ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి,  అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. ."ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల"నీ, "ఒక పూర్తి మానవుడిగా పరిణమించాల"నీ, నేను కంటున్న కల,  కడుతున్న కోట. . .ఒహ్ ఇంతెందుకు కనుచూపు మేరలో. . . నా జీవితం ఒక వేద సంకలనం!!  నేనొక ఈశ్వరుడిని!!! ( ఇది ఈ బ్లాగులోని ప్రసంగి కథలో ఒక పాత్ర మనోభావాలు __ రచయిత )

Saturday, September 1, 2007

రాయస్థాపనాచార్య!.. 3 (కథ)

రాయస్థాపనాచార్య!

(‘స్వాతి’ సపరివార పత్రిక సంచిక 11.07.2003 లో ప్రచురితమైన చారిత్రాత్మక కథ! పాఠకుల మనసులు కలచివేస్తూ, మానవ విలువల్ని సునిశితంగా ప్రశ్నించే కథ యిది! ‘తెలుగు అకాడమీ’ వారెవరైనా పూనుకుని ఈ కథను 6వ తరగతి నుండి 10వ తరగతి లోపు ఏదో ఒక క్లాసులో తెలుగు పాఠ్యాంశంగా దీన్ని మార్చడానికి ప్రయత్నం చేయగలరని ప్రార్థన!)

గుండయనాయకుడు ఆమెను సమీపించి, ఆమె తలపై చేయివేసి మృదువుగా నిమురుతూ, “నాగదేవుడు నిన్ను పెళ్ళాడతాడటగా?” అన్నాడు. కూతురి కళ్ళలో వెలుగు చూడాలన్న ఏదో వెర్రి తలపుతో ఆ మాట అడిగాడే గానీ అతడన్న మాట అతడికే నవ్వు తెప్పించింది.

తండ్రి మాటకి గోపికాపూర్ణిమ సిగ్గుల మొగ్గయింది. నెమ్మదిగా వంగి, తండ్రి పాదాలకి నమస్కరించింది. కనుకొలనుల్లో నీళ్ళు చిప్పిల్లుతుండగా, “తమరి కీర్తి ప్రతిష్టలే కదా నాన్నగారూ! దీనికి కారణం!” అంది.

తర్వాత లేచి, తండ్రి ముఖంలోకి చూడలేక నవ్వింది. ఆపైన సిగ్గుని భరించలేక అక్కడనుండి బయటకి పరుగులు తీసింది. అలా సిగ్గులొలకబోసుకుంటూ పరుగిడుతున్న కుమార్తెని క్షణం సేపు తనివిదీరా చూసుకుని, ఆపైన గుండయనాయకుడు మంచం మీద కూర్చున్నాడు. కుమార్తె పరుపుకింద దాచిన లేఖని తీశాడు. అది గోపికాపూర్ణిమ నాగదేవుడికి రాసిన లేఖ. చదువనారంభించినాడు.

“నా ప్రాణదేవులు నాగదేవుల వారికి,

గోపికా పూర్ణిమ నమస్కృతులు!

మీతో పరిణయం నాలోని ఏకైక స్వప్నం! ప్రభూ! నా స్వప్నం వీడింది. మీ తండ్రి గారు చెప్పి పంపిన శుభవార్తతో అది ఈ నాటికి నిజమై కళ్ళముందు రూపుదాల్చబోతోంది.

మీరు జన్మతః అహింసావాదులని నాకు తెలుసు! అనుక్షణం పుస్తక పఠనంలోనూ, గ్రంథరచన లోనూ కాలం గడిపే సాత్విక స్వభావులనీ తెలుసు. అందుకే మీరంటే నాకు వల్లమాలిన ప్రేమానురాగాలు!

ప్రభూ! మనకి జన్మించబోయే మగ శిశువు మరో సోమనాథ సేనాని కాగలడు. లేదంటే గుండయసేనాని కాగలడు. అదే మా వాళ్ళందరీ అకాంక్ష! కానీ, ప్రభూ. . . మీ వలెనే నాకీ హింసతో ముడిపడిన రాజనీతంటే పడదు.

వచ్చే ఏడాది ఋతుపవనాల నాటికి మనకి జన్మించబోయే సేనాపతుల వంశపు బిడ్డడు అహింసా ప్రభోదకుడై, విశ్వశాంతి కాముకుడై ప్రపంచాన్ని వెలుగువైపు నడిపే మహాపురుషుడు కావాలని కళ్ళముందు మరో స్వప్నాన్ని ఆవిష్కరింపజేసుకుంటూ. . .మీ లేఖ కోసం ఎదురుచూసే. . .

మీ పాదదాసి. . .గోపికాపూర్ణిమ.

చదవడం చాలించి, గుండయనాయకుడు “ఎంత మంచి కలగంటున్నావే నా కన్నతల్లీ! నీ కలను నిజం చేయను నేను నిస్సహాయుడిని. నిర్దయాపరుడినమ్మా! నన్ను మన్నించుమమ్మా!” పరుపుమీద పడి ఏడవసాగాడు.

ఆరోజు సాయంత్రం గుండయనాయకుడు తనే సంతకెళ్ళాడు. అన్నిరకాల తినుబండారాలూ, పండ్లూ, పూలూ, మద్యం అన్నీ ఒక గుర్రపు బగ్గీమీద వేయించి ఇల్లు చేర్పించినాడు. తమ జీవితాల్లో చివరి రాత్రిని చేతనైనంత ఆనందంగా గడిపించదలిచాడు. ఇదేమీ తెలీని అతడి కుటుంబసభ్యులు ‘శుభవార్తలు విన్న సంబరంలో గుండయ అదంతా చేస్తున్న’ట్టుగా భావించారు.

పొంగిపొరలే దుఃఖాన్ని బలవంతంగా అణగిద్రొక్కి ఆరాత్రి గుండయనాయకుడు అందరిచేతా తన చేతుల్తో స్వయంగా తినుబండారాలు తినిపించాడు. తను మాత్రం విషాదం భరించలేక మద్యం సేవించినాడు. ఎన్నడూ చూడని ఆ వింత చూసి నవ్వుకున్నారు అతడి కుటుంబ సభ్యులు.

పరుపులు నేలమీద పరిచి, మధ్యలో తను కూర్చుని చుట్టూరా తల్లినీ, భార్యనీ, కూతుర్నీ, కొడుకునీ అందర్నీ కూర్చోబెట్టుకుని రాత్రంతా వాళ్ల తలలు నిమురుతూ నుదుటిపై ముద్దులు పెట్టుకుంటూ వీలు చిక్కినప్పుడల్లా చాటుకెళ్ళి ఎలుగెత్తియేడ్చి, విలపించి వస్తూ, భయంకరంగా గడిపాడు గుండయసేనాని ఆ రాత్రిని.

రాత్రి మెల్లగా తెల్లవారసాగింది! ఉన్నట్టుండి ఎందుకో అనుమానం వచ్చి బైటకెళ్ళి ఓసారి ఆకాశంవెపు చూసాడు. వేకువచుక్క పొడవనే పొడిచింది! అది చూసి ఒక వెర్రికేక పెట్టాడు గుండయనాయకుడు.

సరిగ్గా అదే సమయానికి ఓరుగల్లుకోట నుండి ప్రమాదసూచకంగా ‘నగారా’ శబ్ధం వినిపించసాగింది.

పరుగు పరుగున వచ్చాడు గుండయనాయకుడు! మళ్ళీ తన స్థానంలో తను కూర్చుంటూ అందరినీ ఒక్కసారిగా రెండు చేతులతో పొదివి పట్టుకున్నాడు. దగ్గరికి చేర్చుకున్నాడు. ఇక దుఖం ఆగలేదు. పెద్దగా పొలికేకలు పెట్టి ఏడ్చాడు. అతడి ప్రవర్తనని చిత్రంగా చూశారు అతడి కుటుంబ సభ్యులు. “ఏం జరిగింద”ని అతడ్ని అడగబోయారు. . .ఆ చివరి క్షణంలో!

అంతే! ప్రశ్న ప్రశ్నగానే కంఠంలో మిగిలిపోయింది!

‘ధగ్గు’మన్న ఒకే ఒక్క కఠోర శబ్ధంతో, భయోత్పాతమైన వెలుగు, విద్యుచ్ఛటలతో అక్కడ మంటలు వ్యాపించుకున్నాయి. ‘ధఢ ధఢ ధణేల్’ మన్న వికృత శబ్ధాలతో ఆ ఇల్లు నిలువునా కూలిపోయింది. అరక్షణంలో అయిదు ప్రాణాలూ అనంతవాయువుల్లో కలిసిపోయాయి.

రత్నగిరి కొండపైన వున్న అయిదొందల కుటుంబాలూ అగ్నికి ఆహుతయినాయి. దేవగిరి శత్రుసైన్యాలు ప్రాణాలు వదిలి పైనున్న దేవగిరికి ప్రయాణం కట్టాయి. రత్నగిరి మొత్తం సర్వం. . .సర్వ నాశనమయిపోయింది!

ఆ తర్వాత, రుద్రమదేవి తనపై దండైత్తి వచ్చిన యాదవ మహదేవరాజుని దేవగిరి దాకా తరిమి తరిమికొట్టింది. అతడు చేసిన తప్పుకి అతడి చేత కప్పం కట్టించుకుని మరీ వదిలిపెట్టింది. తర్వాత, విధ్వంసమైన రత్నగిరిని సందర్శించి సభను సమావేశపరిచి ఈ విధంగా అన్నది.

“రాయస్థాపనాచార్య గుండయ సేనాని జీవిత వృత్తాంతం శాసనబద్దం చేయండి! ఆ మహానుభావుడి కీర్తినీ, త్యాగాన్నీ రత్నగిరి శాసనం (కల్పించబడింది) పేరిట వివరంగా లిఖించండి. గుండయనాయకుడి జీవితమే రత్నగిరి శాసనం కావాలి!”

( సమాప్తం )

0 అభిప్రాయాలు: