ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి,  అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. ."ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల"నీ, "ఒక పూర్తి మానవుడిగా పరిణమించాల"నీ, నేను కంటున్న కల,  కడుతున్న కోట. . .ఒహ్ ఇంతెందుకు కనుచూపు మేరలో. . . నా జీవితం ఒక వేద సంకలనం!!  నేనొక ఈశ్వరుడిని!!! ( ఇది ఈ బ్లాగులోని ప్రసంగి కథలో ఒక పాత్ర మనోభావాలు __ రచయిత )

Thursday, September 20, 2007

మహాపరాధి!..3

(‘విపుల’ సచిత్ర మాస పత్రిక కథల పోటీలో రూ. 1500 లు బహుమతి పొందిన నా మొట్ట మొదటి కథ! ‘విపుల’ 1996 మార్చి నెల సంచికలో ప్రచురించబడింది. ‘వేదగిరి రాంబాబు గారు’ వెలువరించిన 1996 తెలుగు కథల సమీక్షా గ్రంథంలో ఒక అజ్ఞాత వ్యాసకర్త ‘మంచి కథలు రాయగలిగిన శక్తి గల్గిన పదశిల్పి ఈ రచయిత’ అంటూ నన్ను ప్రస్తుతించినారు. ఆనాడు ఈ కథ మీద వెల్లువెత్తిన సమీక్షలెన్నో, పలుకరించి, పరామర్శించిన వ్యక్తులెటువంటివారో ఈ కథ ముగింపులో వివరిస్తాను. ఈ తరం పాఠకులకి కథ మొదట్లో కొంత యిబ్బందికరంగా అన్పించినా చివర్లో ఒక అద్భుతమైన సన్నివేశంతో పాఠకుల మనసుల్ని కలచివేసి ఒక ఆత్మిక విలువని అందజేస్తుందని విన్నవించుకుంటున్నాను. కనుక ఈ బ్లాగు సందర్శించే ప్రతి ఒక్కరినీ పేరు పేరునా దయవుంచి ఈ కథను చదివితీరమని ప్రార్థిస్తున్నాను!)

మహాపరాధి!

“నా పేరు వేదార్థం నారాయణాచార్యులు! ప్రస్తుతం సైన్సులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని డాక్టరేట్ చేస్తున్నాను. మాది విశాలపురం. మా తండ్రిగారు స్వర్గీయ వేదార్ధం హనుమాచార్యులుగారు. మా అన్నగారు స్వర్గీయ అనంతాచార్యులు గారు. వదినగారు శ్రీరంగవల్లికా దేవిగారు. ఆమెకు ముగ్గురు ఆడపిల్లలు. ఈ మధ్యనే అన్నగారు ఓ అగ్నిప్రమాదంలో మరణించినారు. మాది ఆర్థికంగా బాగా చితికిపోయిన కుటుంబం. వదినగారు వారి పిల్లల బాధ్యత నాపైన పడింది. నాకు చిన్ననాటి నుండి తాత్విక చింతన ఎక్కువ. ఎల్లప్పుడూ వేదాంతపుటాలోచలతో సతమతమయ్యే వాడిని. ఆ జిజ్ఞాసతోనే వేదాలు, ఉపనిషత్తులు, అరణ్యకాలు, దర్శనాలు, ఇతిహాసాలు, భగవద్గీత మొదలైనవన్నీ పఠించాను. అన్నింటిలోనూ నాకు యిష్టమయింది భగవద్గీత. నాకు ఈ లౌకిక ప్రపంచం మీద వైరాగ్యభావనలు కలుగుతున్నాయి. అది వైరాగ్యభావనో, వదినగారు, వారి పిల్లల బాధ్యత గురించిన భయమో నేను యిదమిద్ధంగా తేల్చి చెప్పలేను. ఏది ఏమైనప్పటికీ సర్వాన్నీ త్యజించి, బంధాలన్నింటినీ దూరం చేసుకుని, ఆశ్రమవాసం చేయడానికి నేను అంగీకరిస్తున్నాను.”

చదవడం చాలించి, చతుర్వేది బోడిగుండు తడుముకుని, “అది అప్పటి లేఖ. ప్రస్తుత నిష్క్రమణ పత్రం చూడండి!” అన్నాడు.

“హైందవ ప్రచారక పరిషత్తు ఉపాధ్యక్షుడినైన వేదార్ధం నారాయణాచార్యులు అనబడే నేను ప్రస్తుతం ఈ ఆశ్రమం నుండి నిష్క్రమించదలచుకున్నాను. కేవలం గృహస్థాశ్రమం మీద మనసు లగ్నం కావడం దీనికి హేతువు. ఆశ్రమవాసులెవరూ యిందుకు బాధ్యులు కారు.”

“అది సారాంశం!” అన్నాడు చతుర్యేది. ఆ సారాంశం అన్న పదంలో పెర్వర్షన్ శాతం ఎంతుందో నారాయణాచార్యులుకి అర్థం కాలేదు.

“తమకి ఈ వృద్దాప్యంలో గృహస్థాశ్రమం మీద మనసు లగ్నమయిందా ఆచార్యా?” నారాయణాచాల్యుల్ని అడిగాడు. చతుర్యేది.

వెటకారం మొదలైంది.

“ఔను!” ముభావంగా చెప్పాడు నారాయణాచార్యులు. ‘ఈవిల్’ ని భరించడానికి తను ఎప్పుడో సిద్ధమయ్యేడు.

“తమరు గృహస్థాశ్రమం స్వీకరించిన తర్వాత వివాహం చేసుకో నిశ్చయించుకున్నారా? చతుర్వేది ప్రశ్న. ‘డిసానర్’ ఆయన మాటల్లో ఎప్పుడూ కన్పించే లక్షణం!

“లేదు” అన్నాడు నారాయణాచార్యులు

“మరి ఏమి చేయబోతున్నారు?” ఏమి అన్న పదాన్ని వత్తి పలుకుతూ అన్నాడు చదుర్వేది.

“తెలీదు.”

“వదినగారి బాధ్యత తీసుకుంటారా?” ఈసారి బాధ్యత మీద పడింది భారం. చతుర్వేది సొల్యూషన్స్ చాలా భయంకరంగా వుంటాయి. ‘నోబిలిటీ’ అన్నదాన్ని ఆదర్శంలో సైతం చంపుకున్న వ్యక్తి. మాట్లాడుతున్నది ఉపాధ్యక్షులతోనన్న సెన్సు కూడా వుండదు.

ఇక నారాయణాచార్యులు జాప్యం చేయదలచుకోలేదు. ఇంకా ఆలస్యం చేస్తే చతుర్వేది తీసుకోబోయే ఛార్జ్ కి ‘క్వాలిటీ ఆఫ్ మెర్సీ’ మరీ సన్నగిలిపోయి విషయం నవ్వుల పాలవుతుంది. అందుకే అన్నాడు.

“ఆశ్రమం నుండి వెళ్ళిపోయిన తర్వాత నా జీవితం గురించిన జిజ్ఞాస కనబరచడం అధిష్టాన వర్గానికి భావ్యంకాదు. ఆశ్రమ నియమాలకు యిది విరుద్ధం!”

చతుర్వేదుల వారి పని అయిపోయింది. నియమాల పేరుతో కట్టె విరక్కుండానే పాము చచ్చింది. అందుకే ఉపసంహారంగా నిర్ణయపత్రం చేతిలోకి తీసుకున్నాడు. భృకుటి ముడివేసి, గంభీరంగా దాన్ని చదువసాగాడు.

“ఉపాధ్యక్షులు శ్రీశ్రీశ్రీ వేదార్ధం నారాయణాచార్యులవారి అభ్యర్థన అంగీకరించబడినది. ఈయన యిన్నేళ్ల ఆశ్రమ జీవితం గడిపిన తర్వాత కూడా ఐహిక సుఖాల్ని వదిలిపెట్టలేకపోయిన ఆచార్యుడిగా అధిష్టానవర్గం పరిగణించింది. ఆయనను అర్థం చేసుకుని గృహస్థాశ్రమానికి పరిషత్తు వీలు కల్పిస్తుంది. ఇప్పటినుండి ఆయన ఏ క్షణంలోనయినా ఆశ్రమవాసం వదులుకుని నిష్క్రమించవచ్చు. మళ్ళీ ఆయన ఏ క్షణంలోనయినా ఆశ్రమ ప్రవేశం చేయ నిర్ణయించుకుంటే అందుకు కూడా పరిషత్తు వీలు కల్పిస్తుంది.”

చతుర్వేది లేచాడు.

నారాయణాచార్యులు ఆశ్రమానికి చేసిన సేవలకి గుర్తింపుగా ‘ఆయన సంరక్షణార్థం’ ఆశ్రమ ఖాతాలోంచి ఇరవై లక్షల రూపాయల నగదు బ్యాంక్ చెక్ రూపంలో యివ్వబడింది. ఆశ్రమం వదిలిపెట్టిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయన ఆశ్రమం పేరు వినియోగించుకుని డబ్బు సంపాదించకూడదన్న షరతు విధిగా విధించబడింది. ఆయన నిష్క్రమణం గురించి బి.బి.సీ. టీవీకీ యితర మతసంస్థలకూ తెలియపరచబడింది. ఆయన ఆధ్యాత్మిక జీవితం గురించి ఆయన పేరుతో ఒక పుస్తకం ‘మోనోగ్రాఫ్’ విడుదల చేయబడింది. ఆ సంవత్సరం పరిషత్తు ‘యియర్ బుక్’ మీద ఆయన ముఖచిత్రం ప్రచురించాల్సిందిగా నిర్ణయించడం జరిగింది. నారాయణాచార్యులు ధర్మశాల నుండి ఢిల్లీ వరకూ కారులో వెళ్ళేట్టుగానూ, అక్కడినుండి హైదరాబాద్ వరకూ ఫ్లయిట్ లో కమర్షియల్ కేటగిరీలోనూ, హైదరాబాదు నుండి విశాలపురం వరకూ తిరిగి కారులో ప్రయాణం చేసేట్టుగానూ ఏర్పాట్లకు ఆదేశాలు జారీ చేయబడ్డాయి. అంతా సిద్ధమయింది!

తన కృషికి ఆశ్రమం యిచ్చిన పారితోషికం ఇరవై లక్షలు. నారాయణాచార్యులు నవ్వుకున్నాడు. రెవెన్యూ ఆఫీసులో ఒక హెడ్ గుమాస్తా రిటైర్ మెంట్ నాటికి సంపాదించినంత. అసలు డబ్బు అవసరం వుందో లేదో కూడా ఆయనకి తెలీదు. వద్దని వారించాలనుకున్నాడు. కానీ అది తన ఆత్మన్యూనతాభావాన్ని, ఆశ్రమం పట్ల తన అగౌరవాన్ని కనబరిచే చర్యగా భావించి మానుకున్నాడు.
* * * *
కారు విశాలపురం సమీపిస్తున్నకొద్దీ నారాయణాచార్యుల మనసు సంఘర్షించసాగింది. ‘ఆశ్రమం వదిలి వస్తున్నప్పుడు శ్రీ జ్ఞానకౌముదీ స్వామి తనకి వీడ్కోలు చెప్పడానికి రాలేదు. బహుశా చింతాక్రాంతులై వున్నారు కాబోలు! ఆనాడు తను వదినగారికి తెలీకుండా యిల్లు వదలి ఆశ్రమంలో చేరినప్పడు ఆమెగారు కూడా ఈ స్వామీజీలాగే బాధపడినారు కాబోలు!’

కారు డ్రైవర్ ఏకాగ్రతతో డ్రైవింగ్ చేసుకుంటూ వెళుతున్నాడు.

‘వదినగారు శ్రీరంగవల్లికాదేవిగారు ఎలా వున్నారో? ముగ్గురు పిల్లల్నీ ఎట్లా పోషించారో? ఆమెగారికి కూచిపూడి నృత్యంలోనూ, హరికథల్లోనూ మంచి ప్రవేశం వుంది. భరతనాట్యం కూడా కొంత తెలుసు. బహుశా ఏ శిక్షణ సంస్థో నడిపి దాని ద్వారా వచ్చిన పైకంతో జీవించివుంటారు. తను యింతకాలం ఆశ్రమంలో ఉన్నత పదవిలో వున్న విషయం కూడా వదినగారికి తెలీనట్టుంది. తెలిసుంటే తనను కలుసుకునే ప్రయత్నం చేసి వుండేవారు.

ముఫ్పై ఆరేళ్ళ సుదీర్ధకాలం తర్వాత తన రాకను ఆమెగారు ఎట్లా ‘రిసీవ్’ చేసుకుంటారో? సంతోషించగలరా? ఆవేదన చెందుతారా? పిల్లలు పినతండ్రి వచ్చారని పండుగలు చేసుకుంటారు కాబోలు! వారందరికీ వివాహాలు అయిపోయి వుంటాయి. వారు వాళ్ళ పిల్లలకు తనని చూపించి తాతగారు అని పరిచయం చేస్తారు కాబోలు. ఆశ్రమంలో తన పదవిని గురించి విని విభ్రమం చెందుతారు!

నారాయణాచార్యులు తన ఆలోచనలకి తనే నవ్వుకున్నాడు. “మనిషి తన పరంపరాగత స్వభావాన్ని మార్చుకోలేడ”న్న జీన్ పాల్ సార్త్రే మాటలు గుర్చొచ్చాయి! నిజమేననిపించింది. కాకపోతే యోగం చేసిన తనేమిటి? సామాన్యునిలా సంఘర్షంచడమేమిటి?

కారు విశాలపురం చేరేటప్పటికి సాయంత్రం ఆరున్నరయింది! ఊరి పొలిమేర దగ్గరే కారును ఆపి, తను దిగి, డ్రైవర్న్ ని వెనక్కి వెళ్ళిపొమ్మని ఆదేశించాడు. కారు వెళ్ళిపోయింది. ఆయన అక్కడినుండి వూరిలోకి నడక ప్రారంభించాడు. చేతిలోనున్న బ్రీఫ్ కేస్ల్ లో బ్యాంక్ చెక్ వుంది. అప్పటికే వూర్లో దీపాలు వెలిగించారు.

ఊరు పూర్తిగా మారిపోయింది. నాగరికత చెందింది. చెరువుగట్టూ, పంటపొలాలూ, పిల్లకాలవా, గోధూళి, ఎడ్లబండ్లూ లేగదూడలూ, పోలిగాడూ, సుబ్బీ యివేమీలేవు. వాటి స్థానంలో భవంతులూ, విశాలమైన రోడ్లూ, పార్కులూ, బస్ స్టాపులూ కొత్తగా వచ్చి చేరాయి!

( సశేషం )

0 అభిప్రాయాలు: