ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి,  అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. ."ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల"నీ, "ఒక పూర్తి మానవుడిగా పరిణమించాల"నీ, నేను కంటున్న కల,  కడుతున్న కోట. . .ఒహ్ ఇంతెందుకు కనుచూపు మేరలో. . . నా జీవితం ఒక వేద సంకలనం!!  నేనొక ఈశ్వరుడిని!!! ( ఇది ఈ బ్లాగులోని ప్రసంగి కథలో ఒక పాత్ర మనోభావాలు __ రచయిత )

Tuesday, October 23, 2007

కోతికీ మనిషికీ భాష్యం చెప్పిన భాష!

కోతికీ మనిషికీ భాష్యం చెప్పిన భాష!

ఈ పరిశోధన చాలా ఇంటరెస్టింగ్ గా వుంటుంది. ఇది నేను చదివిన విషయమూ, నేను పరిశోధించిన విషయమూ కాదు. చిన్నప్పుడెప్పుడో నా తండ్రి నాకు చెప్పిన ఉదంతాన్ని ఇక్కడ రాస్తున్నాను. ఎవరైనా ఆ శాస్త్రవేత్త పేరుగానీ, అసలు ఉదంతం గానీ తెలియజేయగలిగితే సంతోషిస్తాను.

పరిణామక్రమంలో కోతి నుండి మనిషి ఉద్భవించాడని మనం విన్నాం. అదే శాస్త్రీయం అన్నట్టుగా నమ్ముతున్నాం కూడా. అది నిజమో కాదో ఆ విషయం కాసేపు పక్కన పెడదాం. కాకుంటే. . .కోతి నుండి మనిషిని దూరం చేస్తున్నదేమిటో, అసలు కోతికీ మనిషికీ వున్న వ్యత్యాసం, తేడా ఏమిటో తెలుసుకుందాం. మనం తెలుసుకోవడం కాదు. ఒక సైంటిస్టు చేసిన పరిశోధన గురించి తెలుసుకుందాం.

ఈ విషయం తెలుసుకోవడానికే ఒక శాస్త్రవేత్త (పేరు తెలీదు) ప్రయత్నించాడు. అందు నిమిత్తం ఓ కోతిని మచ్చిక చేసుకున్నాడు. దానికి ‘రొటీన్’ గా చేసుకుపోయే కొన్ని పన్లు నేర్పించాడు. అందులో ఓ పనిని కోతి చేత బాగా ‘ప్రాక్టీస్’ చేయించాడు. అదేమిటంటే. . .

ముందుగా అతడు తన కార్లో కొన్ని చితుకులు అంటే ఎండిపోయిన ఆకులూ, పుల్లలూ లాంటివి కొన్ని, అలాగే ఒక కుండ (లేదంటే కుండ లాంటి పాత్ర అనుకోండి), ఆ కుండ నిండా నీళ్ళు, కుండపైన మూత, ఒక నీళ్ళు తాగే గ్లాసు, మరో అగ్గిపెట్టె సిద్ధం చేసుకునేవాడు. కార్లోనే రోజూ ఆ కోతిని ఓ నిర్జన ప్రదేశానికి తీసుకు వెళ్ళేవాడు. అక్కడ ఒక ఖాళీ ప్రదేశంలో తను తెచ్చుకున్న ఆ చితుకుల్ని వెదజల్లేవాడు. అక్కడే పక్కగా ఓ చోట నీళ్ళకుండని ఉంచి దానిపైన మూతనీ, ఆ మూతమీద గ్లాసునీ వుంచేవాడు. కుండ పక్కనే అగ్గి పెట్టెని వుంచేవాడు.

ఇక కోతి చేయవలసిన పని. శాస్త్రవేత్త వెదజల్లిన చితుకుల్ని అన్నింటినీ వేరుకుని వచ్చి ఒక చోట కుప్పగా చేర్చాలి. ఆపైన అగ్గిపెట్టె తీసుకుని, వెలిగించి ఆ చితుకులకి నిప్పుంటించి మండేట్టు చేయాలి. ఆ తర్వాత, కుండ దగ్గరకి వెళ్ళి కుండమీద గ్లాసు తీసుకుని, కుండ మూత తీసి, అందులోంచి గ్లాసుతో నీళ్ళు ముంచి తీసుకువెళ్ళి మండుతున్న చితుకుల మీద నీళ్ళు పోసి ఆ మంటని ఆర్పాలి. ఇది కోతి దినచర్య!

ఈ దినచర్యని కోతిచేత నెలల తరబడి చేయించి, దానికి బాగా ‘ప్రాక్టీస్’ అయ్యేట్టుగా ఆ కోతిని తీర్చిదిద్దాడు. అతడు చేయించిన ‘ప్రాక్టీస్’ మూలంగా కోతి ఈ పన్లన్నీ చాలా సునాయాసంగా చేయగలిగేది. ఎందుకంటే నిరంతర సాధనలో దానికా పని బాగా అలవాటై పోయింది. ఈ విషయం. . .సరిగ్గా ఈ విషయం బాగా రూఢి పరుచుకున్న తర్వాత ఆ శాస్త్రవేత్త కోతికి ఒక పరీక్ష పెట్టాడు.

కోతిని ఈ సారి ఓ నది దగ్గరకి తీసుకు వెళ్ళాడు. ఆ నదిలో పారే పిల్లకాలువ పక్కన యిసుకలో ఆ రోజు కోతి దినచర్యని ప్రారంభించాడు. అయితే ఈసారి అతడు నీళ్ళకుండని అక్కడకి తీసుకెళ్ళలేదు. నది కాలువలో ఎటూ నీళ్ళున్నాయిగా. . .అందుకని. కేవలం గ్లాసు మాత్రమే తీసుకువెళ్ళి కాలువ ప్రక్కన నేలమీదుంచాడు. మిగతాదంతా మామూలే. చితుకులు వెదజల్లడం, అగ్గిపెట్టె గట్రా అంతా మామూలుగానే చేశాడు.

అప్పుడు కోతేం చేసింది. మామూలుగానే చితుకులన్నీ ఓపిగ్గా వేరి ఒక చోట కుప్ప చేసింది. అగ్గిపెట్టె తీసుకుని పుల్లని వెలిగించి, చితుకుల్ని మంట చేసింది. గబగబా పరుగెట్టుకుంటూ వెళ్ళి గ్లాసుని చేతిలోకి తీసుకుంది. అంతవరకూ బాగానే వుంది.

ఆ తర్వాత అది నీళ్ళకుండ కోసం ఆ చుట్టుప్రక్కల వెతకసాగింది. వెతికీ, వెతికీ ఎంతకీ కుండ కనబడకపోయేసరికి నిరుత్సాహపడిపోయింది. చితుకుల మంటని అర్పలేక గ్లాసుని చేత్తో పట్టుకుని నిస్సహాయంగా అలా నిలబడిపోయింది. ప్రక్కనే పిల్లకాలువలో నీళ్ళున్న విషయం అది గ్రహించలేకనే పోయింది.

అప్పుడా శాస్త్రవేత్తకి ఓ విషయం స్పష్టమయింది. మానవుడికి భాష తెలుసు. ఆ భాషతో కుండలోనివీ నీళ్ళేననీ, కాలువలోనివీ నీళ్ళేననీ, వర్షంలో వచ్చేవీ నీళ్ళేననీ, సముద్రంలో, చివరకి భూమిలోనుండి వచ్చేవీ నీళ్ళేననీ భాష ద్వారా కలుపుకుని, అవన్నీ నీళ్ళనే ఓ భావన ఏర్పరచుకున్నాడు.

అదే కోతి విషయంలో దానికి భాష లేదు. కనుక, రకరకాల ప్రదేశాల్లో వున్న నీళ్ళని అది కలుపుకోలేదు. అందువల్ల దానికి భావనలో(అనొచ్చా) కుండలోవున్నవి మాత్రమే నీళ్ళు. ప్రక్కనే నది కాలువలో నీళ్ళున్నా అది గ్రహించలేదు. కనుకనే నిస్సహాయురాలైంది (బహుశా ఈ శాస్త్రవేత్తకి పిచ్చెత్తిందా అని ఆలోచించింది కాబోలు).

కాబట్టి, మానవుడికీ, కోతికీ వున్న ప్రధానమైన తేడా భాష అని ఆ శాస్త్రవేత్త ఒక నిర్ధారణకు వచ్చాడట. (మనిషికీ, కోతికీ మెదడులో కూడా మౌలికమైన కొన్ని మార్పులున్నాయనుకోండి. అది వేరే విషయం.)

కనుక, కోతి మన తాతే. కాకుంటే దానికి భాష రాదు. మనకి వచ్చు. ఆ వచ్చిన భాష ఎంతవరకూ వెళ్ళిదంటే. . . .

మకరంద బిందు బృంద రస్యందన సుందరమగు మాతృభాషయే. . .
మహానంద కందళ సందోహ సంధానతుందిలమగు మాతృభాషయే. . .
నమ్రతకు నమ్రత. . . కఠినతకి కఠినత. . .
బిగికి బిగి. . . జోరునకు జోరు. . .
ఎదురెక్కువకెదురెక్కువ. . .
అన్ని వన్నెలు. . .అన్ని చిన్నెలు. . .
అన్ని హొయలు. . .అన్ని యొయ్యారములు. . .
అన్ని తళుకులు. . .అన్ని బెళుకులు. . .కలిగి. . .
కవిత్వమునకు. . .గానమునకు. . .గద్యమునకు. . .
సంపూర్ణార్హత గల భాషయే. . .!!! (అప్పుడెప్పడో చదివా. తప్పులుంటే మన్నించగలరు. క్రింది వాటిలో కూడా.)
అంటూ పానుగంటి వారు తెలుగు భాషలో తెలుగుభాషను ఘనకీర్తించినా,

విధాత తలపున ప్రభవించినదీ
అనాది జీవననాదం. . .
ప్రాణ నాడులకు స్పందన నొసగిన
ఆది ప్రణవ నాదం. . .
అంటూ సీతారామశాస్త్రి తెలుగులోనే ప్రభవించినా,

అరివీరషండ. . .నిర్మూలనోద్ధండ. . .
దోర్దండ. . .ఉద్ధండ. . .మణిమండితులు. . .
మేరు సమానధీరులు. . .మా శత సోదరులు వుండగా. . .
అంటూ తెలుగుతేజం నందమూరి వారు తెలుగులో గర్జించినా,

నేను సైతం ప్రపంచాగ్నికి సమిథనొక్కటి
ఆహుతిచ్చాను. . .
అంటూ శ్రీశ్రీ వారు తెలుగులో విప్లవించి విరచించినా,

అది భాషకున్న ఔన్నత్యమే!! మరీ మన తెలుగు భాష ఔన్నత్యం!!!

ఏమంటారు?
( సమాప్తం )

Tuesday, October 9, 2007

జీనో పేరడాక్స్ లూ – పూర్వపక్షం!..4

జీనో పేరడాక్స్ లూ – పూర్వపక్షం!

“చూశారా! నేను జీనో పేరడాక్సుల మాయా పద్మవ్యూహపు ముడులు సైతం విప్పగలుగుతున్నాన”నే భేషజం కోసమో, మహోజ్వలమైన, విలక్షణమైన గ్రీకు తత్వశాస్త్ర చరిత్రలో ‘కలికితురాయి’ లాంటి ‘జీనో’ వంటి మహోన్మహుడ్ని కించపరచాలనుకోవడమో ఈ వ్యాస ఉద్దేశ్యం కాదు. ఒక సామాన్యుడనైన నేను గ్రీకు తత్వశాస్త్రానికే ప్రౌఢ గాంభీర్యాన్ని అలిమి, కొత్త పుంతలు తొక్కించిన జీనో వారికి ఏ మాత్రం గానూ, మరే విధంగానూ సాటిరాను. కాకుంటే ఒక తత్వవేత్త ఒక విషయాన్ని తన తర్కం ద్వారా నిరూపణకి తీసుకువచ్చినప్పుడు, అతడు తద్వతిరేకమైన వాదనలో ఏ విషయాలు విస్మరించాడో ప్రపంచానికి తెలియచెప్పే భావప్రకటనా స్వేచ్ఛ ఈ లోకంలో ప్రతివారికి లాగానే నాకూ వుంది. ఆ ప్రయత్నంలో భాగమే ఈ వ్యాసం. దానికి తగ్గట్టుగానే ఆనాడు “విశ్వదర్శనం”లో శ్రీ నండూరి రామమోహన రావు వారు చెప్పిన మాటలు చూడండి.

“ప్రతిదీ కామన్ సెన్స్ కు అనుగుణంగా వుండాలన్న వాదం కుదరదు. జీనో వంటి పారభౌతికవాదుల సిద్ధాంతాలు కేవలం తర్కాన్ని ఆధారం చేసుకున్నట్టివి. అవి అసంబద్ధంగా వున్నవని తోస్తే వాటిని తిరిగి తర్కంతోనే పూర్వపక్షం చేయాలి. ఏమైనా చాలా శతాబ్దాల పాటు కొరుకుడు పడని జీనో పేరడాక్సుల పద్మవ్యూహాన్ని ఈ శతాబ్దంలో అభివృద్ధి అయిన నూతన గణితశాస్త్రాన్ని ఉపయోగించి ఛేదించడం సాధ్యమైందని అంటున్నారు.” (విశ్వదర్శనం, ప్రధమ ప్రచురణ పుట.60).

ఈ మాటలే ఈ వ్యాసానికి ప్రేరణ. ఏదియేమైనా, పాచ్య, పాశ్చాత్య తత్వశాస్త్రాల్ని తెలుగు ప్రజానీకానికి పరిచయం చేసి, ఆయనే స్వయంగా అన్నట్టు నా వంటి సామాన్యుల మనః కుహరాంతరాలలోనికి సైతం జొచ్చి, మా చేత మరో కొలంబస్ అమెరికా ఖండ యాత్రనూ, మరో చంద్రలోక యాత్రనూ చేయించిన శ్రీ నండూరి రామమోహన రావు వారు ఎనభై సంవత్సరాల వయసుకి దగ్గరగా విజయవాడలో నివసిస్తున్నట్టు తెలియవస్తున్నది(తప్పయితే క్షమించగలరు). వారికీ, వారి సాహిత్య సేవలకూ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ, ఆయనకు మరిన్ని ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుడుని ప్రార్థిస్తూ, ఈ వ్యాసం ముగిస్తున్నాను.

(సమాప్తం)