ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి,  అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. ."ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల"నీ, "ఒక పూర్తి మానవుడిగా పరిణమించాల"నీ, నేను కంటున్న కల,  కడుతున్న కోట. . .ఒహ్ ఇంతెందుకు కనుచూపు మేరలో. . . నా జీవితం ఒక వేద సంకలనం!!  నేనొక ఈశ్వరుడిని!!! ( ఇది ఈ బ్లాగులోని ప్రసంగి కథలో ఒక పాత్ర మనోభావాలు __ రచయిత )

Wednesday, April 2, 2008

స్వర్గారోహణం... 2 (జానపద కథ)

(‘స్వాతి’ సపరివార పత్రిక 06-09-2002 సంచికలో ప్రచురించబడిన నా ‘జానపద’ కథ. పాత కాలం చందమామలోని కథల్లా ‘స్నేహం’ విలువను విడమరచి చెప్పే కథ యిది. వాస్తవానికి ఈ కథను శ్రీమతి వలబోజు జ్యోతి గారు ‘స్నేహం’ సబ్జెక్టు మీద బ్లాగు రాయమన్నప్పుడు నేను రాయవలసినది. కానీ, అప్పట్లో రాయలేక పోయాను. చదివి మీ అభిప్రాయాలు తెలుపవలసిందిగా ప్రార్థన)

స్వర్గారోహణం (జానపద కథ)

మహారణ్యంలో విక్రమ, పరాక్రముల ప్రయాణం ప్రారంభమై రెండు రోజులైంది. రాను రాను అరణ్యం దట్టంగా వుంది. కీటకాల్ని, సర్పాల్ని, క్రూరమృగాలని తప్పించుకుంటూ ఆ రోజు మధ్యాహ్నం భోజనాల వేళకి అడవిలో ఒక కొలను వున్న ప్రదేశానికి చేరుకున్నారు వాళ్ళిద్దరూ.

భోజనం చేయడం కోసం ఓ పెద్ద చెట్టు కిందికిచేరి, వెంట తెచ్చుకున్న ఆహారం మూటలు విప్పారు. మంచినీళ్ళ కోసం ఖాళీ అయిన మట్టిపాత్రను తీసుకుని కొలను వద్దకి వెళ్ళాడు విక్రముడు.

కొలను సమీపిస్తున్నప్పుడు- నీరు ఇక రెండు గజాల దూరంలో వుందనగా నేల మీద దారికి అడ్డంగా కట్టివున్న ఒక ఇనుపతీగ ఏదో విక్రముడి కాలికి తగిలింది.

అంతే. ఏం జరిగిందోగానీ ‘ఫట్’ మన్న శబ్దమైంది. క్షణంలోపు విక్రముడు ఒక ఇనుపతీగల వలలో ఇరుక్కుపోయాడు. చిక్కుకుపోయాడు. ఎవరో ఆటవికులు ఏర్పాటు చేసిన వలలో తను చిక్కుకుపోయాడని అతడికి వెంటనే అర్థమైంది.

“పరాక్రమా! మరుక్షణం కేకపెట్టాడు విక్రముడు. పరాక్రమా పారిపో. ఇక్కడ ప్రమాదం పొంచి వుంది. ఇటువైపు రాకు.” అంటూ పరాక్రముడికి తెలిపాడు.

ఆ కేకవిని కూడా అక్కడికి పరుగుపరుగున వచ్చాడు పరాక్రముడు. జరిగిన ఉపద్రవం చూసాడు. ఒరలోంచి ఖడ్గాన్ని తీసి ఇనుపతీగల వలని ఛేదించబోయాడు.

“వద్దు పరాక్రమా వెళ్ళిపో. నువ్వైనా తప్పించుకో. ఇది ఆటవికులు పన్నిన వల. వాళ్ళు చాలా అనాగరికులు. నాగరికులంటే వాళ్ళకి గిట్టదు. వచ్చారంటే ఇద్దర్నీ కలిపి చంపేస్తారు. దురదృష్టం. నేనెటూ చావక తప్పదు. బయట వున్నవాడివి నువ్వైనా వాళ్లు వచ్చేలోపు ఇక్కడ్నుంచి వెంటనే వెళ్ళిపో.” విక్రముడు అరిచాడు.

పరాక్రముడు అతడి మాటలు పట్టించుకోలేదు. ఖడ్గంతో వలని కత్తిరించడానికి ప్రయత్నించాడు. సాధ్యంకాలేదు. చేసేదేమీలేక నిస్సహాయంగా వుండిపోయాడు.

“చెప్పానుగా అదిరాదు. దయచేసి వెళ్ళు పరాక్రమా. త్వరగా వెళ్ళి ప్రాణాలు కాపాడుకో.” విక్రముడు బ్రతిమాలాడు.

అయినా పరాక్రముడు అక్కడినుండి వెళ్ళలేదు. కొద్దిసేపు ఆలోచించాడు. తర్వాత ఒక నిశ్చయానికి వచ్చిన వాడిలా. . .

“చూడు విక్రమా. స్వయంవరానికి వెళ్ళాలనుకున్నాం. కలిసివచ్చాం. కానీ, మధ్యలో నీకు ప్రమాదం ఎదురైంది. వీలైతే ఆటవికుల్ని ఒప్పించో, ఓడించో ఇద్దరం కలిసే స్వయంవరానికి వెళదాం. లేదంటే కలిసే చనిపోదాం. అంతేగానీ ఆపదలోవున్న మిత్రుడిని వదిలి, ఆడదాని కోసం పరుగులు తీయడం వీరుని లక్షణం కాదు. అసలది మానవ లక్షణమే కాదు.” అన్నాడు

“లేదు పరాక్రమా. దయచేసి నా మాట విను. చక్కని జీవితం. చేజేతులా నాశనం చేసుకోకు. వెళ్ళు.” అంటూ విక్రముడు చేతులు ఎత్తి దణ్ణం పెట్టాడు.

తన నిర్ణయం మారదన్నట్టుగా అడ్డంగా తలాడించాడు పరాక్రముడు. మెల్లగా రెండడుగులు ముందుకు నడిచి, అక్కడ వున్న ఒక బండరాతి మీది కూర్చున్నాడు. అటవికుల రాకకోసం నిరీక్షించసాగాడు.

విక్రముడికి ఏం చేయాలో తోచలేదు. అందుకే భయపెడ్తున్నట్టు నేర్పుగా అడిగాడు. “అసలు నువ్వు స్వయంవరానికని వచ్చావా? స్వర్గారోహణకని వచ్చావా?”

ఆ మాటలు విని పరాక్రముడు చిన్నగా నవ్వాడు. విక్రముడిని సూటిగా చూస్తూ, “ఫర్లేదులే. నువ్వెక్కడికి వెళితే అక్కడికనే నేనూ వచ్చా.” అని అన్నాడు.

* * *

అది గూడెం కొలువుదీరే చోటు!

ఆరోజు అక్కడ గూడెంలోని ఆటవికులంతా వృత్తాకారంలో గుమిగూడారు. అందరి ముఖాల్లోనూ ఉత్కంఠ కన్పిస్తోంది. ‘ఎవరో నాగరికులు ఇద్దరు పట్టుబడ్డారు.

వాళ్ళకి ఏ శిక్ష విధిస్తాడో తమ దొర.’ అందరి మనసుల్లోనూ ఇదే ప్రశ్న.

అక్కడ వాళ్ళ మధ్య ఒక ప్రత్యేక ఆసనం మీద గూడెం దొర కూర్చుని వున్నాడు. నల్లగా నిగనిగలాడే భారీకాయం. అంతకుమించి కండలు తిరిగిన శరీర సౌష్టవం. దొర పక్కనే దొరసాని కూర్చుని వుంది. వాళ్ళ ముందు విక్రమ, పరాక్రములిద్దరూ నిల్చుని వున్నారు. వాళ్ళ చేతులు రెండూ వెనక్కి విరిచి కట్టబడివున్నాయి.

“దొరా. ఈడు వల్లో సిక్కిండు. ఈడు వల బైట కూసోనుండు.” చెప్పాడు విక్రమ, పరాక్రముల్ని అక్కడికి తీసుకువచ్చిన ఆటవికుల్లో ఒక వ్యక్తి.

దొర చేతిలో వున్న మట్టిపాత్రలోని ఈతకల్లు కొద్దిగా తాగి, పాత్ర పక్కన పెట్టాడు. కళ్ళు చింతనిప్పుల్లా ఎర్రగా వున్నాయి. దగ్గి, గొంతు సవరించుకున్నాడు.

“ఏం బిడ్డా గూడెంలోకెందుకొచ్చినారు?” అడిగాడు.

జరిగిందంతా పదినిముషాలపాటు వివరించి చెప్పాడు విక్రముడు. ‘స్వయంవరానికి వచ్చిన తాము తెలీక వాళ్ళ గూడెం పరిధిలోకి వచ్చామని చెప్పాడు. తమ తప్పేమీ లేద’న్నాడు. ‘ఒకవేళ తప్పు ఏదైనా వుంటే వలలో చిక్కుబడ్డది తను గనుక తనని శిక్షించి, పరాక్రముడిని విడిచిపెట్టమ’ని వేడుకున్నాడు.

అంతా విని, “భలే నేస్తంకట్టినార్రా. దొర నవ్వాడు.” తర్వాత పరాక్రముడి వైపు తిరిగి, “ఏం బిడ్డా నేస్తాన్ని వల్లో వదిలెల్లడానికి పాణం పీకిందా?” అడిగాడు.

‘అవున’న్నాడు పరాక్రముడు.

“ఎళ్ళిపోడానికి నీకు వీలుంటే ఎందుకెళ్ళలే. నీకు తెలివితేటల్లేవ్. తెలివుంటే అప్పడే ఎళ్ళేవోడివి.”

“తెలివితేటలుంటే అది స్నేహం కాదు దొరా. వ్యాపారమవుతుంది.” అన్నాడు పరాక్రముడు.

“నేస్తం కట్టడానికి తెలివెందుకంటావ్. మనసుంటే సాలంటావు. మనసుండి నేస్తాన్ని కాపాడుకోను నువ్వంత మొనగాడివా.?” కాస్తంత కోపంగా అన్నాడు దొర.

“మొనగాడినని కాదు దొరా. మేం ఏ తప్పూ చేయలేదు. అలాంటప్పుడు వీలున్నా నేనెందుకు పారిపోవాలి? అసలు నా స్నేహితుడైనా ఎందుకు శిక్షించబడాలి? నాకంటే మించి అతడు చేసిన తప్పు కూడా ఏమీ లేదు. నీళ్ళ కోసం వెళ్ళి మీ వలలో చిక్కాడు. అంతేగదా?”

“మాటలు నేర్చినావురా బిడ్డా. ఇప్పుడు నిన్నొదిలేత్తాం. ఎళ్తావా?” దొర అడిగాడు.

‘వెళ్ళన’న్నట్టు తల అడ్డంగా వూపుతూ, “ఒక్కడినే వెళ్లి ప్రాణాలు దక్కించుకోవాలనే ఉద్దేశ్యమే వుంటే అప్పుడే పారిపోయేవాడ్ని. వెళ్ళను.” అన్నాడు పరాక్రముడు.

“భళిరా బిడ్డా. నేస్తమంటే నువ్వేనురా. ఇప్పుడు మేం మిమ్మల్నిద్దర్నీ కలిపి సంపేత్తానో?” అడిగాడు

“చావం. ఊపిరివున్నంత వరకూ ఇరువురం కలిసే పోరాడుతాం. చేతకానప్పుడు కలిసే చనిపోతాం.” దృఢంగా పలికాడు పరాక్రముడు.

“ఆ!. బిరుసున్నవోడివే. చేతులు కట్టేసినాం. ఏం పోరాడుతావ్. చేతులిక్కట్లిప్పుతాం. నాతో చెయ్యి కలుపుతావా?” దొర పిడికిలి పైకెత్తి తన బలం చూపిస్తూ అన్నాడు. మళ్ళీ “దైర్నముందా?” అడిగాడు.

పరాక్రముడు క్షణం ఆలోచించి తర్వాత అన్నాడు.

“క్షమించండి దొరా. పెద్దవారు. తమతో నాకే శత్రుత్వమూ లేదు. తమరితో యుద్ధం చేయడానికి నా మనసు ఆంగీకరించడం లేదు. కానీ, మమ్మల్ని విడిచిపెట్టడానికి బదులుగా మీరు విధించే షరతు అదే అయితే, తప్పనిసరైతే నేను సిద్ధమే. మీతో చేయి కలుపుతా.”

“ఔరౌరా! ఎంతమాట.” అపచారం జరిగిందన్నట్టుగా నోటిమీద చేతులేసుకున్నారు గూడెం ప్రజలు.

“దొరతోనే యుద్ధం చేత్తాడంట. పదిమందిని ఒక్కసారే సంపేత్తాడు దొర.” అన్నారెవరో ఆ గుంపులోనుండి.

“ఈడికి మూడింది. దొరతో చెయ్యి గలుపుతాడంట. ఆ చెయ్యి ఇరగదీసేత్తాడు దొర.” అన్నారింకెవరో.

క్షణంసేపు అక్కడ నిశ్శబ్దం తాండవించింది. అంతా దొర తీసుకోబోయే నిర్ణయం కోసమని ఎదురుచూడసాగారు.

నిముషం తర్వాత పెద్దగా నవ్వాడు దొర. “లెస్స బలికేవురా వీరుడా. నన్ను మెప్పించావు. పిల్లకాకివి. నాతోనే తలపడతానన్నావు. అదే నీ గెలుపు.” ఆసనంలోంచి దొర లేచి వచ్చాడు.

విక్రమ, పరాక్రములున్న చోటికి వచ్చి వారి చేతులుకున్న కట్లు స్వయంగా తన చేతుల్తోనే విప్పి, తొలగించాడు. వాళ్ళని ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు.

మళ్ళీ విక్రముడి వైపు తిరిగి, “మంచి నేస్తాన్ని సాధించినావు బిడ్డా. నీకు జయమవుద్ది. మంచోళ్ళని మేం సంపం. నేస్తాలకి పాణమిచ్చుకునే వాళ్ళని మేం సంపితే మా దేవత మమ్మల్ని సంపుద్ది. ఎళ్ళండి. మీకు జయమవుద్ది. రాజుబిడ్డ మీ ఇద్దరిలో ఒకరికి సిక్కుద్ది.” అన్నాడు.

ఆ మాట వినగానే విక్రమ, పరాక్రముల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. దొర పాదాలకి ప్రణమిల్లుతూ, “పెద్దమనసు నీది. మమ్మల్ని దీవించు దొరా!” అన్నారు.

“దేవత మిమ్మల్ని సూసింది బిడ్డా. మీకు జయమవుద్ది. రాజు బిడ్డని మనువాడినాక ఓపారి ఆయమ్మను తీసుకుని మా గూడెంకి రాండి. మా దేవతకి మొక్కుకోండి. అంతా మేలవుద్ది.” దొర దీవించి చెప్పాడు.

విక్రమ, పరాక్రములిద్దరి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

* * *

(సశేషం)

0 అభిప్రాయాలు: