ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి,  అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. ."ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల"నీ, "ఒక పూర్తి మానవుడిగా పరిణమించాల"నీ, నేను కంటున్న కల,  కడుతున్న కోట. . .ఒహ్ ఇంతెందుకు కనుచూపు మేరలో. . . నా జీవితం ఒక వేద సంకలనం!!  నేనొక ఈశ్వరుడిని!!! ( ఇది ఈ బ్లాగులోని ప్రసంగి కథలో ఒక పాత్ర మనోభావాలు __ రచయిత )

Wednesday, September 19, 2007

మహాపరాధి!..2

(‘విపుల’ సచిత్ర మాస పత్రిక కథల పోటీలో రూ. 1500 లు బహుమతి పొందిన నా మొట్ట మొదటి కథ! ‘విపుల’ 1996 మార్చి నెల సంచికలో ప్రచురించబడింది. ‘వేదగిరి రాంబాబు గారు’ వెలువరించిన 1996 తెలుగు కథల సమీక్షా గ్రంథంలో ఒక అజ్ఞాత వ్యాసకర్త ‘మంచి కథలు రాయగలిగిన శక్తి గల్గిన పదశిల్పి ఈ రచయిత’ అంటూ నన్ను ప్రస్తుతించినారు. ఆనాడు ఈ కథ మీద వెల్లువెత్తిన సమీక్షలెన్నో, పలుకరించి, పరామర్శించిన వ్యక్తులెటువంటివారో ఈ కథ ముగింపులో వివరిస్తాను. ఈ తరం పాఠకులకి కథ మొదట్లో కొంత యిబ్బందికరంగా అన్పించినా చివర్లో ఒక అద్భుతమైన సన్నివేశంతో పాఠకుల మనసుల్ని కలచివేసి ఒక ఆత్మిక విలువని అందజేస్తుందని విన్నవించుకుంటున్నాను. కనుక ఈ బ్లాగు సందర్శించే ప్రతి ఒక్కరినీ పేరు పేరునా దయవుంచి ఈ కథను చదివితీరమని ప్రార్థిస్తున్నాను!)

మహాపరాధి!

జ్ఞాన కౌముది శ్రద్దగా వింటున్నాడు.

“ఇవిగాక రాజకీయ నాయకుల్లాగా ఒకర్ని ఒకరు కూలద్రోయడానికి ప్రయత్నాలు. ఒకరు అభివృద్ధిని పొందితే మరొకరికి ఈర్ష్య, అసూయ, ద్వేషం! ముప్ఫై ఆరేళ్ళ ఆశ్రమ అనుభవం నాది. నా ఇరవై ఐదవయేట ఈ ఆశ్రమంలో ప్రవేశించాను. మతాన్ని విస్తరించడం కోసం నేను తిరగని దేశం లేదు. బర్మా, థాయ్ లాండ్, కంబోడియా, ఇండోనేషియా, నేపాల్ ఎన్నని చెప్పమంటావు? ఇరవై మూడేళ్ళ సుదీర్ఘకాలంలో కేవలం ఒకటే పని! భగవద్గీతను ప్రచారం చేయడం! అంతటితో దానికి స్వస్తి చెప్పి పదమూడేళ్ళుగా భగవదాన్వేషణ చేస్తున్నాను.”చివరి మాటలు అంటున్నప్పుడు నారాయణాచార్యుల కళ్ళలో బాధ కనిపించింది. ఆయన నిగ్రహించుకున్నాడు.

జ్ఞాన కౌముది మంత్రదండం పక్కనపెట్టి ముందుకి వంగాడు. ఆయన ముఖంలో జిజ్ఞాస కనబడుతోంది.

ఎక్కడి ఈశ్వరుడు కౌముదీస్వామీ! ఆ పరమాత్ముని కోసం ఆయన పరమ దర్శనం కోసం నేను చేయని ప్రయత్నం ఏమున్నదని? “రామ, రామ రామం”టూ కళ్లుమూసి రాముని సాకారాన్ని హృదయంలో ప్రతిష్టించుకుని, ఆసనం వేసి, రాత్రి ధ్యానించడం మొదలుపెడితే, తెల్లగా తెల్లవారిపోయి భావతీవ్రత మిగిలేదేగానీ శ్రీరాముడేడి? పోనీ ‘అది పొరపాటేమోన’ని నిరాకార సాధన చేయదలిస్తే నిద్ర ముంచుకొచ్చేదేగానీ నిరాకారుడికి తావెక్కడ? నేనెవరు? నేననుకుంటున్న నాలోని ఈ నేనుకాని నేను ఎవరు? నేను నేనేనా? ఎన్ని ప్రశ్నలు? ఎన్ని నిద్రలేని రాత్రులు? ఎన్ని ఉపవాసపు దినాలు? స్త్రీని, జిహ్వను జయించడానికి ఎన్ని అర్థంలేని ప్రయత్నాలు? జ్ఞానం కోసం ఎన్ని గ్రంధాలు? ఎంతటి కాలయాపన? అన్నీ నిరర్ధకాలయాయి! చివరకి ఏంగ్జయిటీ, డిప్రెషన్ లాంటి మనోరుగ్మతలు మిగిలాయి. దైవం నాకు లభించలేదు. ఆశ్రమ నియమాలు ఉల్లఘించి పాశ్చాత్య దర్శనాలు కూడా పఠించాను. ప్రయోజనం లేదు. ఒక్కొక్కసారి అసలు ఈశ్వరుడికి అస్థిత్వముందా అన్న సందేహం కూడా కలిగేది. అయితే ఆ విషయం బయటికి ప్రస్తావించడానికి వీల్లేదు. చెప్పడమంటూ జరిగితే శ్రీ పరీక్షిత చతుర్వేదివారు సాధన కొరవడింది. దైవాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావంటారు. నువ్వు విశ్వాసాన్ని పొదివి పట్టడం లేదు. తప్పు మార్గంలో పయనిస్తున్నావంటారు. బాగా అణచడానికి ప్రయత్నిస్తారు! నిన్నగాక మొన్న ఆశ్రమవాసం చేసిన పిల్లస్వాముల దగ్గర్నుండి చతుర్వేది గారి వరకూ తమ తమ దైవానుభవాల్ని గురించి చెపుతూంటే నాకు నవ్వొచ్చేది. అల్ప మనోవికారాల్ని సైతం వదులుకోలేని ఈ అమాయకులకి ఈశ్వర కటాక్షం లభించడమా? విశ్వసించలేను. ప్రతివాడూ అసత్య ప్రచారం చేసుకుంటున్నాడు. స్వంత అవసరాల కనుగుణంగా దైవాన్ని వినియోగించు కుంటున్నాడు. ఒకడ్ని ఒకడు మోసగించుకుంటున్నాడు. నాకివన్నీ అసహ్యాన్ని కలిగిస్తున్నాయి స్వామీజీ! అసహ్యాన్ని కలిగిస్తున్నాయి!” నారాయణాచార్యులు ఆగి, శ్వాస తీసుకున్నారు.

“పైగా చేసిందే చేయరా అన్నట్టు ఈ ధూప దీప నైవేద్యాలూ, ఈ ఆగరొత్తుల వాసన, ఈ ఆడంబరాల ఖరీదుతనం, ఈ భగవద్గీత, ఈ బ్రహ్మం, అద్వైతం, భవం, అలౌకికం లాంటి పదాలు నాకు రొటీన్ అయిపోయి జీవితం యాంత్రికంగా మారి దుర్భరమై పోయింది. అందుకే నేను ఆంధ్రదేశం వెళ్ళిపోవాలనుకున్నాను. ఆశ్రమ అధ్యక్షులవారికి నాకు అనుమతి యిప్పించమంటూ వినతిపత్రం సమర్పించాను. అయితే ఒక్క విషయం. . .” నారాయణచార్యులు ఆగి మళ్ళీ చెప్పాడు.

“శ్రీ వైకుంఠ జగన్నాథ త్రివేదీ వారి అన్వేషణ గురించీ, దైవానుభవం గురించీ నాకు అవగాహన లేదు కాబట్టి నేను వారి ఒక్కరి గురించి మాత్రం ప్రస్తావించడం లేదు.” ఆగి నారాయణాచార్యులు లేచాడు.

ఇప్పుడు చెప్పండి కౌముదీ స్వామీజీ? యిప్పుడు చెప్పండి! ఎవరు హిందువుడు? భార్యాబిడ్డల్ని పోషించలేక ఆశ్రమంలో చేరి, తిని బలిసినవాడా? తోటి మతస్థులను నిందించి వాళ్ళ విశ్వాసాల్ని కూలద్రోసేవాడా? బానపొట్టతో పిలకజుట్టు ముందుకేసుకుని విమానాల్లో మత ప్రచారం చేసేవాడా? తను రాసింది తనే చదువుకుని పరులు చెప్పింది చెవికెక్కించుకోనివాడా? ఎవరు హిందువుడు మహర్షీ? ఎవరు హిందువుడు? పవిత్ర మతాన్ని స్వప్రయోజనాల కోసం వాడుకునే వీళ్ళు. . .వీళ్ళా హిందువులు?” నారాయణాచార్యులు ఉద్వేగంతో ఊగిపోతూ చివరగా ఒకమాట అన్నాడు.

పనీపాటా చేయకుండా తిని తిరిగే వాళ్ళని బికారీజనంగా వర్గీకరించారు ఆధునికులు. ఇక మన విషయానికొస్తే, మనం చేసే అన్వేషణలో మనకే భగవంతుడు లభ్యం కాడు. ఇక మనం చెప్పగా విన్న పామర సామాన్యజనానికి అసలే లభించడు. ఈ మాట అన్ని మతాల వారికీ వర్తిస్తుంది. పోతే సాంఘిక ప్రయోజనం అంటారా? అదీ లేదు. ప్రపంచమంతా పాశ్చాత్య సంస్కృతికి హారతులు పడుతున్న నేపథ్యంలో మన మతమేగాదు ఏ మతమూ ప్రత్యేకంగా ఒనగూర్చే ప్రయోజనం ఏదీలేదు. . . మత సంఘర్షణలూ, మృత కళేబరాల రాసులూ తప్ప.”

నారాయణాచార్యులు జ్ఞాన కౌముది భుజాలు పట్టి ఊపుతూ అడిగాడు.

“ఇది చెప్పండి మహర్షీ? యిది చెప్పండి? మనం. . .మనం ఆశ్రమంలోని వారందరం ఆధునికులన్నట్టు బికారులం. పచ్చిబికారీ సన్యాసులమని నేనంటే మీరు కాదనగలరా జ్ఞానకౌముదీ? మీరు కాదనగలరా?”

తన భుజాలు పట్టి కుదిపివేస్తున్న ఆ ఆచార్యుడిని ఏమనగలడు జ్ఞానకౌముది? ఏదైనా అనడానికి ఆయన వయసు తనకి లేదు. అనుభవం లేదు. జ్ఞానం లేదు. నైతిక హక్కే లేదు. వీటన్నింటికంటే ప్రధానంగా అహం అసలే లేదు.

అందుకే మౌనం దాల్చాడు.
* * * *

ఆరోజు ఆశ్రమంలోని కాన్ఫరెన్స్ హాలు స్వామీజీలతో క్రిక్కిరిసింది.

అది ఆశ్రమ ఉపాధ్యాక్షులు శ్రీ వేదార్థం నారాయణాచార్యుల వారికి గృహస్థాశ్రమ అనుమతి యివ్వాలా? వద్దా? అన్న నిర్ణయం జరిగే రోజు! అదొక గడ్డు సమస్య! ఆశ్రమ అధ్యక్షులు శ్రీ వైకుంఠ జగన్నాథ త్రివేదీ వారు అర్జంటుగా లేని ప్రయాణం కల్పించుకుని ఫిలిప్పీన్స్ వెళ్ళిపోయి, ఆ సమస్య నుండి తప్పించుకున్నారు. ఆ పని వ్యవస్థాపకులకి అప్పగించబడింది. ఫిలిప్పీన్స్ వెళ్ళేప్పుడు అధ్యక్షులు ఒక్క మాట మాత్రం అన్నారట. “నేను ఆ మహాత్ముని నిష్క్రమణ పత్రం చూసి దిగ్భ్రాంతి చెందాను. ఆయన పోకడ నాకు తీరని విచారం కలుగజేస్తోంది. కానీ దైవ సంకల్పం ఆయన నిష్క్రమణాన్ని కోరుతోంది.” అని.

వేదిక మీద శ్రీ పరీక్షిత చతుర్వేది, శ్రీ విష్ణుదుబే, ఆచార్య ఇంద్రకరణ్ భట్, శ్రీ మహీపాల కుల్ కర్ణి, శ్రీ జితేంద్ర అవస్థి, ఆచార్య పండరీనాథ్, శ్రీ లక్ష్మణ్ అనంతాళ్, శ్రీ ముకుందా మిశ్రా, శ్రీ అవినాష్ తివారీ అందరూ ఆసీనులయారు. నారాయణాచార్యులు ఓ వైపుగా కూర్చున్నాడు. ఆయన హృదయం అన్నింటికీ సిద్ధమయ్యేవుంది.

చతుర్వేది ఒక్కసారి గొంతు సవరించుకున్నాడు. ఆయన ఉపన్యాసం మైక్ ల ద్వారా ఆశ్రమంలోని ప్రతి గదిలోపల విన్పించే ఏర్పాటు చేయబడింది. ఆయన ఇంగ్లీషులో ఉపన్యాసం ప్రారంభించాడు.

“శ్రీ హైందవ ప్రచారక పరిషత్తు ఆశ్రమ ఉపాధ్యక్షులు శ్రీశ్రీశ్రీ వేదార్ధం నారాయణాచార్యులవారు అనబడే ఈ హైందవ ఆచార్యులు ముప్ఫై ఆరేళ్ళ క్రితం పంతొమ్మిది వందలా యాభై ఎనిమిదిలో ఈ ఆశ్రమ ప్రవేశం చేశారు. అప్పటి అధ్యక్షులు శ్రీశ్రీశ్రీ పరశురామ చతుర్వేది వారు ఆయన వేద గీతా పాండిత్యాలకు మెచ్చి ఆశ్రమ ప్రవేశం కల్పించారు. ఈయన ఆంధ్రులు! ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరుజిల్లా విశాలపురం వాస్తవ్యులు. ఈయన ఆశ్రమానికి చేసిన సేవలు అపారమైనవి. పద్దెనిమిది భారతీయ భాషలలోనూ, పది విదేశీ భాషలలోనూ ఈయన ఉద్దండులు! ఈయన వివిధ భాషల్లో మత శాస్త్రం పైన ఏడు గ్రంధాలూ, తత్వ శాస్త్రం మీద నాలుగు గ్రంధాలూ రచించారు. భారతదేశంలోనేగాక విదేశాల్లో కూడా హిందూమతాన్ని వ్యాపింపజేయడానికి విశేషమైన కృషి సల్పారు. ఈయన ఆశ్రమ ప్రవేశం చేసేటప్పుడు అధ్యక్షులవారికి రాసిన లేఖలో రెండు ముక్కలు దైవాంశ సంభూతులుకు వినిపించడం మన సాంప్రదాయం!” ఆగి, చతుర్వేది పొట్ట తడుముకుంటూ బర్రున ముక్కు చీదాడు. ఆ తర్వాత లేఖ నందుకుని చదువసాగాడు.

( సశేషం )

0 అభిప్రాయాలు: