ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి,  అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. ."ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల"నీ, "ఒక పూర్తి మానవుడిగా పరిణమించాల"నీ, నేను కంటున్న కల,  కడుతున్న కోట. . .ఒహ్ ఇంతెందుకు కనుచూపు మేరలో. . . నా జీవితం ఒక వేద సంకలనం!!  నేనొక ఈశ్వరుడిని!!! ( ఇది ఈ బ్లాగులోని ప్రసంగి కథలో ఒక పాత్ర మనోభావాలు __ రచయిత )

Friday, September 21, 2007

మహాపరాధి!..4

(‘విపుల’ సచిత్ర మాస పత్రిక కథల పోటీలో రూ. 1500 లు బహుమతి పొందిన నా మొట్ట మొదటి కథ! ‘విపుల’ 1996 మార్చి నెల సంచికలో ప్రచురించబడింది. ‘వేదగిరి రాంబాబు గారు’ వెలువరించిన 1996 తెలుగు కథల సమీక్షా గ్రంథంలో ఒక అజ్ఞాత వ్యాసకర్త ‘మంచి కథలు రాయగలిగిన శక్తి గల్గిన పదశిల్పి ఈ రచయిత’ అంటూ నన్ను ప్రస్తుతించినారు. ఆనాడు ఈ కథ మీద వెల్లువెత్తిన సమీక్షలెన్నో, పలుకరించి, పరామర్శించిన వ్యక్తులెటువంటివారో ఈ కథ ముగింపులో వివరిస్తాను. ఈ తరం పాఠకులకి కథ మొదట్లో కొంత యిబ్బందికరంగా అన్పించినా చివర్లో ఒక అద్భుతమైన సన్నివేశంతో పాఠకుల మనసుల్ని కలచివేసి ఒక ఆత్మిక విలువని అందజేస్తుందని విన్నవించుకుంటున్నాను. కనుక ఈ బ్లాగు సందర్శించే ప్రతి ఒక్కరినీ పేరు పేరునా దయవుంచి ఈ కథను చదివితీరమని ప్రార్థిస్తున్నాను!)

మహాపరాధి!

నారాయణాచార్యులు ఊరి లోపలికి ప్రవేశించాడు. తన యిల్లెక్కడో గుర్తుపట్టడం కష్టంగా వుంది. శ్రమను మరిచిపోయిన అరికాళ్లు మంటపుడుతున్నాయి. మెల్లగా వీధిని పోల్చుకున్నాడు. ఇల్లే తెలీడం లేదు. అటు వేపుగా వెళ్తున్న ఒక ముసలివాడిని పిలిచి, “వేదార్థం శ్రీ రంగవల్లికాదేవిగారి యిల్లు చూపించగలరా?” అని అడిగాడు.

ఆ ముసలివాడు ఆయన అవతారాన్ని పైనుండి కిందిదాకా తేరిపారజూసి, “రాండి!” అంటూ ముందుకు దారితీశాడు. ‘రాండి’ ఎంతకాలం తర్వాత తన మాండలిక భాష వింటున్నాడు. ‘చెవుల్లో పాయసం పోసినట్టు’ అనుభూతి కలిగింది.

ముసలివాడు ఒక యింటిముందు ఆగి, “యిదే యిల్లు.” నిర్యక్ష్యంగా చెప్పి వెళ్ళిపోయాడు. చీకటిపడుతోంది.

ఇంటివేపు చూశాడు. ఆస్ బెస్టాస్ సిమెంటు రేకులు పరిచిన డాబా యిల్లు! అది తన యిల్లు కాదు. బహుశా వదినగారు స్వంత యిల్లు అమ్ముకుని దీన్ని బేరం చేసి వుంటారు. ఆమెగారు ఆర్థికంగా ఆభివృద్ధి సాధించినట్టులేరు. తలుపు దగ్గరకి వెళ్ళి తట్టబోయాడు. అది తెరిచే వుంది. లోపలికి ప్రవేశించాడు. వరండాలో ఎవరూ లేరు. లైట్ వెలుగుతోంది. చుట్టూ చూశాడు. ఒక కుర్చీ వుంది. పాతది. మౌనంగా వెళ్ళి అందులో కూర్చున్నాడు. ఆలా కూర్చుంటున్నప్పుడు కుర్చీ కదిలి, కొద్దిగా అలికిడైంది.

“ఎవరు? ఎవరది?” అలికిడి కావడంతో ఓ స్త్రీ కంఠం లోపల్నుంచి అరిచింది. ఆ కంఠం వదినగారిదేనా? పోల్చుకోలేక పోతున్నాడు. ఎవరని చెప్పాలి తను? మౌనంగా వుండిపోయాడు.

కొద్దిసేపు తర్వాత ఆవిడ రానే వచ్చింది. వచ్చి గుమ్మం దగ్గర నిలబడింది.

ఒక్కసారి ఆమెను సంపూర్ణంగా పరికించి చూశాడు నారాయణాచార్యులు. అరవై అయిదేళ్ళ వృద్దురాలు. నడుము వంగింది. శరీరం కృంగింది. చర్మం ముడుతలు పడింది. వయసు పండింది. ఆ వృద్దురాలు వదినగారే! సందేహం లేదు. కానీ, ఆమెగారి కళ్ళలో మునుపటి వైభవ చిహ్నాలేమీ లేవు. శరీరంలో ‘దర్పం’ కూడా లేదు.

ఆ వృద్దురాలు నారాయణాచార్యుల్ని కళ్ళజోడులోంచి పరిశీలనగా చూస్తూ, స్వామిగార్లా? అంది. క్షణం పాటు ఆమె ముఖంలో చిరునవ్వు కదిలి మాయమయింది.

నారాయణాచార్యులు ఆమె తనను గుర్తిస్తుందేమో ననుకున్నాడు. లేదు. గుర్తించినట్టు లేదు. “స్వామిగార్లు కాదు. నేను. . .నేను . . .నారాయణాచార్యుల్ని. . .మీ మరిది గారిని” చెప్పబోయాడు. ఉద్వేగం ఎక్కువైపోయింది. కంఠం పెగలడం లేదు. ఇరవై ఎనిమిది భాషలు అనర్గళంగా మాటలాడిన కంఠం. ఉద్దండ పండితుల్ని తర్కంతో మట్టికరిపించిన కంఠం మూగవోయింది. మూగబోయి ఒక్కమాటా పలుకలేకపోయింది.

“ఒసే! ప్రమీలా, నాగవల్లీ, రండే! మీకోసం స్వామిగార్లొచ్చారు.” రంగవల్లికాదేవి కేకేసింది.

నారాయణాచార్యులు చెప్పడానికి ప్రయత్నిస్తూనే వున్నాడు. లాభం లేదు. ఉద్వేగం ఆగడం లేదు.

ఎవరో లోపల్నుండి వస్తున్నట్టు కాలి అందెల చప్పుడు.

ముగ్గురు అమ్మాయిలు!

వాకిలి దాటుకుని బయటకి వచ్చి గోడ దగ్గర వరుసగా నిల్చున్నారు. అంతా వయసు నలభైయేళ్ళకు కొద్ది అటు యిటుగా వున్నవారే.

నారాయణాచార్యుల మనసుకి ఏదో కృత్రిమత్వం తోచింది. వాళ్ళ కట్టు, బొట్టు, వ్యవహారం అంతా వింతగా వుంది. వాళ్ళు తన అన్నగారి బిడ్డలా? అయితే వాళ్ళెందుకలా వున్నారు?

అన్నీ ప్రశ్మలే! సమాధానం లేదు! అడగాలని వుంది కంఠం సహకరించడం లేదు. కొంత సమయం తర్వాతగానీ ఈ ఉద్వేగం తగ్గి తను మామూలు మనిషి కాలేడు. ఎందుకో మనసు కీడును శంకిస్తోంది

ఇంతలో, “వీళ్ళలో మీకెవరు కావాలి స్వామీ?” పెదాల్ని పగలగొట్టుకుని బయటికి వస్తున్న నవ్వును బలవంతంగా ఆపుకుంటూ అడిగింది శ్రీరంగవల్లికాదేవి.

ఆ ఆచార్యుడికేమీ అర్థం కావడంలేదు. ఎవరు కావాలేమిటి? అయోమయంగా ఆ అమ్మాయిల వైపు చూశాడు. ఎదురుగా నిల్చునున్న ఆ ముగ్గురిలో ఒక అమ్మాయి వీపు గోడకి ఆన్చి వయ్యారంగా నిల్చుని కాలు వూపుతూ నవ్వుతోంది. మరొక అమ్మాయి నవ్వుతూనే ఎంతో నైపుణ్యంగా పైట కిందికి జార్చి వక్షస్థలం చూపుతోంది. ఇంకో అమ్మాయి ఆయన అవతారం పరిశీలిస్తూనే కన్నుగీటింది.

అతడు మూర్ఖుడు కాడు! అర్థమైపోయింది. వ్యభిచారం. . ! వదిన గారు శ్రీ వేదార్ధం శ్రీరంగవల్లికాదేవిగారు చేస్తున్నది వ్యభిచారం. . .పడుపువృత్తి. . . సానితనం. . .ప్రాస్టిట్యూషన్!!!

(సశేషం)

0 అభిప్రాయాలు: