ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి,  అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. ."ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల"నీ, "ఒక పూర్తి మానవుడిగా పరిణమించాల"నీ, నేను కంటున్న కల,  కడుతున్న కోట. . .ఒహ్ ఇంతెందుకు కనుచూపు మేరలో. . . నా జీవితం ఒక వేద సంకలనం!!  నేనొక ఈశ్వరుడిని!!! ( ఇది ఈ బ్లాగులోని ప్రసంగి కథలో ఒక పాత్ర మనోభావాలు __ రచయిత )

Saturday, May 3, 2008

విరామం!

వ్యక్తిగతమైన, వృత్తిపరమైన కారణాల వల్ల ఓ ఇరవైరోజులపాటు నేను బ్లాగ్విరామం తీసుకుంటున్నాను. దయతో ఆదరించగలరని ప్రార్థిస్తున్నాను. అలాగే "గ్లోబల్ వార్మింగ్" ప్రమాదం దృష్ట్యా మనకోసం, మన పిల్లల భవిష్యత్తుకోసం ఈ రోజు సాయంత్రం 7-30 నుంచి 8-30 మధ్య "ప్లగ్ ఆఫ్" కార్యక్రమంలో పాలుపంచుకోవలసిందిగా నేను చదువరులందరినీ వేడుకుంటున్నాను.


Thursday, April 3, 2008

స్వర్గారోహణం... 3 (జానపద కథ)

(‘స్వాతి’ సపరివార పత్రిక 06-09-2002 సంచికలో ప్రచురించబడిన నా ‘జానపద’ కథ. పాత కాలం చందమామలోని కథల్లా ‘స్నేహం’ విలువను విడమరచి చెప్పే కథ యిది. వాస్తవానికి ఈ కథను శ్రీమతి వలబోజు జ్యోతి గారు ‘స్నేహం’ సబ్జెక్టు మీద బ్లాగు రాయమన్నప్పుడు నేను రాయవలసినది. కానీ, అప్పట్లో రాయలేక పోయాను. చదివి మీ అభిప్రాయాలూ తెలుపవలసిందిగా ప్రార్థన)

స్వర్గారోహణం (జానపద కథ)

అరివీరషండులు, నిర్మూలనోద్దండుల, దోర్దండులు, ఉద్దండులు, మణిమండితులు, మేరు సమాన ధీరులన్నట్టుగా వీర పురుషులతో, యోధులతో, యుద్ధపరాక్రమ ధీరులతో త్రిపురాపుర మహానగరం అంతా కోలాహలంగా వుంది. దేశం నాలుగు మూలల నుండీ స్వయంవర పోటీల్లో పాల్గనదలచి వచ్చిన వీరులలో పోటీలకి ప్రాథమికంగా నూట తొమ్మిదిమంది ఎంపికయ్యారు.

మల్లయుద్ధం, విలువిద్య, ఖడ్గవిద్య మొత్తం మూడు విభాగాలలో ఎంపికయిన వ్యక్తులు తమ ప్రతిభా పాటవాలు చూపించుకోవలసివుంటుంది. పోటీలు దశలవారీగా ప్రారంభమయినాయి.

మొదటిరోజు సాయంత్రం పోటీల తంతు ముగిసేసరికి సగానికి పైగా ఓడిపోయిన వీరులు తమ ఊర్లకి తిరుగు ప్రయాణం కట్టారు. మూడవరోజుకి ఐదింట నాలుగు వంతులు తప్పుకున్నారు. ఐదవరోజుకి అంతా ఓటమి చవిచూసి, విక్రమ, పరాక్రములిద్దరే మిగిలారు. అంటే చివరగా వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు పరస్పరం తలపడాల్సి వుంటుందన్నమాట. గెలిచిన వారిని రాకుమార్తె విద్యుల్లత పరిణయమాడుతుంది.

రాజ్యంకోసం, యువరాణి కోసం తామిద్దరూ పోటీ పడాల్సిన దౌర్భాగ్య స్థితి ఎదురైనందుకు విక్రమ, పరాక్రములిరువురూ చాలా ఆవేదనకి గురయినారు. కలత చెందారు. అయినా తప్పదు. పోటీ పడవలసినదే.

అంతదాకా వచ్చాక వెనక్కి తగ్గడం ధర్మంకాదు. ఎందుకంటే దేశం యావత్తూ తామిద్దరి చండపోరాటం కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తోంది.

ఆ రోజు ఆరవ రోజు. ఆ రోజు విక్రమ, పరాక్రములిద్దరికీ రాజకోటలో సభామధ్యంలోనే పోటీలకి ఏర్పాట్లు చేయబడ్డాయి. ఆ మహావీరుల యుద్ధనైపుణ్యం వీక్షించడానికి ఆరోజు మహారాజు, మహారాణి, రాకుమార్తె, మహా మాంత్రికుడు చతురాక్షుడు, ఇతర అస్థాన ప్రమఖులు అందరూ సభకి హాజరయినారు.

మొదట మల్లయద్ధం పోటీ జరిగింది. ఉరోవపట్టు, శ్రోణీయపట్టు, ఊరువుల పట్టు, ఆసనం పట్టు, కంఠబిగి, శిరోబిగింపు, గిరవాటు వీటన్నింటిలోనూ విక్రమ, పరాక్రములు సమవుజ్జీలుగా నిర్ణయింపబడ్డారు.

తర్వాత విలువిద్య పోటీ జరిగింది. చలన కౌశలం, బిందు కౌశలం, స్తంభకౌశలం, ఫలఖండనం, శబ్దభేది- అన్ని విలువిద్యా మెళకువల్లోనూ విక్రమ, పరాక్రములిద్దరూ మళ్ళీ సమవుజ్జీలుగా నిర్ణయింపబడ్డారు.

ఇక మిగిలింది ఖడ్గవిద్య. అదే వారిలో అసలు వీరుడిని తేల్చి చెప్పే చివరి పరీక్ష. రాకుమార్తె చేతిలో పుష్పమాల ధరించి దాంతో వీరాధివీరుడి మెడని అలంకరింపజేయడానికి సిద్ధమయింది. చతురాక్షుడు ఒక విషం పూసిన చిన్న పిడిబాకుని బొడ్లో దోపుకుని గెలిచిన వీరుడిని వెనకనుండి పొడిచి చంపడం కోసం సంసిద్ధమయ్యాడు. మహారాజు, మహారాణి ఏం జరుగుతుందోనని ఆందోళనగా ఎదురుచూడసాగారు.

పోటీ ప్రారంభమైంది. పోటీ రెండు విడతలుగా వుంటుంది. మొదటి విడత పోటీ పూర్తయ్యేసరికి విక్రముడికి ఒక విషయం అర్థమయింది. అది- ఖడ్గవిద్యలో పరాక్రముడు తనంత నిపుణుడు కాదన్న విషయం. విక్రముడు తలుచుకుని వుంటే మొదటి విడతలోనే పరాక్రముడిని అవలీలగా ఓడించివుండేవాడు.

కానీ, అందుకు అతడి మనసు అంగీకరించలేదు. ఖడ్గవిద్యంటే శత్రువుని వధించాలి. కాదంటే శత్రువు కాలో చెయ్యో నరికి కనీసం వికలాంగుడినైనా చేయాలి. ఆ రెండు పన్లూ చేయడానికి విక్రముడు సిద్ధంగా లేడు.

అడవిలో ఆటవికుల వలలో తను పట్టుపడ్డప్పుడు ప్రాణాలు ఫణంగా పెట్టి తనని బ్రతికించి తెచ్చుకున్న మిత్రుడు పరాక్రముడు. అటువంటివాడికి హాని తలపెట్టి తను బాహ్యంలో రాకుమార్తెని సాధించినా, రాజ్యాన్ని సాధించినా అంతరంగంలో మాత్రం వట్టి దౌర్భగ్యుడి కిందే లెక్క. అటువంటి భావంలో తను జీవించలేడు. అందుకే ఒక నిశ్చయానికి వచ్చాడు.

రెండవ విడత పోటీ ప్రారంభం కాగానే పరాక్రముడితో మెల్లగా కత్తియుద్దం చేస్తున్నట్టుగానే నటిస్తూ ఒకానొక అనుకూలమైన సమయం రాగానే పరాక్రముడి కత్తిదెబ్బ ధాటికి తన చేతిలో కత్తి జారిపోయినట్టుగా అలవోకగా కత్తి మొన పైకి వచ్చేట్టు నేలమీదికి కత్తిని జారవిడిచి, వున్నట్టుండి ఎగిరి ఆ కత్తి మొనమీద తన కడుపు ఆనేలా పడిపోయాడు. అంతే. క్షణంలో విక్రముడి కత్తి అతడి కడుపుని చీల్చుకుని వెన్నులో నుంచి బయటకొచ్చింది. రక్తం చివ్వున పైరి విరజిమ్మింది.

ఆ హఠాత్పరిణామానికి స్తబ్దుడైపోయాడు పరాక్రముడు. విక్రముడు ఎంత నేర్పుగా ఓడినట్టు నటించినా అది కావాలనే ఓడినట్టు అందరికీ తెలుస్తూనే వుంది.

“విక్రమా ఎందుకు చేశావీ పని? నన్ను చంపలేక కదూ?” పరాక్రముడు నేలమీదున్న విక్రముడిని సమీపించి, అతడి తలని తన ఒడిలోకి తీసుకుంటూ అడిగాడు. అతడి కళ్ళు ధారాపాతంగా వర్షించసాగాయి.

“లేదు. ఓడాను.” అన్నాడు విక్రముడు మైకంతో కళ్ళు మూసుకుపోతుండగా.

“కాదు. నాకోసం కావాలనే ఓడావు. నువ్వే మహావీరుడివి. నీకు అక్కరలేని రాకుమార్తె నాకూ అక్కరలేదు.” పరాక్రముడు తన చేతిలోని కత్తితో తను కూడా పొడుచుకోబోయాడు.

ప్రచండ వేగంతో అక్కడికి పరుగుపరుగున వచ్చాడు మహారాజు. పరాక్రముడి చేతిలోని కత్తిని చటుక్కున లాక్కున్నాడు. “వలద”ని వారించాడు.

విక్రముడు మూసుకుపోతున్న కళ్ళు బలవంతంగా తెరిచాడు. “పరాక్రమా! దేశంలోకెల్లా వీరాధివీరుడిని నేనే. కానీ, నీ లోపలి మంచిమనసు చూపించి నన్నే ఓడిపోయేట్టు చేసిన నువ్వు నిజంగా నా కన్నా చాలా గొప్పవాడివి. కనుక ఆత్మహత్యా ప్రయత్నాలు మాని మనస్ఫూర్తిగా రాకుమార్తెని స్వీకరించు!” చెప్పి, మిత్రుడి ఒడిలో కన్ను మూశాడు విక్రముడు.

అక్కడ చూస్తున్న వాళ్ళంతా “అదే నిజమ”న్నారు. “అంతటి వీరాధివీరుడి మనసు దోచుకున్న పరాక్రముడు అతడికంటే నిజంగా అధికుడేన”న్నారు. “ఒకవేళ పరాక్రముడు గనుక ఆత్మహత్యతో మరణిస్తే విక్రముడు చేసిన త్యాగానికి అర్థం లేద”న్నారు.

దేశంలోకెల్లా వీరాధివీరుడు మరణించాడన్న విషయం తెలియగానే ఉలిక్కిపడి, “ఆ!” అంటూ గబుక్కున కూర్చున్న ఆసనంలోంచి ఆతృతగా పైకి లేచాడు చతురాక్షుడు. ఆ తొందరలో బొడ్లో దోపుకున్న విషపుకత్తి బొడ్డు దగ్గర కొద్దిగా చర్మంలోకి దిగింది.

అంతే. ‘ధభేలు’న నేలమీదపడి గిలగిల తన్నుకుంటూ క్షణంలో ప్రాణాలు వదిలాడు చతురాక్షుడు.

‘దేశంలోకెల్లా వీరాధివీరుడు ఏ కారణంవల్ల మరణించినా వెంటనే చతురాక్షుడు మరణిస్తాడ’ని ఆనాడు కాళికాదేవి అన్న మాటలు నిజమయ్యాయి.

ఆ తర్వాత, కొంతసేపటికి రాకుమార్తె పరాక్రముడి మెడలో పుష్పమాల వేసి, అతడ్ని పరిణయమాడింది. విషాదపూరిత మానసంతోనే రాకుమార్తె వేలికి అంగుళీయకం తొడిగాడు పరాక్రముడు.

అప్పుడడిగాడు మహారాజు రాకుమార్తెని. “అమ్మా విద్యుల్లతా! అనాడు సమాలోచనా మందిరంలో మహామాంత్రికుడిని చూసి ఎందుకు నవ్వావు?” అని.

రాకుమార్తె మళ్ళీ చిరునవ్వు నవ్వి, తర్వాత అంది.

“చతురాక్షుడితో దేశంలోకెల్లా వీరాధివీరుడిని చంపమన్నది కాళికాదేవి. చతురాక్షుడు కూడా ఈ దేశ పౌరుడే గనుక దేశంలోకెల్లా వీరాధివీరుడంటే చతురాక్షుడికన్నా కూడా వీరుడేగదా. అటువంటప్పుడు చతురాక్షుడు తనకన్నా వీరుడిని ఎన్నటికీ చంపలేడు- కనీసం వెనకనుండి కూడా. అదే కాళికాదేవి సంకల్పం.”

(సమాప్తం)