా” అని బాధ పడినాను. దానికి తగినట్టుగానే వాడు కర్రసాము నేర్చాడు. అందులో మెలకువలన్నీ తెలుసుకుని ఆరితేరాడు. మల్లయోధుడి కుండే శరీర సౌష్టవం వాడిది. తనంతవారిని ముగ్గురు మనుషుల్ని సైతం అవలీలగా తిరగ గొట్టగలిగే యుద్ధ నైపుణ్యం సంపాదించాడు. దాంతో మనిషి గర్వించినాడు.

ఇరవై రెండేళ్ళ వయసు రాగానే వూరు వూరంతా వాడ్ని చూసి బయపడసాగింది. దాంతో వాడు మరీ విర్రవీగినాడు. ఊరిలో ఆ చివరనుండీ ఈ చివర వరకూ పద్దెనిమిది మంది తలకాయలు పగులగొట్టాడు. ప్రతి చిన్న విషయానికీ కోపమే వాడికి. నిగ్రహమన్నది లేదు.“వలద”ని వారించినాను. “హింస తప్ప”న్నాను. “మానమత్వం అభిమానం కలద”న్నాను. “కర్రసాములకీ, కరవాలం మెరుపులకీ అది తలదించుకోబోద”న్నాను. “ప్రవర్తన అలాగే కొనసాగితే ఒకనాటికి ఓటమి తప్పద”న్నాను. వాడు వినలేదు. పెడచెవిన పెట్టేడు. చివరికి నేనన్నదే జరిగింది. విసిగి, వేసారిన మానవత్వం ఒక రోజు రొమ్ము విరుచుకుంది. “ఎవడు వీడు బ్రతకడం నేర్వని వెర్రిబాగులవాడం” టూ కన్నెర్రజేసింది. ఎవరో కాదు. . .వాడి స్నేహితులే. . . నలుగురు యింటికొచ్చి షికారు కోసం వాడ్ని పిలుచుకు వెళ్ళారు. మంచిగానే మాట్లాడుతూ వూరి బైట బావి గట్టు మీద వాడ్ని కూర్చోబెట్టారు. నవ్వుకుంటూ, త్రుళ్ళుకుంటూనే, అలాగ్గా వాడి రెండు కాళ్ళూ ఎత్తి, వెనక్కి బావిలోకి తోసేశారు. మళ్ళీ ఏనాటికీ పైకి రాకుండా రెండు పెద్ద బండరాళ్ళెత్తి లోపలికి వేశారు. యథావిధంగా మళ్ళీ నవ్వుకుంటూనే ఎవరి యిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు.

మళ్ళీ పదునాలుగేళ్ళ తర్వాత, నా నాలుగవ బిడ్డ మరణమే. . . నా యింట నాలుగవ చావు.మా sపెద్దమ్మాయి పేరు మహాలక్ష్మి! యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్. పెద్దవాడిలాగే నెమ్మదస్తురాలు. తప్పు చేయదు గనుక, మాటంటే భరించగలిగేది కాదు. అదంత గొప్పలక్షణం కాదనేవాడిని. నెమ్మదితనం అంటే. . అది అన్నింటా వుండాలనేవాడిని. నాలుగోవాడు మరణించిన తర్వాత ఒక సంవత్సరానికి ఏదో మునిగిపోయినట్టుగా తొందరపడిపోయి పెళ్ళి చేశాను. చాలా వైభవంగా చేశాను. నా యింట జరిగే మొదటి శుభకార్యం గనుక అబ్బాయివాళ్ళు అడిగినవన్నీ యిచ్చి, ఆదరంగా అత్తవారింటికి పంపాను. మూడవరోజుకి. . .శోభనం గదిలో సోయగాలు ఒలకబోస్తూ వుంటుందనుకున్న పిల్ల కాళ్ళ పారాణి ఆరకుండానే కట్టెగా మారి, కారు డిక్కీలో కమురు కంపుకొడుతూ నా యింటికొచ్చింది. నివ్వెరపోయి, “ఏం జరిగింద”న్నాను. వంట గదిలో అగ్ని ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదవశాత్తూ పోయిందన్నారు. మహాలక్షి శవాన్ని నాయింటి ముందే పడేసి, మెల్లగా తప్పుకున్నారు. అసలు విషయం తర్వాత తెలిసింది. శోభనం రోజు రాత్రి గదిలో పెళ్ళికొడుకు అడిగాడట. “నిన్ను భూలక్ష్మీ అని పిలవాలా లేక మహాలక్ష్మీ అని పిలవాలా?” అని. “అట్లా ఎందుకడుగుతున్నారు?” అన్నదట నా బిడ్డ. “ఏం లేదు. నువ్వు భూస్వామి కూతురివైతే భూలక్ష్మీ అందామని. . . మహారధి కూతురివైతే మహాలక్ష్మీ అని పిలుద్దామని” అని బదులిచ్చేట్ట. సతీదేవంతటి అభిమానవంతురాలు నా పెద్ద కూతురు. తల్లి శీలాన్ని భర్త శకించడం భరించలేకపోయింది. మరుక్షణం వంటింటిలోకెళ్ళి శరీరం మీద కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని దగ్దమై పోయిందట. . . అది నా యింట అయిదవ చావు.

( సశేషం )

Thursday, August 2, 2007

ధ్వజం --4

భూకంప విపత్తు సంభవించే సమయానికి ఆదృష్టవశాత్తూ మాధవరావు వూర్లో లేడు. ఏవో పొలం సంబంధమైన పనులమీద భార్యా పిల్లల్తో సహా అక్కడికి ఆరొందల కిలోమీటర్ల దూరంలోనున్న తన స్వగ్రామం వెళ్ళేడు. అక్కడ భూకంప ప్రభావం లేదు.

అయితే ప్రాణ నష్టం ఏదీ లేకపోయినా, ఆస్తి నష్టం మాత్రం అతడికి బాగానే జరిగింది. కృష్ణమూర్తి లాగే అతడి యిల్లు ధ్వంసమయింది. ఇంట్లో వున్న డబ్బు, బంగారం, ఫర్నిచర్ లాంటివన్నీఅతడొచ్చి చూసుకునే సరికే దొంగలు పట్టుకుపోయారు. స్వగ్రామంలో కొద్దిపాటి ఆస్తిపాస్తులున్నందు వల్ల అతడు తట్టుకోగలిగాడు.

ఎటొచ్చీ, కృష్ణమూర్తిదే అతడికి పెద్ద సమస్య! ఇళ్ళూ, వుద్యోగం, ఆప్తులూ సమస్తం కోల్పోయి, వీధినపడి యించుమించు పిచ్చివాడిలా తయారైన కృష్ణమూర్తికి. . .మాధవరావు అన్నీ తనే అయాడు. ప్రభుత్వం కల్పించిన తాత్కాలిక వసతి గృహంలో ఆశ్రయం పొందుతున్న అతడ్ని కలుసుకుని దగ్గరకి తీసుకున్నాడు. తిరిగి కృష్ణమూర్తి ఏ అఘాయిత్యానికో తలపడకుండా అనుక్షణం అతడ్ని అంటిపెట్టుకునేవుంటూ, అతడికి మానసిక స్థైర్యాన్నిఅందించసాగాడు. ఎటూ యిద్దరికీ ప్రస్తుతం వుద్యోగాలు లేవు. అసలు వాళ్ళు పనిచేస్తున్న కంపెనీయే లేదు. పరిస్థితులన్నీ చక్కబడి, మళ్ళీ మామూలు స్థితికి రావడమంటే చాలా కాలమే పడ్తుందనిపించింది మాధవరావుకి.

అందుకే అతడొక నిర్ణయాని కొచ్చాడు. ఆ పరిసరాలకి దూరంగా కృష్ణమూర్తిని తనతోపాటే తన స్వగ్రామం తీసుకువెళ్ళి కొంతకాలంపాటు తన దగ్గరే వుంచుకోవాలనుకున్నాడు. దానికి తగినట్టుగానే కృష్ణమూర్తి ఆరోజు సాయంత్రం ఒకమాట అన్నాడు.

“భార్యా పిల్లలూ పదే పదే గుర్తుకొస్తూ రోజు రోజుకీ మనసు మరీ బలహీనంగా అవుతోంది మాధవా! ఒక్కొక్కసారి నేనిక బ్రతకలేననిపిస్తుంది. నన్నెక్కడికైనా దూరంగా తీసుకు వెళ్ళగలవా?”
“దూరంగా అంటే ఎక్కడికి?” అన్నాడు మాధవరావు.

“ఒకరోజు నువ్వొక మాటన్నావు గుర్తుందా మాధవా? కన్నబిడ్డలు ఎనిమిదిమందినీ పోగొట్టుకుని, యింకా మరేవో కష్టాలు పడుతూ కూడా ధైర్యంగా జీవనం సాగిస్తున్న వ్యక్తి ఎవరో వున్నారన్నావు గుర్తుందా?”

“గుర్తుంది!”
“ఎందుకో నాకా వ్యక్తిని చూడాలని వుంది వెంటనే. చూపించగలవా?” అన్నాడు.

మాధవరావు కృష్ణమూర్తి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఆపైన అన్నాడు.

“చూద్దాం కృష్ణమూర్తీ! రేపు సాయంత్రమే ఆయన్నిమనం తప్పకుండా చూద్దాం!”
* * * *

ఒక చిన్న పూరిల్లు! దాని చుట్టూ వెదురు కర్రలతో విశాలంగా కట్టిన ఫెన్సింగ్!
ఆ ఫెన్సింగ్ లోపల అంతా ఆకు పచ్చని పచ్చిక. ఓ పది దాకా కొబ్బరి చెట్లూ, నాలుగు కస్తూరి చెట్లు, రెండు నూరు వరహాల చెట్లూ, ఒక నందివర్దనం, కాశీ రత్నాలూ, యింకా పూల మొక్కలూ, కూరగాయల మొక్కలూ. . . అక్కడ్నుంచి దూరంగా ఆకు పచ్చని కొండలు. . . దొంతర. . .దొంతరలుగా. . . అందంగా కన్పిస్తున్నాయి.

ఆ పూరింట్లోనే మూడు గదులున్నాయి. ఓ గదిలో వంట. ఓ గదిలో పడక. అతిధుల కోసం అన్నట్టు అటువైపు మరో గది. వసారాలో నేత మగ్గం. అక్కడే నూలు వడికే రాట్నం.

ఆ సాయంత్రం వేళ. . . ఆ యింటి బయట పచ్చికలో ముగ్గురు వ్యక్తులు కూర్చుని వున్నారు. వారిలో ఒకరు మాధవరావు. . .ఇంకొకరు కృష్ణమూర్తి. . . మూడవ వ్యక్తి ఆ యింటి యజమాని. . . ఆయన పేరు స్వర్ణధ్వజాల మహారధి.

ఆయనకి తొంభైయ్యేళ్ళ వయసుంటుంది. ఆరడుగుల పొడవు. పొడవుకి తగ్గ లావు. అంత వయసున్నట్టు కనిపించడు. మనిషి చలాకీగా వుంటాడు. మల్లెపూవు లాంటి తెల్లటి ఖద్దరు చొక్కా, పంచె. జుట్టు మొత్తం తెల్లబడిపోయివున్నా చక్కగా దువ్వుకున్నట్టుగా వుంది.

మహారధి గొంతు సవరించుకున్నాడు. కృష్ణమూర్తి వైపు చూశాడు.

“చూడు బాబూ కృష్ణమూర్తీ నీది పెద్ద కష్టం. దాని గురించి ఆలోచించాల్సింది నిజంగా ఎక్కువే వుంది! అంతకంటే ముందుగా అనుక్షణం ప్రమాదాల పారంపర్యత నింపుకున్న నా జీవిత వృత్తాంతం నువ్వు వినాలి. అది నీ ముందస్తు జీవితానికి మార్గదర్శకం కావచ్చు! అన్నాడు.

చెప్పమన్నట్టు తలాడించేడు కృష్ణమూర్తి.

“చూడు బాబూ! నేనొక ఉపాధ్యాయుడిని. డెభైయేళ్ళ క్రితం. ఆ రోజుల్లో బ్రతకలేక బడిపంతులనే వారు. అప్పటికే నాకు ఇరవైయేళ్ళు. ఆ తర్వాత మూడేళ్ళకి సువర్చలాదేవితో నాకు పెళ్ళయింది. ఆమె మంచి రూపవతి. అంతకు మించిన గుణవతి. అప్పటికే ఆమెకి పద్దెనిదేళ్ళు! పెళ్ళయిన రెండేళ్ళకి మాకు పాప పుట్టింది.

తొలి బిడ్డని చూసుకుని భార్యాభర్తలిద్దరం మురిసిపోయాం. మా యింట లక్ష్మీదేవి జన్మించిందని పండుగలు చేసుకున్నాం. పాపని అల్లారుముద్దుగా పెంచుకున్నాం. సంవత్సరం గడిచింది. ఇంతలో సువర్చల మళ్ళీ గర్భం ధరించింది. అంతవరకూ చక్కగా గడిచిన నాజీవితం అక్కడ నుండీ గతి తప్పింది.

ఆరోజు ఉదయం నేను యింట్లో లేను. ప్రభుత్వ ఆరోగ్యశాఖ వారిచ్చివెళ్ళిన విటమిన్ టాబ్లెట్లు పాప చేత మింగించడానికి సువర్చల ప్రయత్నించింది. ఆహార వాహిక, శ్వాసకోశాలు వీటి గురించి సువర్చలకి అవగాహన లేదు. టాబ్లెట్ ని పాప గొంతులో వేసి బలవంతంగా నోరు మూసింది. ఆ తర్వాత, నీళ్లుకూడా తాగించింది. అయినా దురదృష్టం వెన్నాడింది. మాత్ర కడుపులోకి దిగలేదు. ఏ శ్వాస నాళానికి అడ్డు పడిందో యేమో. . . ఫలితంగా పాప మరణించింది. . .అది బాబూ నా యింట మొదటి చావు!” మహారధి ఆపాడు. ఆయన విలక్షణమైన ముఖంలో ఏ భావమూ లేదు. వెనక్కి కాలంలోకి వెళ్ళి, ఒక పాత సంఘటనని గుర్తుకుతెచ్చుకుని వివరిస్తున్నట్టుగా వుంది. ఆయన మళ్ళీ ప్రారంభించేడు.

“ఇక రెండవది. చెప్పానుగా. . .సువర్చల చాలా అందగత్తె అని. సహజం గానే ఆ వూరి భూస్వామి ఒకతను ఆమెపై కన్ను వేశాడు. సమయం కోసం వేచి చూడసాగాడు. ఇంతలో సువర్చల రెండవ బిడ్డని కూడా ప్రసవించింది. ఈసారి మగబిడ్డ. మళ్ళీ ఆర్నెళ్ళు నడిచాయి. ప్రక్క పట్టణంలోని జిల్లా పరిషత్తులో పనుండి నేను ఆ రోజు రాత్రి ప్రయాణమై వెళ్ళాను. అది తెలుసుకున్న ఆ భూస్వామి అర్థరాత్రి వేళ మా యింటికి వెళ్ళి, తలుపు తట్టాడు. అప్పట్లో మాది పెంకుటిల్లు. పసిబిడ్డతో పాటు నిద్రిస్తున్న సువర్చల తలుపు తీసింది. ఆమెనలాగే వున్న ఫళాన లోపలికి నెట్టుకుంటూ వెళ్ళి, భూస్వామి లోనుండి తలుపు గడియ పెట్టేడు. “రా. . రమ్మంటూ” ఆమె చేయి పట్టుకున్నాడు. ఎలా పెనుగులాడిందో యేమో సువర్చల తను మాత్రం మానం పోగొట్టుకోకుండానే బయటపడింది. అతడు రాకుండా బయట నుండి తలుపుకి గొళ్ళెం పెట్టింది. కానీ, పసిబిడ్డ మాత్రం భూస్వామితో పాటు లోపలే వుండి పోయాడు. దాన్నే అవకాశంగా తీసుకున్నాడు ఆ భూస్వామి. సువర్చల గనుక “అరిచి గోల పెడితే, లోపలున్న బిడ్డని చంపేస్తా”నని బెదిరించేడు. బిడ్డని రక్షించుకోవాలనుకుంటే “తలుపు తీసి లోనికొచ్చి తనకి శరీరం అర్పించుకో”మన్నాడు.

ఏం చేస్తుంది సువర్చల? అరిచి బిడ్డని చంపుకోనూలేదు. అతడన్నట్టు శీలం పోగొట్టుకోనూలేదు. దిక్కుతోచని స్థితిలో యేదీ చేయలేక అలాగే తలుపు దగ్గర నిలుచుండిపోయింది. ఒక గంటసేపు నానా రకాలుగా బెదిరించాడతడు లోపల్నుండి. సువర్చల నుండి సమాధానం లేదు. ఏమనుకున్నాడో యేమో. . . తనకేం భయం లేదన్నట్టుగా భూస్వామి లోపలున్న నా బిడ్డని కత్తితో ముక్కలు ముక్కలుగా నరికి, ఒక్కొక్క ముక్క సువర్చల చూసే విధంగా కిటికీ లోంచి బయటికి విసిరేయసాగాడు. రక్తంతో తడిసిన తన ఆర్నెళ్ళ పసికందు శరీరంలోని ప్రతి భాగాన్ని, ప్రతి ముక్కనీ కళ్ళారా చూసుకుంది సువర్చల. . . ఆ కర్కోటకుడు విసురుతుండగా. అయినా మానం పోగొట్టుకోలేదు. కానీ, అక్కడే వున్న ఒక గునపం తీసి చేతబట్టుకుంది. శరీరపు ముక్కల్నన్నీ విసరడం పూర్తయాక భూస్వామి లోపల్నుండి కిటికీ వూచల్ని విరగ్గొట్టి, కిటికీకి పెద్ద సందు చేశాడు. బయటకి రావడానికి ప్రయత్నంజేస్తూ, ఆ సందులోంచి దూర్చి, తల బైటకి పెట్టేడు.

తను ఏం చేయాలో అప్పటికే నిశ్చయించుకుని వుంది సువర్చల. గునపం పైకెత్తి ఒకే ఒక్క వూపుతో వాడి వీపులోనుండి గుండెల్లోకి దింపింది. అట్లా వాడు చచ్చేవరకూ మళ్ళీ మళ్ళీ దింపింది.

ఆపైన, భూస్వామి కొడుకు నా భార్య మీద హత్యానేరం కేసు మోపాడు. కానీ, న్యాయమూర్తి దాన్ని నేరంగల హత్యగా పరిగణించలేదు. పైగా నా భార్యని ప్రశంసించినాడు. “మాన సంరక్షణ కోసం కన్నబిడ్డను సైతం త్యాగం చేసిన స్త్రీమూర్తి”గా, “అద్వితీయమైన భారతీయ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం”గా అభివర్ణిస్తూ దాన్ని జడ్జిమెంటు లో ఉటంకించినాడు. కేసు కొట్టి వేసినాడు. ఏది ఏమైనా. . .నా రెండవ బిడ్డ మరణించినాడు!. . .అది నా యింట రెండవ చావు!

( సశేషం )

ధ్వజం --3

ఇరవై నిముషాల తర్వాత, చెమటలు గ్రక్కుకుంటున్న శరీరంతో
కృష్ణమూర్తి తన యింటి ముందున్నాడు. కానీ, యిల్లు అతడి ముందు లేదు. ఒక రాళ్ళ కుప్ప మాత్రం వుంది.

అసలా వీధిలో ఎవరి యిల్లూ లేవు. ఏ ఒక్కడి యిల్లూ నిఖార్సుగా నిలబడి లేదు. అన్నీ అర కొరగా మిగిలిన శిథిలాలే! అన్నీ రాళ్ళ కుప్పలే!! శకలాల వ్రక్కలే!!!

ఆ ముక్కల మధ్యన చిక్కుకుని మృత్యువుతో పోరాడుతూ కొందరు మానవులు. వారిని బయటికి లాగడానికి ప్రయత్నిస్తున్న యింకొందరు బ్రతికి బట్టకట్టిన మనుషులు. . . అంతా తాపత్రయాలు. . . తన వారి కోసం తాపత్రయాలు! ఉరుకులూ, పరుగులూ, ఏడుపులూ, పెడబొబ్బలూ, ఆర్తనాదాలూ, హాహాకారాలూ. . . గుండె బాదుడ్లూ. . . గుంభనపు రోదనలూ. . . అది వూరు కాదు. ఊరైన వల్లకాడు!!

ఇవన్నీ పట్టించుకునే స్థితిలో కృష్ణమూర్తి లేడు. మొదట ఇల్లు కూలిపోయిందన్న సత్యం భోదపడగానే దాన్ని జీర్ణించుకోలేక అతడు ప్రాణాలు ఎగిరిపోయేట్టు వెర్రికేక ఒకటి పెట్టేడు. అలాగే కేక పెట్టినట్టుగా రోదిస్తూ వేగంగా రాళ్ళ గుట్ట మీదికి చేరుకున్నాడు. చుట్టూ కలియజూస్తూ తన వారి కోసం వెదికాడు. ముందుగా భార్య శారద కనిపించింది. కాంక్రీట్ దిమ్మెల మధ్యన కూరుకుపోయివుంది.

“శారదా” పొలికేక పెట్టి, క్షణంలో ఆమెని చేరుకున్నాడు. అప్పటికే స్పృహ తప్పబోయే స్థితిలో వుందామె. భర్త గొంతు విని, కనుల్ని బలవంతంగా తెరిచి, అతడి వైపు చూసింది. అంతటి బాధలోనూ ఆమె ముఖంలో ఒక వెలుగురేఖ కనిపించి, మాయమైంది.

“ఏమిటీ శిక్ష నీకు శారదా? ఏరీ నాపిల్లలు. . . ఎక్కడ నా తల్లి. . .?” ఆమె నడుం దగ్గరి కాంక్రీట్ దిమ్మెల్ని తొలగించడానికి ప్రయత్నించాడు. అలివి కాలేదు. బలాన్నంతా ఉపయోగించి మళ్ళీ లేపడానికి ప్రయత్నించేడు. ఇసుమంత కూడా కదల్లేదు. అది చాలా పెద్ద దిమ్మె. లాభం లేదని తెలిసింది. ఆమె తలవేపుకి చేరుకున్నాడు. గుండెలపైనున్న రెండు చిన్నపాటి రాళ్ళను మాత్రం పక్కకి నెట్టి, శరీరం పైన మట్టిని తుడిచాడు. అక్కడే కూర్చుని ఆమె తలని తన తొడమీదకి చేర్చి, ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు.

“నా శక్తి చాలడం లేదు శారదా” ఆమె ముఖంలోకి చూసి పెద్దపెట్టున ఏడ్చాడు. ఆమె అతడి కళ్ళలోకి సంతృప్తిగా చూసింది. కడసారి చూపులన్నట్టుగా అతడి ముఖమంతా నిండుగా చూసుకుంది. బలవంతంగా కుడిచేతినెత్తి ‘నా పని ముగిసింది లాభం లేదన్నట్టుగా’ సైగతో చెప్పింది. ఆపైన అటువేపు వేలు చూపిస్తూ, ‘ అక్కడ పిల్లలో, తల్లో వున్నార’న్నట్టుగా ‘ముందు వాళ్ళని కాపాడమ’న్నట్టుగా సంజ్ఞ చేసింది.

విడవలేక ఆమెని విడుస్తూ, విధి లేక విడుస్తూ, కృష్ణమూర్తి అటువేపుకి పరుగుతీశాడు. అక్కడ అతడి తల్లి కనిపించింది. రక్తసిక్తమైన దేహంతో తొడల వరకూ శిథిలాల మధ్య కూరుకుపోయివుంది.

“అమ్మా!” ఆమెని చేరుకుని, బేలగా అరిచాడు. ఆమె స్పృహలోనే వుంది. తల తిప్పి కొడుకుని చూసింది. “మూర్తీ! వచ్చావురా! అరుగో పిల్లలు. . .ఆ రాళ్ళ క్రింద. ముందు వాళ్ళని బయటకి లాగు” అందామె మొదటగా అటు ఎడమవైపుకి చూపిస్తూ.

కృష్ణమూర్తి ఆమె మాటలు పట్టించుకోలేదు. ఆమె తొడల దగ్గరకి చేరి, ఒక పెద్ద బండరాతిని ప్రక్కకి తొలగించాడు.

“ఒరే మూర్తీ! బిడ్డల్ని వదిలేసి కాటికి కాళ్ళు చాపుకున్న నన్ను లాగుతావేరా వెధవా. వెళ్ళరా. వెళ్ళి వాళ్ళని లాగు ముందు” ఆమె కసురుకుంది.

“లేదమ్మా. ఈ ఒక్క రాతినీ తీస్తే నువ్వు బతుకుతావు” అతడు మళ్ళీ రాతికి భుజం ఆనించి బలంగా నెట్టసాగాడు.

“నువ్వెప్పుడూ నా మాట వినవు. ఒరే నాయనా చచ్చేప్పుడు ఈ ఒక్క మాటయినా వినరా. నేనెటూ బతకను. నీ వంశాకురాల్ని కాపాడుకోరా. వెళ్ళరా.” ఏడుస్తూ, ఆమె బ్రతిమాలింది.

“నాకు తెలుసులేవే. ఒక్క నిముషం ఓపిక పట్టు” ఏడుస్తున్న కృష్ణమూర్తి రాతిని వదిలి పెట్టలేదు.

“ఛీ! నా కడుపున చెడబుట్టేవురా. వెళ్ళి ముందు పిల్లల్ని కాపాడుకోరా. పనికిమాలినోడా.” ఆ కన్నతల్లి కృష్ణమూర్తిని అసహ్యించుకుంటూ అంది.

నెడ్తున్న రాతిని చటుక్కున వదిలేసి కృష్ణమూర్తి, తల్లి వైపు చూశాడు నిశ్చలంగా. చచ్చేప్పుడు కూడా తిట్టడం మానుకోని తల్లి. . . తన ముదుసలి ప్రాణం కన్నా మనుమల ప్రాణాలకి ప్రాధాన్యం వుందంటోంది. విషాద భరిత వేదనాశ్రువులు కళ్ళ వెంట వర్షించగా, కృష్ణమూర్తి తన రెండు చేతులూ జోడించి తల్లికి నమస్కరించేడు. “ అమ్మా! అలాగే యిప్పుడు నీ మాట వింటాను.” వెనుదిరిగాడు. తల్లి చూపించిన వైపూ, పిల్లలున్న వైపూ నడిచాడు.

ఒక రాతి గుట్టని చేరుకున్నాడు. ఏదో ఒక మహత్తరమైన శక్తి ఆవహించిన వాడిలా అక్కడున్న రెండు పెద్ద పెద్ద గోడ దిమ్మెల్ని ఒక్కవూపుతో పైకి లేపి భుజంతో పక్కకి జరిపాడు. అక్కడ వాటి క్రింద కాస్త విశాలంగా కొంత ఖాళీ స్ధలం వుంది. ఆ స్థలంలో వున్నారు. . . అతడి పిల్లలిద్దరూ రాళ్ళలో కూరుకుపోయి, చావు బ్రతుకుల మధ్య పోరాడుతూ!

ఐదేళ్ళ పాప బొక్క బోర్లా పడి వుంది. ఆమె నడుము మీద ఒకే ఒక నిలువెత్తు రాతి బండ అడ్డంగా పడి వుంది. నడుము దగ్గర శరీరం నలిగిపోయి, వత్తుకుపోయి వుంది. రక్త స్రావం బాగా జరిగినట్టుగా అక్కడ రక్తం ధార కట్టింది. గడ్డ కట్టి వుంది. మూడేళ్ళవాడు బాబు శరీరం మీద ఏ రాతి శకలమూ లేదు. . . ఏదో కొంత మట్టి తప్ప. అయినా తగలాల్సినదేదో అప్పటికే తగిలినట్టు తల దగ్గర గాయమై వుంది.

ఆ ఘోర భయానక దృశ్యం చూడలేక కృష్ణమూర్తి నిట్టనిలువునా కదిలి పోయినాడు. కంపించి పోయినాడు. ముప్పిరిగొన్న శోకంతో, “పాపా! సాహితీ. . నాన్నాఋషీ” గొంతు చిరిగేట్టు అరిచాడు. . . అరిచి, పిలిచాడు.

తండ్రి చివరి చూపుల కోసమే తాము జీవించివున్నట్టు బాబు కళ్లు తెరిచాడు. తండ్రిని చూశాడు. “నిద్రొస్తోంది డాడీ” కళ్లు మూయబోయాడు. మళ్ళీ ఏదో గుర్తుకొచ్చిన వాడిలా కళ్ళు తెరిచాడు. “కొత్త nలాల్చీ తెచ్చావా డాడీ?” అని, “నిద్రొస్తోంది. పొద్దున్న వేసుకుంటాలే” అన్నాడు. కళ్ళు మూతలు పడ్డాయి. . . నిద్ర కోసం. . . నిండైన పరలోక నిద్రకోసం!!

“ఋషీ! నాతండ్రీ!” కృష్ణమూర్తి బాబు శరీరం పైకెత్తి అక్కున జేర్చుకున్నాడు. “నన్నొదిలి నిద్రబోకురా నా కన్నతండ్రీ!” బాబు బుగ్గలూ, నుదురూ పదే పదే ముద్దాడుతూ పిచ్చెత్తిన వాడిలా వూగి పోయినాడు. . . వేసాగి పోయినాడు.

“డాడీ!” ప్రక్కనుండి కేక వినబడింది. వెర్రివాడై అటు చూశాడు. పాప తండ్రిని పిలుస్తోంది. చేతిలోని శవాన్ని అక్కడే వదిలేసి, అటు తిరిగాడు.

“అమ్మా! సాహితీ. . . నాతల్లీ!” ఒక్క వుదుటున వెళ్ళి, తల దగ్గర కూర్చున్నాడు.

“డాడీ! నొప్పి పుడుతోంది డాడీ. ఆ స్టోన్ తీసెయ్. నొప్పి తగ్గుతుంది” అడిగింది పాప.

“అది నేను ఎత్తలేనమ్మా” పాప తల నిమురుతూ, అసహాయుడై వెక్కి వెక్కి ఏడ్చాడు.

“వెయిట్ లిఫ్టు అంత ఈజీగా ఎత్తేస్తావే. ఇది ఎత్తలేవా?” అమాయకంగా అంది.

“లేదమ్మా. . . నిజంగా ఎత్తలేను” అతడికి దుఃఖం అలివికావడం లేదు. బోరుమని ఏడ్చాడు.

“నీవన్నీ అబద్దాలే డాడీ. బొమ్మలన్నీ తమ్ముడికే యిస్తావు. వాడి మీద పడిన రాళ్ళన్నీ తీసేసి వాడిని ఎత్తుకున్నావు. నన్నూ ఎత్తుకో డాడీ. . . ప్లీజ్. . .నిజంగా నొప్పి పుడుతోంది” తమ్ముడు చచ్చిపోయాడనీ, తండ్రి బ్రతికుండీ చచ్చినవాడే అయ్యాడనీ, తెలుసుకోలేని ఆ పసిప్రాణం. . .రెండవ బిడ్డ పుట్టాక మొదటి బిడ్డ మీద తల్లిదండ్రులు చూపే నిరాసక్తతని ఆ సమయంలో కూడా బైట పెట్టింది.

“లేదు తల్లీ. . . నావి అబద్దాలు కావు” ఘూర్ణిల్లుతున్న దుఃఖంతో కృష్ణమూర్తి గుండెలు బాదుకున్నాడు. అలా కొంత సమయం బాదుకుంటూనే వున్నాడు. ఆపైన వున్నట్టుండి ఆగాడు. ఏదో అనుమానం వచ్చిన వాడిలా పాప వైపు భయంగా చూశాడు.

భయం నిజమే అయింది. పాప తల వాల్చేసి వుంది. పాప తలని చేతుల్లోకి తీసుకున్నాడు. “సాహితీ!” పిలిచాడు. సమాధానం లేదు. “అమ్మా. . . సాహితీ!” మళ్ళీ పిలిచాడు. సమాధానమే కాదు. చలనం కూడా లేదు. అర్ధమైపోయింది. అలాగే పాప తలని నేలమీదికి వదిలేశాడు. మౌనంగా అక్కడ్నుంచి లేచాడు. కదిలి, మళ్ళీ తన తల్లి వున్నచోటికి వచ్చాడు. అప్పటికే ఆమె పోయి చాలా సేపయింది. కట్టె బిగుసుకుంటోంది. అదీ చూశాడు. అక్కడ్నుంచి భార్య వైపుకి నడిచాడు. ఆమెని సమీపించాడు. మళ్ళీ తల దగ్గరే కూర్చున్నాడు. తలని ఒళ్ళోకి తీసుకున్నాడు.

“ఏమండీ!” మృత్యుద్వారం వరకూ వెళ్ళి, అక్కడ దేవుడి అనుమతితో తాత్కాలికంగా మళ్ళీ వెనక్కి వచ్చినట్టు, ఆమె బలవంతంగా కళ్ళు తెరుస్తూ పిలిచింది.

“చెప్పు శారదా!” నిర్లిప్తంగా అన్నాడు.

“మీరు. . . మీరు జాగ్రత్త. . . మీ ఆరోగ్యం జాగ్రత్త!” కన్ను మూసింది.

“ఎలా జాగ్రత్త పడనే శారదా నువ్వు లేకుండా” మళ్ళీ గోడు గోడుమని ఏడ్చాడు.

అప్పటికే పొద్దు కృంగింది. ఒక పెంజీకటి ఆ ప్రదేశాన్నీ ఆర్తిగా ఆక్రమించుకో సాగింది.

భార్య శవాన్ని వదిలేసి, కృష్ణమూర్తి లేచాడు. చేతుల్తో తన తల పట్టుకున్నాడు. ఉన్నట్టుండి వంగి, స్వరపేటిక పగిలిపోయేలా బిగ్గరగా ఎలుగెత్తి అరవసాగాడు.
వ్వో. . . వ్వో. . . వ్వో. . . వ్వో. . .
శోకతప్త హృతయంతో విషాదోన్మత్తుడై విలపిస్తున్న అతడి అరుపులు విని, ఆ చీకట్లో ఎవరో వచ్చారు. నాలుగు ఆకారాలు. నలుగురు మనుషులు. ఓదార్చారు. ‘వగపు వలదన్నారు. వెతలు తప్పవన్నారు. మనం మనుషులం. . . మ్రానులమా?’ అన్నారు. ఆపైన ఎవరి దారిన వాళ్ళు వెళ్ళారు.

కృష్ణమూర్తి ఆ రాత్రంతా ఆప్తుల శవాల దగ్గరే కాపు వేశాడు. ఓ బండకి వీపు ఆన్చి జారగిలబడి కూర్చుండి పోయాడు. దూరంగా ఏడ్పులూ, శబ్దాలూ విన్పిస్తూనే వున్నయి. నడి రాత్రయింది. చంద్ర కాంతి శవాల మీద పడి వాటి ఉనికిని తెలియజేస్తోంది. కృష్ణమూర్తి హృదయం శూన్యంగా వుంది. కాలం గతానుగతికం. నిర్విరామం! క్రితంలో బాధ యిప్పుడు లేదు. అంతా పోగొట్టుకున్న వాడిలోని నిశ్చలత్వం. శవాలవైపు చూశాడు. . . నిర్నిమిత్తంగా. . . నిర్నిమేషంగా.

ఎవరు బాంధవులు? ఎవడు ఎవడికి బాంధవుడు. . .?

అసలు నీవెవడవు?

ఒక విడి మానవుడు. . . వేరొక విడి మానవుడికి బంధువా?

అయితే. . . ఆ బాంధవ్యపు గొలుసెక్కడ? ఆ గొలుసే సత్యమైతే. . .నిత్యమైతే. . . ఒకడు పోయినప్పుడు మరొకడు మిగిలివుండడం ఎలా సంభవం? అదే విధం??

కృష్ణమూర్తికి భగవద్గీతలోని ఒక శ్లోక భావం గుర్తుకొచ్చింది.

అవ్యక్తమునందు ఆసక్తమైన మనసుగల వారికి దుఃఖము అధికతరమై వుండును. ఎందుకనగా అవ్యక్తము దేహము కలిగిన వారిచే దుఃఖమునకు గతియై పొందబడుచున్నది!!!
* * *
(సశేషం)

ధ్వజం --2

ఏ దేశ మయితేనేం. . . మానవుడుంటున్న దేశం!
ఏ స్థల మయితేనేం. . . ఇళ్ళూ, భవంతులూ నిర్మించుకున్న స్థలం!!
ఏ మత మయితేనేం. . . అది వైయక్తిక మనస్తత్వ సమ్మతం!!!

అక్కడ. . . ఆ ప్రదేశంలో. . . అప్పుడు. . . ఓ సాయం సంధ్య వేళ. . .

ఆహ్లాదభరితమై సాగిపోతున్న పిట్ట కూనల, పక్షి ప్రౌఢల, కేరింతల త్రుళ్ళింతల క్రిల క్రిల క్రిలా ధ్వానం ఎందుకో లిప్తపాటు ఆగింది. నవనవోన్మేషాల వసంతాల గానం ఏమైందో క్షణం సేపు దాగింది. మహోన్మత్త ముక్త కోకిలా రావం ఏకంగా మాయమే అయింది. ముంచుకొస్తున్న ప్రాకృతిక ప్రళయాన్ని ముందుగానే పసిగట్టిందో యేమో ఓ పక్షి ప్రాణి ‘కీచు’ మని అరిచింది.

అంతే!!

క్షణంలోపు క్షణంపాటు అక్కడ భూమి కదిలింది. . . భూమి కుదిలింది. . భూమి పగిలింది. ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. జరగాల్సింది జరగనే జరిగింది. ఒక కంపనం పెను ప్రకంపనంగా మారి భూకంపమయింది. ప్రళయ కార్యానికి అది కారణభూతమయింది. ఆ మహా ప్రళయాన ఒక సంపూర్ణ రాష్ట్రమే లయమై విలయమయింది. . .విధ్వంసమయింది.

క్షణం నిడివిలో సస్యశ్యామలమంతా శవాల మయమయింది.

ధఢ. . . ధఢ. . . ధఢ. . . ధఢేల్ మను ధ్వనులతో అకాశ హర్మ్యాలే అక్కడ నేల కొరిగాయి. ఘన సుందర సౌధాలే శిధిలాలయాయి. శిధిలాల శకలాలయినాయి. మనుష్యులు మట్టి పాలయ్యారు. శకలాల క్రింది వికలాంగులయారు.

మానవ ప్రాణులు, జంతు ప్రాణులు, పక్షి ప్రాణులు. . . ఒకరేమిటి. . . ఒకటనేమిటి. . . ప్రకృతికి ప్రాణాల హెచ్చు తగ్గుల వివక్ష లేదు. అన్నీ శిధిలాల క్రిందే లెక్క. . . సగం యిరుక్కుని. . . సగం పెరుక్కుని. . . ఖండాలుగా, ఖండ ఖండాలుగా. . . మొండాలుగా. . . “దేవుడా రక్షించ రారమ్మం” టూ, ధీనంగా వేడికొంటూ.

తప్పించుకున్నవాడూ తప్పుకున్నవాడూ ధన్యతములు. చచ్చిన వాడూ ధన్యుడే. . . తప్పుకోనూలేక, చావనూ రాక యిరుక్కుపోయిన వాడే దౌర్భాగ్యుడు.

శిశువులూ, పశువులూ, గర్భిణీ స్త్రీలూ. . . సర్వులూ క్షతగాత్రులే! రాళ్ళ క్రింది క్షతగాత్రులు. అరుపులూ, ఆర్తనాదాలూ, మిన్నంటిన హాహాకారాలూ, మితిమీరిన రోదనలూ. . . ఎన్నని?. . . ఎవ్నరివని?. . . అది జీవన్మరణాల ఘోష! విషాద ప్రాణుల శరణాల భాష!!!

విజ్ఞాన శాస్త్రాలూ. . . రిక్టర్ స్కేళ్ళూ. . . ఎలాస్టిక్ రీ బౌండ్ థియరీలూ. . . ఆకర్షణ వికర్షణ భూ విద్యుచ్ఛాలక బలాల సిద్ధాంత రాద్ధాంతాలూ. . . సర్వం. . . సర్వమూ నిరర్ధకం అయినాయి. ప్రమాద తీవ్రతను ముందుగా పసిగట్టలేకనే పోయాయి. లక్షల శవాల రాసులే. . . రాసుల గణణమే. . . ఆ పైన విపత్తు తీవ్రతకి తార్కాణమయింది.
ఒక మహోపద్రవం. . . ఒక మహా ఉత్పాతం. . . అక్కడ సంభవించిది.

సుసంపన్నమైన, బహు విధమైన ఆ దేశ వారసత్వ సంపద. . . అక్కడ. . . ఆ ప్రాతం వారికి గర్వకారణం కాలేదు. . . బుగ్గి పాలయింది. . . బూడిద పాలయింది. . . భూకంపం పాలయింది.
* * * *
బాబుకి సిల్కులో లాల్చీ ఫైజమా, పాపకి పట్టులో లంగా జాకెట్టూ తీసుకుని కృష్ణమూర్తి షాపులోంచి బయట పడ్డాడు. పార్కింగ్ ప్లేస్ లోంచి కారుని బయటకి తీసి రోడ్డు మీదికి నడిపాడు. అది ఫోర్ లేన్ రోడ్డు. విశాలంగా వుంది. ఒక కిలోమీటరు దూరం కారు అలా ముందుకి నడిచింది.

అంతే!!! అక్కడ భూమి కదిలింది.

ధఢ. . . ధఢ. . . ధఢ. . . ధఢేల్ మను ధ్వనులతో అకాశ హర్మ్యాలే అక్కడ నేల కొరిగాయి. ఘన సుందర సౌధాలే శిధిలాలయాయి.


కారు చిన్నగా ‘జర్కి’చ్చి వూగింది. కృష్ణమూర్తికి మొదట ఏమీ అర్ధం కాలేదు. ఏమైందో తెలుసుకునే లోపే అతడి కళ్ళముందే రోడ్డుకిరువైపులా వున్న భవంతులూ, విద్యుత్ స్తంభాలూ కఠోర శబ్దాలు చేస్తూ కూలిపోసాగాయి. ఆ అకస్మాత్తు ఘటనకి బిత్తరపడి, కృష్ణమూర్తి అప్రయత్నంగానే బ్రేకేసి కారాపాడు. ఏదో భయానక విపత్తు ముంచుకొచ్చిందని తెలుస్తూనే వుంది. కఠోర శబ్ధాల ఆతిధ్వనుల్ని భరించలేక రెండు కళ్ళూ, చెవులూ మూసుకుని నిముషం సేపు స్టీరింగ్ దగ్గర అలాగే భయంతో బిగుసుకు పోయాడు. తర్వాత, కళ్ళు మాత్రమే తెరిచాడు. ఏం జరుగుతుందోనని విండోలోంచి బయటకి చుట్టూ చూశాడు.

అప్పటికే ఎన్నో భవనాలు కూలాయి. కొన్నింకా కూలుతూనే వున్నాయి. కూలిన భవంతుల శిథిలాలు అడ్డంగా పడి రోడ్డుని కప్పేస్తున్నాయి. కూలే మేడల్లోంచి కొన్ని రాళ్లు దొర్లుకుంటూ వచ్చి కారుని తాకుతున్నాయి. ఇళ్ళలోంచి బయటికొచ్చిన వాళ్ళు జనం తలకొక దిక్కుగా, తోచిన విధంగా పరుగులెత్త సాగారు. అప్పటికే మనుషుల కేకలతో అరుపులతో ఆ ప్రాంతం దద్ధరిల్లసాగింది.

కృష్ణమూర్తి అమాయకుడు కాదు. అర్ధమైపోయింది. ఏదో బలీయమైన భూ ప్రకంపనానికి ఆ ప్రదేశం కేంద్ర బిందువైందని తెలిసిపోయింది. ఆ పైన క్షణం కూడా అతడు కాలయాపన చేయలేదు. ఎటూ కారు ముందుకు వెళ్ళే అవకాశం లేదని తెలుసు. అతడి యిల్లు అక్కడ్నుంచి యింకా రెండు కిలోమీటర్ల దూరముంది. క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే డోర్ ఓపెన్ చేసి, బయటికి దూకాడు. దొర్లుకుంటూ రోడ్డు మీద దూసుకొస్తున్న రాళ్ళనీ, రోడ్డుకి అడ్డంగా పడి, ఒకదానికొకటి తగిలి విద్యుత్ చ్ఛటల్ని పుట్టిస్తున్న ఎలక్ట్రిక్ తీగల్నీ, వేటినీ లక్ష్య పెట్టకుండా అతడు తన యింటి వైపుకి పరుగుదీయసాగాడు.

కట్టుకున్న భార్య, కన్నతల్లి, తను కన్న బిడ్డలూ స్మృతిలో మెదిలి, జ్ఞప్తిలో వుండగా, అన్ని అవరోధాల్నీ అవలీలగా దాటుకుంటూ ప్రచండ వేగంతో అతడు యింటి దిక్కుకి దూసుకు పోయాడు.

ధ్వజం -- 1


కృష్ణమూర్తి ఎనభై వేల రూపాయలు దాచుకున్న చిట్ ఫండ్ కంపెనీ వాడు రాత్రికి రాత్రే మూటా ముల్లె సర్దుకుని అర్జంటుగా ఫ్లయిటెక్కి ఫారిన్ వెళ్ళిపోయిన రోజున కృష్ణమూర్తి కొంత అశాంతికి లోనయ్యాడు.

ఆపద సమయంలో నేను అతడికి ఓ మంచి ఓదార్పు ఉపకరణంలా కన్పిస్తాననుకుంటా. ఆ రోజు సాయంత్రం వేళ మా యింటికొచ్చి నాతో ఓ గంటసేపు గడిపాడు.

ఒక ప్రయివేట్ కంపెనీలో అతడు సాఫ్టువేర్ యింజనీరు. నెలకి ముఫై ఐదు వేల రూపాయల జీతం. సొంత యిల్లూ, కారూ వున్నాయి. చక్కటి భార్యాపిల్లలూ, తోడుగా తల్లి. . . మొత్తానికి కృష్ణమూర్తి జీవితం వడ్డించిన విస్తరే! ఓ మూడు నెలల జీతం తనది కాదనుకుంటే అతడికి చిట్ ఫండ్ కంపెనీ వల్ల కలిగిన నష్టం పెద్ద లెక్కలోది కాదు. అయినా ఎందుకో కృష్ణమూర్తి నేననుకున్నదాని కంటే బాగా డీలా పడినట్టు కనిపించాడు. ఆ మాటే అతడి నడిగాను.

“నీకున్న స్టాటస్ కి ఈ ఎనభైవేలొక నష్టమా?” అని.

కృష్ణమూర్తి విరక్తిగా నవ్వేడు. “కాదనుకో” అని, “ఒకదాని వెంట ఒకటిగా ఎప్పుడూ ఏదో కష్టం కలుగుతూ వుంటే ఎంతయినా మనసు బలహీన పడుతుంది మాధవరావ్” అన్నాడు.

“ఇప్పుడేం కష్టాలు కలిగాయని”

“అంతకుముందు నెలలో అమ్మకి అపెండిసైటిస్ ఆపరేషను, క్రిందటి నెలలో పాపకి మలేరియా జ్వరం, ఈ నెలలో యిది. ఎన్నని భరించగలం చెప్పు!” అన్నాడు విసుగ్గా.

కృష్ణమూర్తి అసహనం ఎవరి మీదో నాకర్ధం కాలేదు. మానవ జీవన ప్రయాణ యానంలో అవరోధ ప్రమాదాలెన్ని వుండాలో, అవి నెలకెన్ని వుండాలో, సంవత్సరానికెన్నో. . . వాటి సంఖ్యను నిర్దేశిస్తున్నాడా ఈ కృష్ణమూర్తి? నాకు నవ్వొచ్చింది.

“నీకో విషయం చెప్పనా?” అడిగాను.
“చెప్పు” అన్నాడు.

“నీ కష్టాలు చాలా చిన్నవి. ఆ మాటకోస్తే అవి కష్టాలే కాదు. ఎటువంటి కష్టం అనుభవించిన వాళ్ళున్నారను కుంటున్నావు ఈ లోకంలో?”

“ ఎటువంటి వాళ్ళున్నారు? ”

“పుట్టిన ఎనిమిది మంది బిడ్డలూ ఎనిమిది విధాలుగా తన కళ్ళ ముందరే చనిపోయినా, చివరకంటా తోడు నిలుస్తుందనుకున్న భార్య మతి భ్రమించి మధ్యలోనే పిచ్చిదై పోయినా, ఊరు వూరంతా ఏకమై వూర్నుండి వెలివేసినా. . . అలుపనేది లేకుండా జీవితం జీవించడానికేనన్నట్టు హుందాగా బ్రతుకుతున్న వాళ్ళున్నారు తెలుసా?” అన్నాను.

“ఛీ! వాడెవడో దరిద్రుడు. . .వాడితో నన్ను పోలుస్తావు నువ్వు” ఈసడింపుగా అన్నాడు కృష్ణమూర్తి.

‘ఫెటేల్’ మని గుండెల మీద చరిచినట్టయింది నాకు. . “వాడెవడో దరిద్రుడు” అన్న మాట వినగానే. అతడ్ని వారిస్తూ, ఏదో చెప్పబోయాను.

ఇంతలో నాభార్య కాఫీ తీసుకొచ్చింది. అక్కడ్నుంచి టాపిక్ మారిపోయింది. ఆ తర్వాత కొంత సేపటికి వెళ్ళొస్తానన్జెప్పి కృష్ణమూర్తి లేచి బయట కారు దగ్గరకు నడిచాడు. అంతవరకూ వెళ్ళి అతడిని సాగనంపి, నేను వెనుదిరిగాను. మనసంతా అసంతృప్తిగా తయారైంది.

ఎంతో చెప్పాలనుకున్న వాడికి ఏమీ చెప్పలేకపోయి నప్పుడు కలిగే అసంతృప్తి!!!