ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి,  అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. ."ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల"నీ, "ఒక పూర్తి మానవుడిగా పరిణమించాల"నీ, నేను కంటున్న కల,  కడుతున్న కోట. . .ఒహ్ ఇంతెందుకు కనుచూపు మేరలో. . . నా జీవితం ఒక వేద సంకలనం!!  నేనొక ఈశ్వరుడిని!!! ( ఇది ఈ బ్లాగులోని ప్రసంగి కథలో ఒక పాత్ర మనోభావాలు __ రచయిత )

Monday, August 20, 2007

కుచేలుడు!.. 2 (కథ)

కుచేలుడు!

(‘స్వాతి’ సపరివార పత్రిక పంచరత్నాల కథల పోటీలో రూ.5,000 బహుమతి పొందిన ఉత్తమ పౌరాణిక కథ! సంచిక 9-.11.2001 లో ప్రచురితమైంది. ఐదు లక్షల పాఠకులకు ‘స్వాతి’ అందించిన కానుక అన్న ప్రశంసలు ఆనాడు నాకు కురిపించింది)


ఆ రోజు మిథునాపుర మహానగరం రాజకోట సందడిగా వుంది. పుష్ప అలంకరణలతో మామిడాకుల శోభలతో దీపప్రభల కాంతులతో కోట విరాజిల్లింది.

“కుచేలుడి మీద రాజుకి దయగలిగింది. కుచేలుడికి రాజానుగ్రహం కలిగింది. ఆ పరాయిదేశపు బ్రాహ్మడి పంట పండింది.” అంటూ ఆ నగర పౌరులంతా కుచేలుడి గురించి గుసగుసలుగా చెప్పుకోసాగారు.

కోటలో సభామండపం కళకళలాడింది. విధ్వాంసులతో, విధ్వన్మణులతో, మంత్రి, మహాసేనానీ, సపరివార పరిచారకగణంతో సభ నిండుగా వుంది. మహారాజు సతీసమేతుడై సింహాసనం అధిష్టించాడు. వారి ప్రక్కనే వైముఖ యువరాజు కూర్చున్నాడు.

సభ మధ్యభాగంలో మహారాజు సింహాసనంకి ఎదురుగా ప్రత్యేకంగా ఒక ఆసనం ఏర్పాటు చేయబడింది. ఆ ఆసనం మీద కుచేలుడు కూర్చుని వున్నాడు.

కుచేలుడి వైపు చూశాడు మహారాజు. “బ్రాహ్మణోత్తమా! మీ భక్తితత్పరత గురించి విన్నాం. ముగ్దులమయ్యాం. మీ వంటి వారిని తగిన విధంగా గౌరవించడం మా విధిగా మేము భావించినాం! అందుకే లక్షమంది జనాభా గలిగిన పశ్చిమంవైపు కౌముదీపుర సంస్థానాన్ని మీకు రాసివ్వదలిచాం! ఇక మీదట మీరే దానికి పాలకులు! మీకిది అంగీకారమేనా?” అన్నాడు మహారాజు.

ఆ మాటలు విని, కుచేలుడు ఆసనంలోంచి లేచాడు. వినమ్రంగా చేతులు కట్టుకున్నాడు.

“ప్రభూ! తమరి దయావీచికలు ప్రసరించిన నా జన్మ ధన్యం. నేను తమకి, తమ దేశపౌరులకి సర్వదా కృతజ్ఞుడిని. కానీ, మహారాజా నేనొక మామూలు మనిషిని. ఏదో భగవన్నామ జపంలో పూటగడుపుకునే వాడిని. నా కెందుకు ప్రభూ ఈ రాజ్యభారం. నన్ను మన్నించండి. ఆ భారం నా తలపై మోపకండి!” అన్నాడు.

కుచేలుడి మాటలు విన్న మహారాజు ఆశ్చర్యపడి, “లేదు కుచేలవర్యా! మీరు సమర్థులు! మాటలో స్పష్టత, ప్రవర్తనలో క్రమబద్దత, నడవడికలో నమ్రత కలిగివున్న మీరు కౌముదీపుర సంస్థానాధీశులుగా ఆన్ని విధాలుగా సమర్థులని నాకు తెలుసు. నిరాకరించకండి. కాదనకండి. కౌముదీపురం చేపట్టి, పరిపాలించి అఖండమయిన కీర్తి ప్రతిష్టలు సముపార్జించండి!” అన్నాడు.

కుచేలుడు మహారాజు వైపు చూశాడు. “కీర్తిప్రతిష్టలనేవి అసలెందుకు మహారాజా?” అడిగాడు.

మహారాజు నవ్వి, “అదేమిటి కుచేలవర్యా ఆమాట? కీర్తిప్రతిష్టలెందు కంటారు? ఇహలోకంలో శాశ్వితాలు కీర్తిప్రతిష్టలేగదా. . .? మహాపండితులు మీకు తెలియనిదేమున్నది.” అన్నాడు. కుచేలుడు అందుకున్నాడు.

ద్వారకానగరం నుండి మిథునాపురం వరకూ నేను రప్పించబడటానికి ఏది కారణభూతమయిందో. . . ద్వారపాలకులు కూడా దగ్గర చేరనీయని ఒక మానవాధముడిని ఏది సభామధ్యంలో కూర్చుండబెట్టిందో. . .ఏది కూటికి కొరగాని బిచ్చగాడిని క్షణంలో కౌముదీపుర సంస్థానాధీశుడిని చేసిందో. . . అది. . . అదంతా కీర్తిప్రతిష్టలే కావా మహారాజా?” అడిగాడు.

“కావచ్చు!” అన్నాడు మహారాజు సాలోచనగా.

“ఇంకా నాకెందుకు మహారాజా కీర్తిప్రతిష్టలు? అహంభావంతో మాట్లాడుతున్నానని భావించకండి. ఆశతో ప్రపంచాన్ని జయించిన వాడికన్నా ఏ ఆశా లేక కౌముదీపురాన్ని చేజిక్కించుకున్న నేను యశోవంతుడిని కాదా?”

మహారాజు మాట్లాడలేదు.

ప్రభూ! నన్ను మన్నించండి. కీర్తి అనేది కేవలం ఒక ప్రాపంచికమైన విలువ. ఆశతో కూడినది. నేను ఆథ్యాత్మిక మానవుడిని. అంటే ఆశ అంతరించిన వాడిని. ఎందుకో మానసం మాధవుడిపై లగ్నమైవుంది. మాధవుడి నామ ధ్యానమే తప్ప, ఆ మాధవుడి నుండి కూడా ఏ సాయం ఆశించనివాడిని. చివరకి మోక్షాన్ని కూడా నేను అభిలషించను. నాపై దయచూపి, నన్ను విడిచి పెట్టండి. నాపై ఏ రాజ్యభారాలూ మోపకండి.” కుచేలుడు మహారాజుని వేడుకున్నాడు.

కుచేలుడి మాటలు విన్న మహాధ్వజదైవికుడు సింహాసనం పైనుడి లేచాడు. ఒకానొక ఆనందాతిశయం కళ్ళ వెంట వర్షించగా కుచేలుడిని చేరుకున్నాడు. మెల్లగా వంగి కుచేలుడి పాదాలు స్పృశించినాడు.

“ధన్యతమయింది భక్తాగ్రేసరా! నా బ్రతుకు ధన్యతమయింది! సామ్రాజ్యవాద కాంక్షతో అనుక్షణం వెంపర్లాడే నాకు కీర్తి కూడా ప్రాపంచికమైన విలువేనని మీ ద్వారా తెలిసి, జ్ఞానోదయమయింది. ఆశ నశించినప్పుడే ఆథ్యాత్మికం సాధ్యమని భోదపడింది!”

లేచాడు. లేచి వెనక్కి తిరిగాడు. “సేనాపతీ!” అన్నాడు.

పరుగున వచ్చాడు సేనాధిపతి. “ఆనతి మహారాజా!” అన్నాడు.

“వెళ్ళండి! ఆ పవిత్ర మానవుడిని తీసుకుని ద్వారకా నగరం వెళ్ళండి. ఆయనను ఇల్లు చేర్చిరండి.” వెళ్ళబోయాడు. ఇంతలో ప్రజల్ని కన్నబిడ్డల్లా పాలించే క్షాత్ర ధర్మం ఆయన వెన్ను తట్టింది.

“అన్నట్టు మరిచాను. కుచేలురవారు మిధునాపురి ప్రవేశించి రెండు దినాలైంది. అక్కడ ఆయన బిడ్డలు ఏదైనా తిన్నారో లేదో. . . ఆయన ఏదీ పుచ్చుకోరు. వెళ్ళేప్పుడు పాతిక మానికల బియ్యమైనా పట్టుకు వెళ్ళండి. ఆయన సహధర్మచారినికి అవి యిచ్చి రండి! అంతకుమించి మనం చేయగలిగిందేమీ లేదు.” సభను మధ్యంతరంగా ఆపి, అన్యమనస్కుడై మహారాజు శయన మందిరంలోకి నడిచాడు. వైముఖుడు నవ్వుకున్నాడు.

* * * *

ధనధాన్యాలకి కుచేలుడు లొంగి రాలేదు. రాజ్యకాంక్ష, కీర్తికాంక్ష కూడా అతడిలో లేవు. ఈ విషయం వైముఖుడికి అర్థమైపోయింది. ఇక మిగిలింది స్త్రీ కాంక్ష! కుచేలుడు అధిక సంతానవంతుడు గనుక అతడిలో స్త్రీ వ్యామోహం వుండడానికి అవకాశముంది. కాబట్టి, స్త్రీని ప్రయోగిస్తే కుచేలుడు లొంగి రావచ్చు. ఈ ఆలోచన రాగానే వెంటనే దాన్ని ఆచరణలో పెట్టాడు వైముఖుడు.

మిథునాపుర రాజనర్తకి శ్రీమతి వైజయంతీదేవి ఏకైక పుత్రిక. . . కుమారి పుష్పికా త్రిలోచన అపురూప సౌందర్యవతి. ఆమెని కుచేలుడిపై ప్రయోగించదలిచాడు వైముఖుడు. కావలసిన ఏర్పాట్లన్నీ క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే పూర్తి చేసుకున్నాడు.


ఆరోజు సాయంత్రం కుచేలుడు మిథునాపురం నుండి ద్వారకకి ప్రయాణం కావలసివుందనగా ఆరోజు ఉదయమే సూర్యోదయ వేళకి వైముఖుడు కుచేలుడు విడిదిచేసిన అతిధి గృహం చేరుకున్నాడు.

ఆయనను కలిసి, “రాజనర్తకి వైజయంతీదేవి మహాలక్ష్మీ వ్రతం చేయతలపెట్టిందనీ, ఆ సందర్భంగా ఒక సద్బ్రాహ్మణునికి ఆతిధ్యం యివ్వదలచిందనీ, అందుకుగానూ కుచేలురవారిని ఎంపిక చేసుకుందనీ చెప్పి, వారి ఆతిధ్యం స్వీకరించేందుకుగానూ కుచేలుర వారిని ఒప్పించవలసిందిగా వైజయంతీదేవి తనని వేడుకున్నదనీ, ఆ పనిమీదే వచ్చాన”నీ నమ్మబలికాడు.

వైముఖుడి అభ్యర్ధన విని కుచేలుడు కొంచెం ఆలోచించాడు. ‘మహాలక్ష్మీ వ్రతం’ అనేసరికి ఆయన మససు పీకింది. ఆతిథ్యం తంతు ఒకవేళ ఉదయం నుండీ మధ్యాహ్నం వరకూ సాగినా, సాయంత్రానికి తను యధాప్రకారం ద్వారక ప్రయాణించవచ్చు. ఏ ఆటంకమూ లేదు. బాగా ఆలోచించుకుని “సరే!” నన్నాడు.

అంతే! నిముషంలోపు అతిధి గృహంకి పూలపల్లకీ రప్పించబడింది. మరికొంతసేపటికి ఆయన పల్లకీలో బయలుదేరి అక్కడినుండి నగర మధ్యంలోని వైజయంతీదేవి నివాసగృహం చేర్పించబడ్డాడు.

కొంత సమయం గడిచింది. అప్పుడు వచ్చింది లోనుండి అక్కడికి పద్దెనిమిదేళ్ళ జగద్విఖ్యాత సుందరి పుష్పికా త్రిలోచన. క్షణంసేపు కృష్ణనామ జపం ఆపి, ఆమె వైపు చూశాడు కుచేలుడు. ఏ అవయవం ఎక్కడ అమరాలో అక్కడే అమరి, ఏ వంపు ఎక్కడ తిరగాలో అక్కడే తిరిగి నిలువెల్లా సుకుమారతను నింపుకుని వుంది ఆ శరీరం. బంగరు వన్నెల కాంతితో మెరుస్తోంది.

పొడవుగా వున్న వాలుజడను పుష్పికా త్రిలోచన ఒక మృదువైన విసురుతో ముందుకేసుకుని, కొద్దిగా వంగి మొదట ఆయనకి కళ్ళతోనే ప్రణామం చేసింది. తర్వాత, పచ్చ కర్పూరం కలిపిన పళ్ళెంలోని నీళ్ళు అయనకి అందించింది.

( సశేషం )

0 అభిప్రాయాలు: